Home News పోలీసుల పర్యవేక్షణలో గోదావరి తీరంలో సామూహిక మతమార్పిళ్లు.. హిందువుల పుష్కర ఘాట్ల కబ్జాకు యత్నం 

పోలీసుల పర్యవేక్షణలో గోదావరి తీరంలో సామూహిక మతమార్పిళ్లు.. హిందువుల పుష్కర ఘాట్ల కబ్జాకు యత్నం 

0
SHARE
రాజమండ్రి: హిందువులు పరమ పవిత్రంగా భావించే గోదావరి నదీ తీరంలో సామూహిక మతమార్పిళ్లు చోటు చేసుకున్నాయి. ఏకంగా పోలీసుల పర్యవేక్షణలో ఇది జరగడం గమనార్హం. అంతంతరం పుష్కర ఘాట్లలో తమ మతమార్పిడి కార్యకలాపాలకు అనుమతివ్వాలని కొన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను కోరడం, వారు సరేనంటూ అంగీకరించడం, అభ్యంతరం తెలియజేసిన హిందూ కార్యకర్తలను పోలీసులు కేసుల పేరిట భయభ్రాంతులను  వంటి ఘటనల నేపథ్యంలో రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
హిందూ చైతన్య వేదిక తెలియజేసిన వివరాల ప్రకారం ఘటనల యొక్క వివరాలు ఈ దిగువున పేర్కొనడమైంది: 
15 నవంబర్ 2018 సాయంత్రం సమయంలో పట్టణంలోని మార్కండేయ స్వామి దేవాలయ సమీపంలో గల గోదావరి తీరంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు హిందువులను మతం మారుస్తూ, ఆ ప్రక్రియను తమ వీడియో కెమెరాల్లో చిత్రీకరించసాగారు. ఇది గమనించిన సమీపంలోని హిందువులు తమ పవిత్ర ప్రాంతంలో క్రైస్తవ మార్పిళ్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హిందువులు సమీపంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో చేరగా క్రైస్తవ పాస్టర్లు కూడా వారి వెనుకాలే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. 2007 సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ‘అన్యమత ప్రచార నిరోధక చట్టం’ (జీవో నెం. 746 & 747) ప్రకారం హిందూ దేవాలయాల వద్ద, ప్రార్ధనా ప్రదేశాల వద్ద ఇతర మతాల ప్రచారం, కార్యక్రమాలు జరుపరాదు. ఈ విషయమై హిందువులు చేసిన ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. పోలీసులు జరిగిన ఘటన గురించి రాజమండ్రి సబ్-కలెక్టరుకు తెలియజేయడంతో అతను “నదీ జలాలపై అందరికీ హక్కు ఉంటుంది” అని ముక్తాయించడంతో.. పట్టణ పోలీసులు మరియు ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో మార్కండేయ దేవాలయ పుష్కర ఘాట్లో క్రైస్తవులు యథేచ్ఛగా మతమార్పిళ్లు కొనసాగించారు. దీనిపై రాజమండ్రి డీఎస్పీ మరియు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ వివరణ ఇస్తూ.. మతమార్పిళ్ల కార్యక్రమానికి భద్రత కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ నుండి ఆదేశాలు ఉన్నాయని తెలియజేయడం గమనార్హం.
నిజానికి అక్కడ ఆ సమయంలో మతం మారుతున్న వారు ఎవరు, మార్చుతున్న వ్యక్తులు ఎవరు అనే కీలకమైన ప్రాథమిక సమాచారం కూడా పోలీసులు సేకరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
క్రైస్తవ పాస్టర్లు హిందూ పవిత్ర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పవిత్ర నదీ తీరప్రాంతాల్లో మతమార్పిళ్లు చేస్తున్నారంటూ జరిగిన ఘటనలు వివరిస్తూ నవంబర్ 16, 17, 18 తేదీల్లో హిందూ సంఘాలు జిల్లా కలెక్టర్, రాజమండ్రి సబ్-కలెక్టర్, ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి, హిందూ ప్రాంతాల పవిత్ర కాపాడాల్సిందిగా కోరారు.
నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మండల రెవెన్యూ అధికారి నుండి హిందూ సంఘాల ప్రతినిధికి ఫోన్ కాల్ వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి సబ్-కలెక్టర్ ఆధ్వర్యంలో క్రైస్తవ సంస్థల ప్రతినిధులతో శాంతి సమావేశం నిర్వహించి రాజీకి ప్రయత్నం చేస్తామని ఆ కాల్ సారాంశం. ఉన్న రెండు గంటల వ్యవధిలో కీలకమైన హిందూ సంఘాల ప్రతినిధులు సమావేశానికి చేరుకోవడం కష్టం. ఇది సదరు అధికారులకు కూడా తెలుసు. ఇదే విషయం స్పష్టం చేస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు స్వల్ప వ్యవధిలో ఇప్పటికిప్పుడు హాజరుకావడం కష్టమని, సమావేశాన్ని వాయిదా వేసి తగిన గడువు ఇవ్వాలని కోరారు. కానీ ఎవరూ లేకుండానే కేవలం క్రైస్తవ సంస్థల ప్రతినిధులతో సమావేశం జరిగింది.
జరిగిన ఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే సంస్థ సబ్-కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్లకు కొన్ని న్యాయపరమైన అంశాలకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతూ మెయిల్ ద్వారా ఒక లేఖ పంపించింది. ఆ వివరాలు ఈ దిగువ ఉన్నాయి.
– అసలు ముందు మతమార్పిళ్లు చేయడానికి కారణాలు ఏమిటో వివరంగా చెప్పాలి. ఒక సమూహంలో ఏ ఇద్దరికీ కూడా ఒకేసారి ఆకలి, దాహం వేయవు.. ఏ ఇద్దరూ ఒకేవిధంగా ఆలోచించరు. అలాంటిది అంతమంది ఒకేసారి మతం మారడానికి కారణాలు సబ్-కలెక్టర్ వివరించగలగాలి.
 
