Home Rashtriya Swayamsevak Sangh అఖండ భారత్ కల్పన కాదు, సంకల్పం

అఖండ భారత్ కల్పన కాదు, సంకల్పం

0
SHARE

– డా. మన్మోహన్ వైద్య

కొద్దిరోజుల క్రితం ముంబైలో `కరాచీ స్వీట్ మార్ట్’ అనే దుకాణం పేరు మార్చమంటూ ఒక శివసేన కార్యకర్త దుకాణాదారుడిని హెచ్చరించాడు. కరాచీ పాకిస్తాన్ లో నగరం కనుక, పాకిస్తాన్ ఎప్పుడు భారత్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికే ప్రయత్నిస్తోంది కనుక ఆ పేరు మార్చాలన్నది ఆ కార్యకర్త వాదన. దుకారణాదారుడు కూడా గత్యంతరంలేక`కరాచీ’ అనే పదంపై ఒక తెల్లకాగితం అంటించాడు. అక్కడితో వివాదం సమసిపోయింది. కానీ ఈ సంఘటనతో తమకు ఏ సంబంధం లేదని శివసేన ప్రకటన జారీచేసినట్లు పత్రికల్లో వచ్చింది.

అయితే అసలు పాకిస్తాన్ లోని కరాచితోపాటు వివిధ ప్రాంతాలనుంచి వేలాదిమంది భారత్ కు తరలివచ్చిన వైనం, వాళ్ళు అలా వలసరావడానికి గల కారణాలు, ఆ చరిత్ర శివసేన కార్యకర్తకు తెలుసా? వారికి అక్కడ భద్రత లేక తమ దేశంలోనే శరణర్ధులుగా మరొక చోటకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. అలా వచ్చిన వారు కష్టపడి పనిచేస్తు ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చేసి పలువురికి ఉపాధి కూడా కల్పించారు. ముఖ్యంగా సింద్ ప్రాంతం నుంచి వచ్చినవారు ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, సంపదను సృష్టించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అనేక విద్యా సంస్థలు స్థాపించారు. వీటివల్ల సమాజానికి ఎంతో మేలు జరిగింది. ఏ ప్రాంతం నుంచి తరలి వచ్చామో ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవడం అప్పటివారికేకాదు, ఈ తరం వారికి కూడా అవసరమే. ఎందుకంటే ఎప్పటికైనా మళ్ళీ తమ స్వస్థలానికి వెళ్లాలనే ఆలోచన దాని వల్ల కలుగుతుంది.

మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 14న `అఖండ భారత్ దిన్’ జరుపుతూ ఉంటారు. అందులో పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటూ ఉంటారు. దేశ విభజన విషాద గాధ గురించి చెప్పి, అఖండ భారతాన్ని తిరిగి సాధించాలన్న సంకల్పాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ విషయం ఆ శివసేన కార్యకర్తకు తెలియకపోవచ్చును. దేశ విభజన కృత్రిమమైనదని యోగి అరవిందులు అప్పుడే చెప్పారు. కాబట్టి కృత్రిమమైనది శాశ్వతంగా నిలబడే అవకాశం లేదు, ఉండదు. ఏదో ఒక రోజు భారత్ తిరిగి అఖండ దేశంగా విరాజిల్లుతుంది. కరాచీ నుంచి తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాము, తిరిగి ఎప్పటికైనా కరాచీకి వెళ్ళాలి అనుకోవడం తప్పేమీ కాదు. ఇదే విషయం రాబోయే తరాలవారికి కూడా తెలిసేట్లుగా `కరాచీ’ అనే పేరు ఉపయోగించడం కూడా దోషమేమి కాదు. 18వందల సంవత్సరాలపాటు యూదులు తమ దేశమైన ఇజ్రాయెల్ నుంచి దూరంగా ఉండిపోయారు. కానీ ఇన్ని వందల సంవత్సరాల్లోనూ ప్రతి సంవత్సరాదికీ వాళ్ళు ఇజ్రాయెల్ ను సాధించుకోవాలన్న తమ సంకల్పాన్ని గుర్తుచేసుకుంటూనే వచ్చారు. చివరి సాధించారు. ఈనాడు ఇజ్రాయెల్ శక్తివంతమైన, స్వతంత్ర దేశం.

పాకిస్థాన్ సాగిస్తున్న తీవ్రవాదాన్ని, జిహాది ధోరణిని, దేశవ్యతిరేక కార్యకలాపాలను సమర్ధిస్తున్న శక్తులు భారత్ లో ఉన్నమాట నిజమే. అలాంటి శక్తులు ముంబైలో కూడా ఉన్నాయి. ఈ కార్యకలాపాలు చూసిన ఏ దేశభక్తుడైన పౌరునికైనా కోపం రావడం, ఆవేదన కలగడం సహజం. అలాగే ముంబైలోని అమరవీరుల స్మారకాన్ని రజా అకాడమీకి చెందిన కొందరు కాళ్లతో తన్ని, ధ్వంసం చేసిన ఫోటో కూడా ఇలాగే ఆగ్రహాన్ని కలిగిస్తుంది. కానీ ఈ శక్తుల గురించిగాని, సంఘటనల గురించిగాని శివసేన కార్యకర్తలు ఆగ్రహించారు అని ఎప్పుడూ, ఎక్కడా వార్తలు రాలేదు.

