Home Rashtriya Swayamsevak Sangh సామాజిక రంగంలో మహిళా కార్యం – రాష్ట్ర సేవికా సమితి 

సామాజిక రంగంలో మహిళా కార్యం – రాష్ట్ర సేవికా సమితి 

0
SHARE

ఆర్‌.ఎస్‌.ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ … ఈ పేరు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ పరిచయానికి అక్కరలేని పేరు. ఈ పేరు ఒకటి, రెండు రోజులు లేదా ఒకటి, రెండు దశాబ్దాలలో వచ్చినది కాదు. సుమారు 100 సంవత్సరాల కాలంలో సాధించినది. ప్రతి దసరాకు  ఆర్‌.ఎస్‌.ఎస్ తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఈ దసరా రోజునే, మరొక సంస్థ కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఇది జనాభాలో సగం ఉన్న మహిళలకు సంబంధించిన సంస్థ. ఆర్‌.ఎస్‌.ఎస్ తో సమానంగా సమజాకార్యం చేస్తున్న ఈ హిందూ మహిళా సంస్థ ఇప్పుడు తన పరిధిని నిరంతరం విస్తరిస్తోంది. ఈ సంస్థను ఆర్‌.ఎస్‌.ఎస్ మహిళా విభాగం అని కొందరు అంటూంటారుకానీ, నిజానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ కు సమాంతరంగా నడుస్తోంది.  మహిళల ఆత్మగౌరవాన్ని నిలపడానికి కృషి చేస్తోంది.  ఈ మహిళా సంస్థ సంస్థ అనుసరించే సూత్రం ‘ఫెమినిజం’ కాదు `ఫామిలిజం’(కుటుంబభావన).  “మహిళలు దేశానికి మూలస్తంభం” అన్నది వీరి ప్రగాఢ విశ్వాసం.

రాష్ట్ర సేవిక సమితి స్థాపన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 1925 లో దసరా రోజున ప్రారంభమైంది, 1936 లో దసరా రోజునే రాష్ట్రీయ సేవికా సమితి వార్ధ (మహారాష్ట్ర) లో మొదలైంది. ఆ సమయంలో మహిళలకు చదవడం, రాయడం తెలియదు, ఇంటి నుండి బయటకురావడం కూడా సులభం కాదు. అటువంటి స్థితిలో ఉన్న హిందూ మహిళలను  స్వావలంబనదిశగా ఎలా నడపాలని ఒక మహిళ ఆలోచించింది. హిందూ మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, తమ పిల్లలకు కూడా మంచి విలువలు నేర్పించగలరు. అలాగే  దేశానికి, సమాజ అభివృద్దికి కూడా తోడ్పడతారని నమ్మింది. ఆమే- లక్ష్మీబాయి కేల్కర్. ఆమెనే ఆ తరువాత ‘మౌసిజీ’ అని పిలిచారు. ఆ పేరు ఎంత ప్రాచుర్యం పొందిందంటే ఆమె గురించి చెప్పగానే `మౌసీజీ’ అనే పేరే గుర్తుకువస్తుంది.

అతి పెద్ద హిందూ మహిళా సంస్థ
భారతీయ మహిళా సంస్కృతి, సంప్రదాయాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న రాష్ట్ర సేవిక సమితి ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ మహిళా సంస్థ. రాష్ట్ర సేవిక సమితి 5215 శాఖల ద్వారా సుమారు 10 లక్షల మంది మహిళలను కలుపుతోంది. ఈ సంస్థ తన శాఖలను ప్రపంచంలోని 10 దేశాలలో నిర్వహిస్తున్నది. ఆయా దేశాలలో ఈ సంస్థను `హిందూ సేవిక సమితి’ అనే పేరుతో  పిలుస్తారు. పురుషుల ఆర్‌.ఎస్‌.ఎస్ శాఖలు చేస్తున్నవాటినే  మహిళా శాఖలు చేస్తున్నాయి,అంటే ఆత్మరక్షణ కోసం స్వయంసేవ, మహిళల అభ్యున్నతి కోసం స్వయం సహాయక బృందాలు, సాహిత్య కేంద్రాలు, సంస్కార కేంద్రాలు, ఉచిత అధ్యయనాలు మొదలైనవి. ఈ సంస్థ ప్రస్తుతం దేశంలోని మహిళల అభ్యున్నతి కోసం పాఠశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు, అనాథాశ్రమాలతో సహా 475 ప్రాజెక్టులను నడుపుతోంది.

ఆర్‌.ఎస్‌.ఎస్ వ్యవస్థాపకులు, ఆద్య సర్ సంఘ్ చాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ తో సంప్రదించిన తరువాత లక్ష్మీబాయి కేల్కర్ రాష్ట్ర సేవికా సమితిని స్థాపించి, 1978 వరకు దాని సంచాలికగా ఉన్నారు. స్వాతంత్ర్యానికి ముందుకాలంలో మహిళలను సమాజకార్యంలో నిమగ్నం చేయడానికి అంత అనువైన పరిస్థితులు లేవు.  ఆ సమయంలో ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి ధైర్యం చేసిన ఉక్కు మహిళ లక్ష్మీబాయి కేల్కర్. లోక మాన్య బాల్ గంగాధర్ తిలక్ వార్తాపత్రిక “కేసరి” ను కొనుగోలు చేయడం,చదవడం దేశద్రోహంగా ప్రభుత్వం పరిగణిస్తున్న సమయంలో కూడా  లక్ష్మీబాయి కేల్కర్  వార్తాపత్రికను స్వయంగా చదవడమే కాకుండా చుట్టుపక్కల మహిళలతో కూడా చదివించారు.

సంస్థ ప్రయాణం లక్ష్మీబాయి కేల్కర్‌తో ప్రారంభమైంది. ‘మౌసిజీ’, సరస్వతి బాయి ఆప్టే, ఉషా తాయ్, ప్రమీలా తాయ్ సంస్థను తీర్చిదిద్దితే, శాంతక్క అని సేవికలు పిలుచుకునే వి. శాంతకుమారి ప్రస్తుతం సంస్థను ముందుకు నడుపుతున్నారు.   బెంగళూరులో ఉపాధ్యాయురాలిగా పని చేసిన శాంతక్క 1995 లో  స్వచ్ఛంద పదవీ విరమణ చేసి  రాష్ట్ర సేవికా సమితికి పూర్తిగా కార్యం చేపట్టారు. 2012 నుండి సంచాలిక గా ఉన్నారు. హిందూ జీవన విలువలను జీవితంలో పాటిస్తూ, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగాలని ఆమె అంటారు. నూతన భారత నిర్మాణం కోసం మహిళలు ముందుకు రావాలి, అలాగే సేవికలు తమ చుట్టుపక్కల దేశభక్తిపూరిత, సకరాత్మక వాతావరణం నిర్మించాలని ఆమె చెపుతారు.

మహిళా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అధికారులు, మొదలైన వారంతా ఈ సంస్థలో సేవలు అందిస్తున్నారు. దేశంలోని యువ తరాన్నికూడా సమాజ కార్యంలో జోడించడానికి సంస్థ  నిరంతరం ప్రయత్నం చేస్తోంది.