Home Telugu Articles కృషితో నాస్తి దుర్భిక్షం – ఒక ఆదర్శవంతమైన మహిళ కథ

కృషితో నాస్తి దుర్భిక్షం – ఒక ఆదర్శవంతమైన మహిళ కథ

0
SHARE

వీధులను శుభ్రపరిచే ఒక మహిళ తన పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దిందో తెలియజేసే కథ. సుమిత్ర దేవి గత 30 సంవత్సరాలుగా జార్ఖండ్‌ ప్రాంతంలోని జజకూ టౌన్‌ షిప్‌లో వీధులను శుభ్రపరిచే పని చేసింది. చివరికి ఉద్యోగవిరమణ సమయంలో ఆమె ఎంతో గౌరవ మన్ననలు అందుకుంటుందని ఈ ప్రాంతంలో ఎవరు ఊహించలేదు.

పదవీ విరమణ సందర్భంగా ఆమె సహోద్యోగులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది సాధారణంగా అందరికి జరిగేదే అయినా ఆ సమయంలో అక్కడకు ముగ్గురు ఉన్నత ప్రభుత్వో ద్యోగులు వచ్చారు. వచ్చీరాగానే ఆమె పాదాలకు నమస్కరించారు. వాళ్ళు ముగ్గురు ఆమె కొడుకులు.

సుమిత్ర దేవి పెద్ద కుమారుడు వీరేంద్ర కుమార్‌. అతడు రైల్వేలో ఇంజనీర్‌. రెండవ కుమారుడు డాక్టర్‌. మూడవ కుమారుడి పేరు మహేంద్ర కుమార్‌. అతనే కలెక్టర్‌.

తనపై అధికారులకు కుమారులను పరిచయం చేస్తూ ”నేను 30 సంవత్సరాలుగా ఈ వీధులను ఉడ్చాను కానీ నా పిల్లలు మీలాగే ఉన్నత స్థానాల్లో ఉన్నారు” గర్వంగా చెప్పింది.

తల్లి గురించి మాట్లాడుతూ ”మా అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎక్కడా మాకు తక్కువ చెయ్యకుండా, అనుక్షణం చదువు అవసరాన్ని, ఆవశ్యకతను మాకు చెబుతూనే ఉండేది. అప్పుడు ఆమె నేర్పిన పాఠాలే ఈ రోజు మమల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఇటువంటి తల్లి లభించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం” అన్నారు మహేంద్ర కుమార్‌.

మిగిలిన ఇద్దరు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. తమ తల్లి జీవితాన్ని చూసిన వారు ముగ్గురూ ఇతరులకు ఎంతో కొంత మంచి చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన కొడుకులు ఉన్నత స్థాయికి చేరినా, తన ఉద్యోగాన్ని వదలకుండా విరమణ వరకు త్రికరణ శుద్ధితో అంకితభావంతో కొనసాగించడం చెప్పుకోవాల్సిన విషయం. తన కలలు సాకారం చేసి తన బిడ్డలు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కారణమైన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే భావన తనకు ఏనాడు కలుగలేదని ఆమె అన్నారు.

మహేంద్ర కుమార్‌ భావోద్వేగంతో ”ఏ పని తక్కువ కాదు, కష్టం కాదు. నిజాయితీగా కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధ్యమే. మేము, మా అమ్మ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా నిలబడ్డామే కానీ కృంగిపోలేదు. మా అమ్మ కష్టానికి ప్రతిఫలంగా ఆమె కలలు సాకారం అయ్యే విధంగా మా జీవితాలలో మేము స్థిరపడి నందుకు నేను చాల గర్విస్తున్నాను” అన్నారు.

Courtesy: Lokahitam.Net