Home News భారత్ – చైనా సరిహద్దు ఘర్షణలో తెలుగు కల్నల్ మృతి

భారత్ – చైనా సరిహద్దు ఘర్షణలో తెలుగు కల్నల్ మృతి

0
SHARE

భారత్‌, చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో ఆర్మీ అధికారి సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్‌ సంతోష్‌ బాబు తెలంగాణలోని సూర్యాపేట వాసిగా నిర్ధారణ అయ్యింది.

ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో కల్నల్ సంతోష్ బాబు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. బీహార్‌ 16వ బెటాలియన్‌కు చెందిన సంతోష్‌ ఏడాదిగా భారత్ – చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు.

క‌ల్న‌ల్ సంతోష్ బాబు ల‌డ‌ఖ్‌లోని ఇన్‌ఫాంట్రీ ద‌ళానికి క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మూడు నెలల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ అయినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా సరిహద్దుల్లోనే ఉండాల్సి వచ్చింది. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.

సంతోష్ బాబు‌ మృతిపై ఆయన తల్లి మంజుల మీడియాతో మాట్లాడుతూ..  “దేశం కోసం తమ కొడుకు ప్రాణాలు అర్పించినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అయితే ఓకే ఒక్క కుమారుడిని పోగొట్టుకున్న తల్లిగా మాత్రం బాధపడుతున్నాను” తెలిపారు.

చిన్నతనం నుండే దేశభక్తి భావాలు..
కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసారు. సైన్యంలో చేరాలన్న అతని కోరిక నెరవేరనందున కొడుకు సంతోష్ బాబును సైన్యంలోకి పంపి భరతమాత ఋణం తీర్చుకోవాలనుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కోరుకొండ సైనిక్ స్కూల్లో చేర్చారు. తండ్రి ఆశయం నెరవేర్చడమే లక్ష్యంగా కృషి చేసిన సంతోష్ బాబు 2004లో లెఫ్టినెంట్ హోదాలో సైన్యంలో ప్రవేశించారు. ఉగ్రవాదులను, శత్రుమూకలను ఎదుర్కోవడంలో సత్తా చాటిన సంతోష్ బాబు చివరకి సరిహద్దులో పోరాడుతూ నేలకొరిగారు.