Home News మన కర్తవ్యం, సంకల్పాల సాకారానికి కటిబద్దులము కావాలి: శ్రీ మోహన్ భాగవత్ జీ

మన కర్తవ్యం, సంకల్పాల సాకారానికి కటిబద్దులము కావాలి: శ్రీ మోహన్ భాగవత్ జీ

0
SHARE

ఈ ఆగ‌స్టు 15నాటికి భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. ఇంకా సంవత్సర కాలం కొనసాగుతాయి కూడా. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. ఈ చక్రం ఇలా సాగుతూనే ఉంటుంది. సమస్యలెన్ని ఉన్నా అమృత మహోత్సవంలో ఆనందాన్ని పొందడం అత్యంత సహజమైనది. 1947 ఆగస్ట్, 15న అనేక ఏళ్ల తరువాత మన భూభాగంలో మనకు కావలసిన ప్రభుత్వాన్ని, ఇతర వ్యవస్థలను ఏర్పాటుచేసుకునే అధికారం పొందాము. బానిసత్వం ఎక్కువ కాలం కొనసాగడంతో స్వాతంత్ర్యం కోసం సంఘర్షణ కూడా చాలాకాలం సాగించాల్సి వచ్చింది.

విదేశీ పాలనకు విరుద్ధంగా భారతీయులు సాగించిన పోరాటం భౌగోళికంగా దేశమంతటా వ్యాపించింది. సమాజంలోని అన్ని వర్గాలవారు అందులో పాల్గొన్నారు. ఎవరికివారు వారి శక్తిని అనుసరించి పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సాధించడంలో అడ్డంకుగా నిలుస్తున్న వివిధ దోషాల పట్ల చైతన్యం వచ్చింది. అలాగే సాయుధ, నిరాయుధ పోరాటంతోపాటు సమాజ జాగృతి కార్యం కూడా స్వాతంత్ర్య సాధనలో భాగంగా ఒకేసారి సాగాయి.

ఈ ప్రయత్నాలన్నీ ఫలించి చివరికి 1947 ఆగస్ట్ 15న ఈ దేశాన్ని మనకు కావలసిన రీతిలో, మనకు ఇష్టమైన పద్దతిలో, మన ప్రజల ద్వారానే నడుపుకునే స్థితిని సాధించాం. బ్రిటిష్ పాలకులను పంపివేసి మన దేశపు పాలనా పగ్గాలను మనమే చేపట్టాము. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో సర్వత్ర ఉత్సాహపూరితమైన వాతావరణం కనిపించడం అత్యంత స్వభావికం, సహజం కూడా. ఈ సుదీర్ఘ పోరాటంలో తమ కఠోర పరిశ్రమ, త్యాగాల ద్వారా మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన వీరులను (అలాంటివారు ఈ విశాల దేశంలోని ప్రతి ప్రాంతంలో కనిపిస్తారు) గుర్తుచేసుకోవాలి. నవ్వుతూ ప్రాణాలను అర్పించిన వారి త్యాగనిరతిని, ధైర్యాన్ని సమాజం మొత్తానికి తెలియజేయడం చాలా అవసరం. మాతృభూమి, దేశ ప్రజానీకం పట్ల వారికి ఉన్న ఆత్మీయత, సర్వస్వం సమర్పణ చేసిన వారి ప్రేరణ, వారి తేజోమయమైన వ్యక్తిత్వం, వారి చరిత్రలను మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి, అనుసరించాలి.

ఈ సందర్భంగా మన కర్తవ్యం, సంకల్పాలను గుర్తుచేసుకుని వాటిని పూర్తిచేసేందుకు మరోసారి కటిబద్ధులము కావలసిన అవసరం ఉంది. మనకు స్వరాజ్యం ఎందుకు? విదేశీయుల చేతిలో ఉన్నప్పటికీ దేశంలో సుపరిపాలన ఉంటే సరిపోతుంది కదా? అటువంటి పాలన వల్ల దేశ ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలు నెరవేరవా? లేదు. విదేశీ పాలన ఎంత బాగున్నప్పటికీ అది సాధ్యపడదు. `స్వ’ అభివ్యక్తీకరణ స్వాతంత్ర్య సాధనకు ప్రేరణ అవుతుంది. వ్యక్తి స్వతంత్రజీవనంలోనే సురాజ్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. మరోవిధంగా అది సాధ్యం కాదు. వైశ్విక జీవనానికి ఏదో ఒకటి అందించడానికే ప్రతి దేశం ఆవిర్భవిస్తుందని స్వామి వివేకానంద అన్నారు. అలా ప్రపంచానికి ఏదైనా అందించాలంటే ఆ దేశం స్వతంత్రంగా ఉండాలి. ప్రపంచంలో తన `స్వ’ను ప్రకటీకరించడం ద్వారా ఆ దేశం వైశ్విక జీవనానికి తన యోగదానాన్ని అందించగలుగుతుంది. కాబట్టి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మొదటి అర్హత ఆ దేశం స్వతంత్రంగా, శక్తివంతంగా ఉండడం.