– ఇలాంటి బలవంతపు మతమార్పిళ్ల కోసం ఘాట్ల ఏర్పాట్లు ఎలా చేస్తారు? దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఏర్పాటు ఉందా? హోం శాఖకు ఈ వ్యవహారం మొత్తం తెలియజేస్తున్నారా అసలు? 
 
– అసలు మతం మారుతున్నవారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోందా? అటువంటి పద్దతి ఏమైనా ఉందా అనేది సబ్-కలెక్టర్ తెలియజేయాలి. 
 
– రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద మతమార్పిళ్ల కోసం ఘాట్ కావాలని కోరుతున్న క్రైస్తవ పాస్టర్ల వివరాలు ఏమిటి? వారు ఏ చర్చికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? 
 
– పాస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ చర్చిలకు అసలు ప్రభుత్వం నుండి అనుమతి ఉందా? ఒకవేళ ఉంటె వాటిని సబ్-కలెక్టర్ అవి చూపించాలి. 
 
– ఆ పాస్టర్లు ఇప్పటి వరకు ఎంతమందికి బాప్టిజం ఇచ్చారు? బాప్టిజం తీసుకున్నవారికి సర్టిఫికెట్లు ఇచ్చారా? ఆ రికార్డులు ప్రభుత్వం వద్దనున్నాయా? ఉంటె చూపించాలి. 
 
– ఈ పాస్టర్ల నుండి బాప్టిజం తీసుకున్నవారిలో వారిలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? ఎంతమంది బిసి-సి సర్టిఫికెట్లు తీసుకున్నారు? ఈ లెక్కలు ప్రభుత్వం వద్దనున్నాయా? ఉంటె చూపించాలి. 
 
రాజ్యాంగ వ్యతిరేకమైన, దేశ భద్రతకు, సంస్కృతీ సాంప్రదాయాలకు సంబంధించిన ఈ అంశాన్ని చట్టబద్ధం చేసే అధికారం ఎవరికీ లేదు.  
నవంబర్ 25వ తేదీ ‘ఈనాడు’ దినపత్రిక రాజమండ్రి సంచికలో ఒక వార్త ప్రచురితమైంది. ఎమ్మార్వో పుష్కర ఘాట్లలో ఒక ఘాటుని క్రైస్తవ పాస్టర్లకు తమ కార్యకలాపాల కోసం కేటాయించడం జరిగిందని ఆ వార్త సారాంశం. దీంతో ఆగ్రహించిన ‘హిందూ చైతన్య వేదిక’ ప్రతినిధులు ఆ చర్యను ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
నవంబర్ 26వ తేదీ క్రైస్తవ పాస్టర్లు మీడియాకు ఇచ్చిన లేఖలో “అగ్రకుల హిందువులు దళితుల హక్కులు కాలరాస్తున్నారు” అంటూ హిందువుల విన్నపాలను ఖండిస్తూ రాద్ధాంతం చేశారు.
నవంబర్ 27వ తేదీ ఉదయం హిందూ సంఘాల ప్రతినిధులు పంచాయితీ ఈవోకు వినతిపత్రం సమర్పిస్తూ ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్’ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.
..ఈ ఘటనల నేపథ్యంలో పరిస్థితి ఎటు తిరిగి ఏమవుతుందో అని భావించి క్రైస్తవ మతమార్పిళ్ల కోసం ప్రత్యేక ఘాట్ కేటాయింపు ఆలోచనకు అధికారులు ముగింపు పలికారు.
ఇదిలా ఉండగా.. ఇదంతా జరుగుతుండగా రాజమండ్రి మూడవ పట్టాన సర్కిల్ ఇన్స్పెక్టర్ కృపానందం, స్వామి అనే హిందూ కార్యకర్తను పోలీస్ స్టేషనుకి పిలిపించి ఆందోళన విరమించకుంటే నీపై ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తానంటూ బెదిరించడం గమనార్హం.
సాక్షాత్తు పోలీసులు, జిల్లా పాలనా యంత్రగమే మతమార్పిళ్లకు మద్దతు పలకడం, ప్రశ్నించిన హిందువులను కేసుల పేరిట భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనల పట్ల హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనలపై సంబంధిత అధికారులు, పోలీసులపై కేంద్ర హోమ్ శాఖ మరియు మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయనున్నట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తెలియజేసింది.