Home News ఆంధ్రప్రదేశ్: మతం మారిన క్రైస్తవులు అనుభవిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చర్యలకు కేంద్రం ఆదేశం 

ఆంధ్రప్రదేశ్: మతం మారిన క్రైస్తవులు అనుభవిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చర్యలకు కేంద్రం ఆదేశం 

0
SHARE
మతం మారినప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ (సోషల్ వెల్ఫేర్ విభాగం)ని కోరింది. గతంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ స్వచ్ఛంద సంస్థ సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ప్రత్యేక దృష్టి నిలిపింది. షెడ్యూల్డ్ కులాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మతమార్పిళ్లపై ఎల్.ఆర్.పి.ఎఫ్ పరిశోధనాత్మక నివేదికలను గతంలో కేంద్ర ప్రభుత్వంతో  పాటు భారత రాష్ట్రపతి కార్యాలయానికి కూడా పంపింది. దీనిపై ఇటీవల రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి కార్యాలయం నుండి సూచనలు అందిన కొద్దిరోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన  సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు రావడం విశేషం. పైగా తీసుకున్న చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.

నివేదిక సారాంశం:
ఏపీలోని ఉధృతంగా సాగుతున్న మతమార్పిళ్లపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ప్రత్యేక దృష్టి నిలిపింది.
దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, పొంచివున్న ప్రమాద ఘంటికలపై నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో చట్టాలు ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఈ నివేదికలోని కొన్ని ముఖ్య అంశాలు:
రోజురోజుకూ అధికమవుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. వీటి కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నానికి గురవుతున్నాయి, సామాజిక జీవనానికి ఆటంకం కలుగుతోంది, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. అంతేకాదు.. జాతి భద్రతకు సైతం ఇది పెనుప్రమాదంగా పరిణమించింది.
తమకు ప్రత్యేక దేశం కావాలంటూ కొందరు పాస్టర్లు చేస్తున్న ప్రసంగాలు మతం మారుతున్న వారి మెదళ్లలో దేశవ్యతిరేక బీజాలు నాటుతున్నాయి.. మరికొందరిలో సాటి మతాల పట్ల ద్వేషభావం కలిగిస్తున్నాయి. దేశభద్రతకు మాత్రమే కాదు. సామాజిక భద్రతకు కూడా ఇది ముప్పే.

[KGVID]https://vsktelangana.org/demo/wp-content/uploads/2020/07/VideoClip.mp4[/KGVID]

మతమార్పిడి చేస్తున్న వారి మాయలో పడ్డ అమాయకులు బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరుఅవ్వడం మానేస్తున్నారు. భార్యాభర్తల మధ్య చిచ్చుకు కూడా ఇవి కారణం అవుతున్నాయి.
రాష్ట్రంలో మతమార్పిళ్ల తీరుతెన్నులు, చట్టాల దుర్వినియోగం, ప్రభుత్వాల ఉదాసీనత ఏ స్థాయిలో ఉందో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ నివేదిక పరిశీలిస్తే అర్ధమవుతుంది .
నివేదికలో ఉదహరించిన దాని ప్రకారం.. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న చర్చిల సంఖ్య సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడం జరిగింది. ఈ సంఖ్య పరిశీలిస్తే ఆ మండలంలో మొత్తం 68 చర్చిలు ఉన్నాయి. ఆ మండలంలో ఉన్న గ్రామాల సంఖ్య మాత్రం 11.  అంటే.. సగటున గ్రామానికి 6 చర్చిలన్న మాట!!
2011 జనాభా గణన ప్రకారం రెడ్డిగూడెం మండలలోని క్రైస్తవ జనాభా 630. కానీ ఇదే మండలంలోని మద్దులపర్వ  గ్రామాన్ని తీసుకుంటే.. ఇటీవల సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ శాఖ ఇచ్చిన సమాచారం నివ్వెరపరుస్తుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఆ గ్రామంలో క్రైస్తవ జనాభా సున్నా (0). కానీ అక్కడ ఉన్న చర్చిల సంఖ్య మాత్రం ప్రభుత్వ రికార్డుల ప్రకారం 11!
క్రైస్తవులే లేని గ్రామంలో 11 చర్చిలు ఏ విధంగా సాధ్యం? అసలు అధికారులు ఆ చర్చిలకు ఏవిధంగా అనుమతి మంజూరు చేశారు? ఆ చర్చిలను నిర్వహిస్తున్నవారు, ఆ చర్చిలకు వెళ్తున్నవారు తమను తాము క్రైస్తవులుగా నమోదు చేసుకోవడం లేదన్న విషయం మనకు తెలుస్తుంది. ఇది ప్రభుత్వాలను మోసగించడం కాక మరేమిటి? అసలు అటువంటి సందర్భాల్లో ప్రభుత్వ అధికారులు సదరు చర్చిలకు ఏవిధంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు? ఈ నేరంలో వాళ్ళుకూడా పాత్రధారులే అన్నది ఇక్క స్పష్టమవుతోంది.
నివేదిక నుండి గ్రహించిన మరొక ఉదాహరణ చూద్దాం.. గత ఏపీ ప్రభుత్వం క్రైస్తవుల కోసం ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు అని సమాచార హక్కు చట్టం కింద కోరిన ప్రశ్నకు.. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగివున్న ప్రతి వ్యక్తిని ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ పధకం కింద లబ్దిదారుగా ఎంపిక చేస్తామంటూ గుంటూరు జిల్లా అచంపేట్ మండల రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తుంది. ఎస్సీ కుల ధ్రువీకరణ కలిగిన వారు క్రైస్తవులు ఎలా అవుతారు?
క్రైస్తవ మతమార్పిడులను కట్టడి చేసే విధానాలేవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించడం లేదన్న విషయం ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ జనాభాపై కొన్ని వార్తా ఛానెళ్లలో పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యలు అనేక అనుమానాలు కలుగజేస్తున్నాయి. రాష్ట్రంలో 30% క్రైస్తవులు ఉన్నారని కొందరు బహిరంగంగా చెప్తుంటే.. 2 కోట్ల మంది క్రైస్తవులు, 5 లక్షల పాస్టర్లు కలిసి 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ఏపీ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో ఓకే ఎమ్మెల్యేకు చేసిన సన్మాన కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
2011 జనాభా గణన అధికారిక లెక్కల ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6.82 లక్షలుగా ఉన్న క్రైస్తవ జనాభా ఈ 9 సంవత్సరాలలో ఏకంగా 2 కోట్లకు ఎలా చేరుతుంది? దీని బట్టి చూస్తే మతం మారిన క్రైస్తవులు తమ రిజర్వేషన్ల లబ్ది కోసం జనాభా గణనలో తప్పుడు లెక్కలు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఏమైపోతున్నారు?: 
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఏమైపోతున్నారు?” (What happened to Christians of AP) అంటూ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ సంస్థ తయారుచేసిన నివేదిక ఇక్కడ గమనించాలి. ఎస్సీ రిజర్వేషన్లు ఏవిధంగా దుర్వినియోగం అవుతున్నాయి అనే విషయాన్ని ఆ నివేదిక బయటపెట్టింది.
1971 నుండి 2011 కాలంలో రాష్ట్రంలోని క్రైస్తవ జనాభా ఏవిధంగా తగ్గుతూ వచ్చింది, అదే సమయంలో రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఏవిధంగా వృద్ధిచెందిందో అది తెలుపుతుంది.  విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు పొందే ఉద్దేశంతో క్రైస్తవంలోకి మారినప్పటికీ అధికారిక రికార్డుల్లో ఆ విషయాన్ని తెలియజేయకుండా దాచిపెడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు, తమకు విషయం తెలిసిన ప్రభుత్వ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనకు అర్ధమవుతుంది.
దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపితే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద అవినీతిగా తేలుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకుని ఈ వ్యవహారంపై సమగ్ర కసరత్తు చేసి, అక్రమ మతమార్పిళ్లు, రిజర్వేషన్ల దుర్వినియోగం అరికట్టేందుకు కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ, అందుకోసం ఒక నిజనిర్ధారణ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపాల్సిందిగా ఫోరమ్ తమ నివేదికలో కోరింది.
Reference: www.organiser.org