స్వాతంత్ర్య సాధన కోసం ప్రజలను జాగృతం చేసి, సాయుధ, అహింసా పోరాటాలలో పాల్గొని, స్వాతంత్ర్యాన్ని సాధించడంతోపాటు దానిని కాపాడుకునేందుకు ప్రజలను సంసిద్ధం చేసినవారు ఆ లక్ష్యాన్ని గురించి వివిధ రకాలుగా వివరించారు. స్వర్గీయ శ్రీ రవీంద్రనాథ్ ఠాగోర్ `చిత్త్ జేథా భయశూన్య ఉన్నత్ జతో శిర్’ అనే తన కవితలో స్వతంత్ర భారతాన్ని సాధించడానికి కావలసిన పరిస్థితులను వర్ణించారు. స్వాతంత్ర్యం సిద్ధించినప్పుడు భారత్ ఉదాత్త, ఉత్తమ, ఉన్నత దేశంగా అవతరిస్తుందని స్వాతంత్ర్య వీర సావర్కర్ `స్వతంత్రతా దేవి ఆరతి’ అనే తన కవితలో ఆకాంక్షించారు. తన `హింద్ స్వరాజ్’ లో గాంధీజీ స్వతంత్ర భారతదేశపు కల్పనను వర్ణించారు. పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మొదటిసారి ప్రవేశపెడుతూ చేసిన రెండు ఉపన్యాసాల్లో స్వాతంత్ర్య ప్రయోజనం, దానిని సాధించడానికి మనం నిర్వర్తించవలసిన కర్తవ్యాలను డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రస్తావించారు.

స్వాతంత్ర్య అమృత మహోత్సవ శుభ, ఆనందమయ సందర్భంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించుకోవడంతోపాటు ఈ స్వాతంత్ర్య ప్రయోజనం `స్వ’ అభివ్యక్తీకరణ అయినట్లైతే అసలు ఆ `స్వ’ ఏమిటన్నది మనం ఆలోచించుకోవాలి. ప్రపంచ జీవనంలో భారత్ నిర్వహించవలసిన పాత్ర కోసం ఈ దేశం ఎటువంటి శక్తిసామర్ధ్యాలను సంపాదించుకోవాలి? ఈ కార్యాన్ని పూర్తిచేయడానికి మనం నిర్వర్తించవలసిన కర్తవ్యం ఏమిటి? ఆ కర్తవ్యాలను నిర్వర్తించడానికి సమాజాన్ని ఎలా సంసిద్ధం చేయాలి?

భారతీయ సనాతన దృష్టి, చింతన, సంస్కృతి, ఆచరణ ద్వారా ప్రపంచం ముందు సందేశాలను ఉంచింది. ప్రత్యక్ష అనుభూతి, వైజ్ఞానిక సత్యాలపై ఆధారపడిన సమగ్ర, ఏకాత్మ భావనలే వాటి ప్రత్యేకత. వివిధత్వం వేర్పాటువాదం కాకుండా ఏకాత్మవాదపు ప్రకటీకరణగా అవి పేర్కొన్నాయి. ఒకటిగా నిలవడానికి ఒకేవిధంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరినీ ఒకేలా ఉండేట్లు చేయడం, తమ మూలాల నుండి వేరుచేయడంవల్ల ఘర్షణ ఏర్పడుతుంది. తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ, ఇతరుల ప్రత్యేకతలను గుర్తిస్తూ అందరూ కలిసి సాగినప్పుడే సంఘటిత సమాజం ఏర్పడుతుంది.

ఈ భూమి బిడ్డలుగా భరతమాత పట్ల భక్తి మనలను కలిపి ఉంచుతోంది. సనాతన సంస్కృతి మనకు సుసంస్కృతి, సద్భావన, ఆత్మీయతపూర్వకమైన ఆచరణను నేర్పుతుంది. పరాక్రమయుత, శీలసంపన్నమైన పూర్వీకుల ఆదర్శాలు మనకు మార్గనిర్దేశనం చేస్తున్నాయి. వీటిని అనుసరిస్తూ సంకుచిత స్వార్థాలను, భేదభావాలను పక్కన పెట్టి దేశ హితాన్నే ముందు పెట్టుకుని పనిచేయాలి. సంపూర్ణ సమాజాన్ని ఇందుకు సిద్ధం చేయడమే అత్యంత అవశ్యకమైన కార్యం. అదే సమాజపు స్వభావము. సహజస్థితి కూడా.

కాల ప్రవాహంలో సమాజంలో వచ్చిన జాతి, మత, భాషా, ప్రాంతీయత మొదలైన విభేదాలు, కీర్తి కాంక్ష, ధన కాంక్ష వంటి దోషాల వల్ల వచ్చే క్షుద్ర స్వార్థ ఆలోచనలను మనస్సు, మాట, కర్మల నుండి పూర్తిగా తొలగింఛాలి. ఇతరులకు మంచిని చెప్పడంతోపాటు మనం స్వయంగా ఆచరించడం చాలా అవసరం. సమతతో కూడిన, శోషణ లేని సమాజం వల్లనే మనం ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోగలం. సమాజంలో అనేక అపోహలు కల్పిస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, కలహాలను పెంచుతూ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే, ద్వేషాన్ని వెళ్లగక్కే కుట్రపూరిత శక్తులు దేశంలోనూ, బయటనుంచి పనిచేస్తున్నాయి. సుసంఘటితమైన, సామర్ధ్యంతో కూడిన సమాజం మాత్రమే అటువంటి శక్తులకు ఏవిధమైన అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగగలుగుతుంది. సమాజంలో పరస్పర సంవాదం మళ్ళీ నెలకొల్పాలి.

స్వతంత్ర, ప్రజాస్వామిక దేశంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. దేశపు సమగ్రాభివృద్ధి, అభ్యర్ధి యోగ్యత, వివిధ పార్టీల సైద్ధాంతీక భూమికను పరిశీలించగలిగిన వివేకం; చట్టం, రాజ్యాంగం, పౌరుల విధుల గురించిన అవగాహన; వాటిని శ్రద్ధగా పాటించే స్వభావం; మొదలైనవి ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా అవసరం. కానీ తమ వాదన నెగ్గించుకోవడం కోసం అసహనపూర్వకమైన వైఖరిని అవలంబించడం (ఇది సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాము) అనే ధోరణి కనిపిస్తోంది. అటువంటి వ్యహారశైలికి దూరంగా నాగరికమైన, చట్టాన్ని గౌరవించే ధోరణిని అవలంబించవలసిన అవసరం ఉంది.

ఇలా సమాజం మొత్తం యోగ్యమైన ధోరణిని, వ్యవహార శైలిని అవలంబించకుండా ఎలాంటి పరివర్తన సాధ్యపడదు. `స్వ’ ఆధారంగా ముందుకు సాగాలంటే ముందు ఆ `స్వ’ అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన, జ్ఞానం, విశుద్ధమైన దేశభక్తి, వ్యక్తిగత, సామాజిక అనుశాసనం, ఏకాత్మ భావం అవసరం. అప్పుడే భౌతికమైన విషయ పరిజ్ఞానం, శక్తి సామర్ధ్యాలు, పాలనా యంత్రాంగం వంటివి ఉపయోగపడతాయి. కాబట్టి స్వాతంత్ర్య అమృత మహోత్సవ సందర్భంగా ఈ స్వాతంత్ర్య సాధనకు వెనుక ఉన్న పూర్వీకుల కఠోరమైన పరిశ్రమ గుర్తుకురావాలి. దాని ద్వారా అటువంటి త్యాగం, పరిశ్రమలతో `స్వ’ఆధారితమైన, యుగానుకూల పాలన వ్యవస్థ నిర్మాణంతో భారత్ ను అన్ని రంగాల్లో వైభవోపేతమైన స్థితికి చేర్చాలి. రండి, సంఘటిత, సుహృద్భావ భావనతో ఆ తపోమార్గంలో ఉత్సాహపూర్వకంగా, మరింత వేగంగా ముందుకు సాగుదాం.