Home News ఐక్యరాజ్యసమితిలో భారత్ విస్తృత పాత్రకోసం పీఎం మోడీ పిలుపు

ఐక్యరాజ్యసమితిలో భారత్ విస్తృత పాత్రకోసం పీఎం మోడీ పిలుపు

0
SHARE

ఐక్యరాజ్యసమితిలో భారత్ ను విస్తృత స్థాయి లో భాగం చేయాలని ప్రధాని మోడీ అన్నారు. శనివారం జరిగిన ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 75 వ సెషన్ లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్యుల్లో భారతదేశం ఒకటి అయినందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు.

 ఈ చారిత్రాత్మకమైన సమావేశంలో 130 కోట్ల భారతీయుల మనోభావాలని పంచుకుంటున్నానని ఆయన తెలిపారు.  1945 లో ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పులు వచ్చాయని ఆ మార్పులకు అనుగుణంగా కొత్త సంస్కరణలు తీసుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
1945 నుండి ప్రపంచం మారిందని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే సమస్యలకు మెరుగైన పరిష్కారాల కోసం ఐక్యరాజ్య సమితి కూడా నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం కచ్చితంగా ఉందని మోడీ అన్నారు.
75 ఏళ్ల లో భారత్ ఎన్నో విజయాలు సాధించిందని, అయినా ఐక్యరాజ్యసమితిలో భారత్ కు తగిన భాగస్వామ్యం లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.  భారత్ లో చోటుచేసుకునే ఏ మార్పైనా  ప్రపంచం పై ప్రభావం చూపుతుందని ఇప్పటికైనా  ఐక్యరాజ్య సమితి బలోపేతం కావడం, సుస్థిరత సాధించడం ప్రపంచ శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమని మోడీ అభిప్రాయపడ్డారు.
శాంతి పరిరక్షణకు భారత్ ఇప్పటి వరకు ఎన్నో ఉగ్ర దాడులను, అంతర్యుద్దాలను ఎదుర్కొందని  ఈ క్రమంలో  ఎంతోమంది భారత సైనికులు తమ ప్రాణాలను అర్పించారని, ఎంతో మంది ప్రజలు నిరాశ్రయుయ్యారని, ఇలాంటి సమస్యల్ని ప్రస్తుతం పరిష్కరిస్తున్నామా అని మోడీ ప్రశ్నించారు. ప్రస్తుతం కావలసినది సంస్కరణలని అవి అసలు ఎప్పటికైనా చోటుచేసుకుంటాయని 130 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు.   భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచ జనాభాలో 12 శాతం జనాభా కలిగి ఉన్న దేశం, వందలాది భాషలు, సిద్ధాంతాలు, సంస్కృతులకు భారత్ నిలయం అని మోడీ అన్నారు. వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉన్నప్పటికీ భారత్ ప్రపంచానికి భారం కాలేదని,  బలవంతమైన శక్తిగా ఎదుగుతున్నప్పుడు ప్రపంచానికి ముప్పుగా భారత్ మారలేదని, దేశంలో వస్తున్న ఎన్నో మార్పులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఇంకా ఎంత కాలం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎదురు చూడాలని ఆయన  ప్రశ్నించారు.
అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు సహాయ ఒప్పందం, పొరుగు దేశ ప్రయోజనాలకి భారత్  ప్రాధాన్యం ఇస్తోందని, అభివృద్ధి భాగస్వామ్య ఒప్పందాలు వివిధ దేశాలలో చేసుకుంటున్నా మంటే ఆ దేశాలను మన అధీనంలోకి  తీసుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు.  చైనా కు దీటుగా ఇండో పసిఫిక్ దేశాలతో ఒప్పందాలను భారత్ కుదుర్చుకున్న సమయంలో ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు.
కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్లను తయారు చేసుకో లేని పేద దేశాలు ఎంతో ఆందోళన గురవుతున్నాయని, అటువంటి దేశాలకు వ్యాక్సిన్లను అందించేందుకు భారత్  తన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ఉందని మోడీ తెలిపారు. భారత్ ఇప్పటి వరకు 150కి పైగా దేశాలకు అవసరమైన మందులను పంపిణీ చేసిందని ఆయన తెలిపారు.
మరోవైపు ఉగ్రవాదం శాంతిభద్రతల గురించి మోదీ మాట్లాడుతూ అక్రమ ఆయుధాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్, ఉగ్రవాదం ఇతర అంతర్జాతీయ నేరాలను శాశ్వతంగా రూపుమాపడానికి   భారత్ పోరాటం చేస్తోందని ఆ పోరాటంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనుకాడేది లేదని మోడీ స్పష్టం చేశారు.
కరొనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా భారతదేశం ఒక స్వావలంబన దేశంగా ఉండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు  ప్రోత్సాహం ఇస్తుందని ఆయన తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడికి అన్ని పథకాలు, ప్రజా ప్రయోజనాలను విస్తరించడంలో ఎలాంటి వివక్ష లేదని నిర్ధారించబడుతోందని ప్రధాని మోడీ అన్నారు.
మహిళల అభ్యున్నతికి భారత్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులను ఇస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు. లింగమార్పిడి వర్గానికి చెందిన సభ్యుల హక్కులకు సంబంధించి సాధించిన పురోగతిని ఐక్యరాజ్యసమితి సమావేశంలో మోడీ ప్రస్తావించారు.
అన్ని రంగాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు అండగా నిలుస్తూనే, శాంతిభద్రతల దృష్ట్యా సరైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కలిగించాలని మోడీ డిమాండ్ చేశారు.
Source :  OPINDIA