అఖండ భారత్ ప్రస్తావన రాగానే కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇది సామ్రాజ్య విస్తరణ కోసం చెప్పే మాట కాదని గుర్తించాలి. ఆంగ్లేయ పాలన ప్రారంభం కాకముందు ఒకే రాజు పాలనలో లేకపోయినా  ఈ దేశం ఒక్కటిగానే ఉంది. సాంస్కృతిక ఏకత్వం ఈ దేశాన్ని ఒకటిగా నిలిపి ఉంచిందన్న విషయం గ్రహించాలి. ఆధ్యాత్మికత ఆధారంగా ఏర్పడిన ఏకాత్మ దృష్టి ఈ దేశపు ప్రత్యేకత. వేల సంవత్సరాలుగా ప్రపంచానికి ఈ ప్రత్యేకత ఏమిటో తెలుసు. ఈ దృష్టిని, ప్రత్యేక అస్తిత్వాన్నే `హిందూత్వం’ అనే పేరుతో గుర్తించింది. హిందూత్వం అంటే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలోని విషయం కాదు. నిజానికి హిందూత్వం అంటే ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వమనే విషయం గుర్తుపెట్టుకుంటే రాజకీయ వివాదాలు, విమర్శలు రావు. `world history of Economics’ అనే తన పరిశోధన గ్రంధంలో ప్రముఖ బ్రిటిష్ ఆర్ధిక వేత్త ఆంగస్ మాడిసన్ క్రీ. శ ఒకటవ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ప్రపంచ వ్యాపారంలో భారత్ దే అతిపెద్ద వాటా (33%) అని పేర్కొన్నాడు. అతను చెప్పినది ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వం కలిగిన భారత్ గురించే. 6శతాబ్దంలో పార్శీలు, 8వ శతాబ్దంలో సిరియా క్రైస్తవులు భారత్ కు వచ్చి ఆశ్రయం పొందారు. వాళ్ళు వేరు వేరు రాజుల దగ్గరకు వచ్చారు. ఆయా రాజ్యాల్లో కూడా ప్రజలు వేరు, భాషలు వేరు, పూజించే దేవతలు వేరు. అయినా ఈ `విదేశీ’ మతాలకు చెందిన, పీడితులైన వారి పట్ల ఈ దేశం అంతటా వ్యక్తమైన ప్రతిస్పందన ఒక్కటిగానే ఉంది. వారిని గౌరవపూర్వకంగానే, స్నేహపూర్వకంగానే ఆహ్వానించారు. దీనికి కారణం భౌగోళికంగా, సాంస్కృతికంగా భారత్ ఆంతా ఒక్కటే. భారతీయుల తీర్థ, పవిత్ర స్థలాలు ఈ దేశం మొత్తంలో ఉన్నాయి. హింగలాజ్ దేవి మందిరం, నాన్ కానా సాహిబ్ గురుద్వారా నేడు పాకిస్తాన్ లో ఉన్నాయి. ఢాకేశ్వరి దేవి మందిరం బాంగ్లాదేశ్ లో ఉంది. పశుపతినాధ్ దేవాలయం, సీతాదేవి జన్మస్థలమైన జనక్ పురి నేపాల్ లో ఉన్నాయి. రామాయణంలో మనకు కనిపించే చాలామటుకు ప్రదేశాలు నేడు శ్రీలంకలో ఉన్నాయి. బ్రహ్మదేశం, శ్రీలంక, టిబెట్, భూటాన్ లలోని బౌద్ధుల పవిత్ర స్థానాలు భారత్ లో ఉన్నాయి. కైలాస మానససరోవర్ యాత్రను భారతీయులు వేలాసంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు.

ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వాన్ని సూచించే విధంగా ఇక్కడివారు తమ పిల్లలకు వేరే ప్రాంతాలలోని స్థలాలు, నదుల పేర్లు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు కర్ణాటకు చెందిన ఒక కుటుంబం గుజరాత్ లో ఉండేది. ఆ కుటుంబంలో ఇద్దరు అమ్మాయిల పేర్లు సింధు, సరయూ. సరయూ నది కర్నాటకలో లేదు. అలాగే సింధు నది అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది కాబట్టి, సింధూ నది ఆ దేశంలో ఉంది కాబట్టి `మీ అమ్మాయి పేరు మార్చండి’ అంటూ హెచ్చరిస్తే పరిస్తితి ఏమిటి? కర్ణావతిలోని ఇస్రోలో పనిచేసే ఉత్తర్ ప్రదేశ్ శాస్త్రవేత్త కుమార్తె పేరు కావేరీ. గుజరాత్ భావనగర్ కు చెందిన ఒక అమ్మాయి పేరు ఝెలమ్. విదర్భలో పుట్టిన మరో అమ్మాయి పేరు రావి. ఇలా వేరే ప్రాంతాలకు చెందిన పేర్లు ఎలాంటి సంకోచం లేకుండా పెట్టుకోవడానికి కారణం ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వమే.

