Home News తమ భూభాగంలో ఉగ్రవాద సంస్థలున్నట్లు ఒప్పుకున్న పాకిస్థాన్‌ దేశ విదేశాంగ మంత్రి

తమ భూభాగంలో ఉగ్రవాద సంస్థలున్నట్లు ఒప్పుకున్న పాకిస్థాన్‌ దేశ విదేశాంగ మంత్రి

0
SHARE

ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ స్వర్గధామంగా మారుతోందని అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భూభాగంలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పాక్‌ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఒప్పుకున్నారు. అయితే వాటిపై తమ దేశం కూడా చర్యలు తీసుకుంటోందని ఆసిఫ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆసిఫ్‌ ఈ వివరాలను వెల్లడించారు.

‘ఇందులో పెద్దగా ఆశ్చర్య పడాల్సింది ఏముంది? మేం కూడా ఆ ఉగ్రవాద సంస్థలను నిషేధించాం. గత మూడేళ్లుగా మా దేశం వాటికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది. ఈ విషయంలో యావత్‌ ప్రపంచం మమ్మల్ని వేలెత్తి చూపుతోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలను నియంత్రించేంత వరకూ అంతర్జాతీయ దేశాల నుంచి మేం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉండాలి. కానీ మేం ఆ ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాం. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటున్నాం. ఆయా సంస్థలపై ఆంక్షలు విధించాం. పాక్‌ భూభాగాలు ఉగ్రవాదానికి ఉపయోగపడుతున్నాయని వస్తున్న వార్తలను మాత్రం మేం ఖండిస్తున్నాం. ప్రపంచానికి మేం చెప్పేది ఒక్కటే.. ఉగ్రవాదంతో పాక్‌ ఏం చేయట్లేదు’ అని ఆసిఫ్‌ తెలిపారు.

ఇటీవల చైనాలోని షామన్‌ వేదికగా జరిగిన బ్రిక్స్‌ దేశాల సదస్సులో తొలిసారిగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థల పేర్లను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై తీర్మానం కూడా తీసుకొచ్చారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆసిఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేగాక.. బ్రిక్స్‌ తీర్మానంపై కూడా ఆసిఫ్‌ మాట్లాడారు. ‘బ్రిక్స్‌ నిర్ణయం తీసుకుంది అంటే అది కేవలం చైనా అధికారిక నిర్ణయం కాదు. అందులో రష్యా, ఇండియా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి’ అని తెలిపారు. గత కొంతకాలంగా చైనా పాక్‌కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిక్స్‌ సదస్సులో పాక్‌లోని ఉగ్రవాద సంస్థలపై తీర్మానం తీసుకురావడం, అందుకు చైనా కూడా అంగీకరించడంతో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

(ఈనాడు సౌజన్యం తో)