Home News అక్రమ చర్చి నిర్మాణం విషయంలో ఉదాసీనత: అధికారులపై ఎన్.హెచ్.ఆర్.సికి గ్రామస్థుల ఫిర్యాదు 

అక్రమ చర్చి నిర్మాణం విషయంలో ఉదాసీనత: అధికారులపై ఎన్.హెచ్.ఆర్.సికి గ్రామస్థుల ఫిర్యాదు 

0
SHARE

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా దొరసానిపల్లి గ్రామంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మించేందుకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి ఇళ్లను ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, కడప జిల్లా కలెక్టర్ను సంప్రదించి అట్టడుగు వర్గాల కుటుంబాలపై చర్చి పాస్టర్లు చేసిన దౌర్జపై చర్యలు తీసుకోవాలని, చర్చి నిర్మాణాన్ని ఆపి వేయాలని కోరారు. దీంతో అక్కడ చర్చి నిర్మాణం ఆగిపోయింది. ఈ సంఘటన మరువకముందే రాష్ట్రంలో మరోసారి చర్చి పాస్టర్లు తమ ఆగడాలను ప్రదర్శించారు.

తాజాగా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గ్రామంలో హిందూ కుటుంబాలు మాత్రమే నివసించే ప్రాంతంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మాణం ప్రారంభించారు. అనుమతులు లేకుండా, అక్రమంగా, హిందువులు మాత్రమే నివసిస్తున్న ఇండ్ల మధ్యలో జరుగుతున్న ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని, దీనివల్ల గ్రామంలో శాంతి వాతావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు స్థానిక గ్రామ రెవెన్యూ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ దాకా పలుమార్లు ఫిర్యాదులు పంపారు. చట్టవిరుద్ధమైన ఆ నిర్మాణాన్ని ఆపివేయాలని గ్రామస్తులు అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు ముందుగా చర్చి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల గురించి స్థానిక అధికారుల నుండి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్నారు. ఆ చర్చికి ఎలాంటి అనుమతి లేదంటూ అధికారులు సమాచారం ఇచ్చారు.
మతపరమైన కట్టడాలు, ప్రార్థనా స్థలాల నిర్మాణానికి స్థానికులు జిల్లా కలెక్టర్ నుండి అనుమతి పొందాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ  29.11.2012 నాడు జారీచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో (జీవో ఎంఎస్ 376) స్పష్టంగా చెబుతోంది. పైగా ఇటువంటి నిర్మాణాలకు చుట్టుప్రక్కల వారి నుండి అభ్యంతరం వ్యక్తం కాకూడదు.

జీవో ఎం.ఎస్. 376కు విరుద్ధంగా చేపట్టిన చర్చి నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని గ్రామస్తుల ఫిర్యాదులను అధికారులు బుట్టదాఖలు చేయడంతో వారు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షకు దిగారు. శాంతియుత నిరసన చేపట్టిన తమను  స్థానిక పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని, తరచు పోలీస్ స్టేషన్ కు పిలిచి ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నట్టు తెలియజేసారు.


పోలీసుల వేధింపుల విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా, గ్రామస్తులకు అక్కడ కూడా న్యాయం జరగలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు న్యాయం కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.

గ్రామంలో చట్టవిరుద్ధంగా తలపెట్టిన చర్చి నిర్మాణాన్ని ఆపివేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోకపోగా కనీసం స్పందించట్లేదని, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కూడా ఇదే వైఖరి అవలంబిస్తున్నారని గ్రామస్థులు మానవహక్కుల కమిషన్ కు తెలియజేసారు. గ్రామ స్థాయి నుండి జిల్లా అధికారుల వరకు తమని దేశంలో రెండవ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారని అన్నారు. తాము ఈ దేశానికి చెందిన  సమస్యలపై చట్టపరంగా న్యాయమార్గంలో ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించపోగా, మమ్మల్నే బెదిరిస్తున్నారని తమ ఫిర్యాదులో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమని ఇతర దేశాల నుండి వచ్చిన శరణార్థుల చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. శాంతియుతంగా జీవించే తమ ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడుతోందని, మా సమస్యల్ని లేవనెత్తి నందుకు మమ్మల్ని అణచివేసే ధోరణి లో అధికారులు వ్యవహరిస్తున్నారని ఇది భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన సమానత్వ హక్కు భంగం కలిగించేలా ఉందని గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, పునర్నిర్మాణంలో తాము కూడా పాలుపంచుకుంటున్నామని, తమ పట్ల వివక్షాపూరిత వైఖరి తగదని ఆవేదనను వ్యక్తంచేశారు.

Source: Organiser