భారత్ కు పొరుగున ఉన్న ఏ దేశం సుఖంగా, సంతోషంగా లేదు. భారత్ తో సంబంధాలపైనే ఈ దేశాల సుఖ, సమృద్ధులు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే అవి కేవలం భారత్ పొరుగు దేశాలే కాదు పురాతన కాలం నుంచి అఖండ భౌగోళిక, సాంస్కృతి భారత్ లో అవిభాజ్య అంగాలు. అయితే ఆ ఏకత్వాన్ని తిరిగి సాధించడంలో భారత్ కీలక పాత్ర పోషించాలి. 2014 తరువాత భారత్ ఈ దిశగా అడుగులు వేసింది. 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు పదవీ స్వీకార ప్రమాణోత్సవానికి పొరుగు దేశాల అధినేతలను ఆహ్వానించారు. ఆ తరువాత పరస్పర ఆర్ధిక సంబంధాలను పటిష్టపరచుకునేందుకు ఈ దేశాలన్నింటిని ఒక తాటిపైకి తెచ్చేందుకు భారత్ చేసిన ప్రయత్నాలను ప్రపంచం చూసింది. వేరువేరు రాజకీయ అస్తిత్వాలను(దేశాలను) అలాగే ఉంచి భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వ భావనను పటిష్టపరిస్తే ఇది పూర్వకాలంలో మాదిరిగా ప్రబల ఆర్ధిక శక్తిగా వెలుగొందుతుంది. నేడు అభివృద్ధి చెందిన దేశాలుగా చెలామణి అవుతున్న పాశ్చాత్య దేశాల సంపద దోపిడి, అత్యాచారాలు, సామ్రాజ్యవిస్తరణ ద్వారా కూడగట్టినదేనని చరిత్ర చూస్తే అర్ధమవుతుంది. కానీ భౌగోళిక, సాంస్కృతిక భారత ఖండంలో సంపద ఇలా రాలేదు. భారతీయులు ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజల్ని కలుపుకుని అభివృద్ధిని సాధించడానికే ప్రయత్నించారుకాని ఆ దేశాలను ఆక్రమించుకునే కుటిల యత్నాలు చేయలేదు. ఈ విషయాన్ని ఇప్పటికీ ఆయా దేశాల ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అందుకనే `ఒక్క సైనికుడిని పంపకుండా భారత్ 2వేల సంవత్సరాలపాటు చైనాలో సాంస్కృతిక సామ్రాజ్యాన్ని నెలకొల్పింది’ అని అంటారు అమెరికాలో చైనా రాయబారి హు షీ .

కరేబియన్ దీవులకు 150ఏళ్ల పూర్వం బ్రిటిష్ వాళ్ళు కూలీలుగా కొందరు భారతీయులను తీసుకువెళ్లారు. ట్రినిడాడ్, గయానా, సురినామ్, జమైకా, బార్బడోస్ మొదలైనవన్నీ కూడా భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వం వల్లనే ఒక దేశంగా నిలబడ్డాయి. వారికి అతి ప్రాచీన చరిత్ర ఏమి లేదు. కానీ చరిత్ర, వారసత్వం పట్ల వారికి శ్రద్ధ, గౌరవం ఉన్నాయి. దీనివల్ల పరిపాలనా వ్యవస్థ, సైన్యం మొదలైనవి వేరువేరుగా ఉన్నప్పటికి వారు ఒకటిగా నిలబడ్డారు. పరస్పరం సహకరించుకుంటున్నారు.

మరి భారత భూఖండపు భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వం వేలాది సంవత్సరాల పురాతనమైనది. అలాగే ఇక్కడ సంపద, సమృద్ధికి కూడా చాలా పురాతన చరిత్రే ఉంది.  ఈ దేశం ప్రపంచానికి జీవించడం ఎలాగో నేర్పింది. విశ్వగురువుగా విలసిల్లింది. బృహత్ భారతానికి ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న స్థానాన్ని తిరిగి సాధించాలంటే ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వాన్ని మరచిపోకూడదు. ఆయా ప్రదేశాలు, స్థానాల పేర్లు అలాగే ఉంచుకోవాలి. సంకుచితమైన ధోరణి, చరిత్రపట్ల అవగాహన లేకపోవడం, స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఏకత్వాన్ని మరుగునపరచే ప్రయత్నం చేయకూడదు. అలాంటి ప్రయత్నాలను సహించకూడదు. ఈ ఏకత్వం పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ ఆ ఏకత్వాన్ని తిరిగి సాధించాలనే సంకల్పాన్ని పదేపదే గుర్తుచేసుకోవాలి. 18వందల ఏళ్లపాటు గుర్తుపెట్టుకుని, ప్రయత్నించడం ద్వారా యూదులు అసాధ్యమనుకున్న ఇజ్రాయెల్ ఏర్పాటును సుసాధ్యం చేసుకున్నారు. ఈ విషయాన్ని మనమంతా బాగా గుర్తుపెట్టుకోవాలి.

(రచయిత ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ)