Home News శ్రీ పులుసు గోపిరెడ్డి అస్త‌మ‌యం

శ్రీ పులుసు గోపిరెడ్డి అస్త‌మ‌యం

0
SHARE

తెలుగు రాష్ట్రాల్లో తొలితరం స్వయంసేవకులలో పులుసు గోపిరెడ్డి గారు ఒకరు. సంఘ వ్యాప్తి కోసం ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో పాటు ఓరుగల్లుకు తరలివెళ్లి నిరంత‌రం సంఘం(ఆర్‌.ఎస్‌.ఎస్‌) కోసం కృషి చేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన వారు పులుసు గోపిరెడ్డి (86) ఇక లేరు. వృద్ధాప్యంతో ఆయ‌న ఈ బుధ‌వారం (మార్చి 31,2021) రోజున మృతి చెందారు. దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఇంటికే ప‌రిమిత‌మైన పులుసు గోపిరెడ్డి గారు అన్ని విషయాలలో, తాజా ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండే వారు. త‌న దృష్టికి వ‌చ్చిన విష‌యాల‌ను ఇత‌రుల‌తో చ‌ర్చించేవారు.

పులుసు గోపిరెడ్డి గారు వాకాడు (విద్యానగర్), వికారాబాద్ లో లెక్చరర్ గా పనిచేశారు. విజయవాడలో శారదా జూనియర్ కాలేజి, సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత మూడు సంవత్సరాలపాటు చత్తీస్ గఢ్ వెళ్లి వనవాసుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వ‌న‌వాసుల సేవలో కొత్త కోణాలను ఆవిష్కరించారు.

1973-73లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షునిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన గృహమే పోరాట కార్యకర్తలకు బసగా ఉంటూ ఉండెది. సమాలోచన అనే మేధావుల వేదికను విజయవాడలో ఏర్పాటు చేసి, చిరకాలం అధ్యక్షులుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప వ్య‌క్తుల‌ను విజయవాడకు పిలిపించి ఉపన్యాసా లిప్పించారు. జాతీయస్థాయిలో ఈ విధమైన వేదికల ఏర్పాటులో బహుశా ఇదే మొదటిది చెప్పవచ్చు.

జాగృతి పత్రికలో దశాబ్దాల పాటు `మనలోమాట’ అనే శీర్షికను నిర్వహించారు. పలు పత్రికలలో వందలాది వ్యాసాలు రాశారు. రాణాప్రతాప్, ఎదిగిన మనిషి (నవల), తరంమారింది (కథల సంపుటి), వికసిత సంఘ కుసుమం (మా. సోమేపల్లి సోమయ్య గారి జీవిత పరిచయం) దారిచూపిన దీపకళిక (శ్రీ గురూజీ జీవిత పరిచయం), వనయోగి (బాలాసాహెబ్ దేశపాండే జీవితపరిచయం), నేతాజీ, మరువ రాని మహామహులు మొదలైన ఎన్నో గ్రంథాలు పులుసు గోపిరెడ్డి గారు రచించారు.

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎందరో సామాజిక కార్యకర్తలకు మార్గదర్శిగా వ్యవహరిస్తూ విజయవాడతో పాటు ఆ సమీప జిల్లాలో సంఘానికి, జాతీయ భావంతో మెలగే ఉద్యమాలకూ పెద్దదిక్కుగా ఉండిన గోపిరెడ్డి మరణం ఒక పెద్దలోటు.