Home News కందకుర్తిలో ఆర్‌.ఎస్‌.ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు ‘డాక్టర్ జీ’ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ

కందకుర్తిలో ఆర్‌.ఎస్‌.ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు ‘డాక్టర్ జీ’ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ

0
SHARE

ఇందూరు జిల్లా కంద‌కుర్తి గ్రామంలో కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించ‌నున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) వ్య‌వ‌స్థాప‌కులు డాక్టర్ హెడ్గేవార్ గారి స్మృతి మందిర నిర్మాణానికి
శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ స్వామి కమలానంద భారతి గారి చేతుల మీదుగా డిసెంబ‌ర్ 2న‌ ఉద‌యం 11 గం.కు భూమి పూజ వైభవంగా జరిగింది.

1925లో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘానికి 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంఘస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ గారి పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం పాఠశాల, ఆవాసము, స్మృతి మందిరము, యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే డాక్టర్ హెడ్గేవార్, స్మృతి మందిరాన్ని అధునాతన హంగులతో నిర్మించనున్నట్లు కేశవ సేవా సమితి కార్యదర్శి అంకు మహేష్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ స్వామి కమలానంద భారతి గారు మాట్లాడుతూ కందకుర్తి తమకేంతో పవిత్రమైన స్థలమని, ఈ ప్రాంతానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్నదని, భక్తికి పుట్టినిల్ల‌ని స్వామీజీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కందకుర్తి ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఒక సామాజిక వికాస కేంద్రంగా కూడా విలసిల్లుతుందని కందకుర్తి లో సాక్షాత్తు స్కందుడే స్వయంగా కొలువై ఉన్నాడని పేర్కొన్నారు. త్రివేణి సంగమ క్షేత్రంగా కందకుర్తి అత్యంత పవిత్రమైన స్థానమని శతాబ్ద కాలం నాటి రామాలయం గోదావరి ప్రవాహం ఒడ్డున స్వయంభుగా వెలసిన అమృతేశ్వరుడు, అంతేకాకుండా అయోధ్య నుంచి వచ్చిన సాధు పుంగవులు శ్రీ సీతారాం త్యాగి మహారాజ్ నిర్మించిన శని దేవాలయము వంటి ఎన్నో ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రాలకు కందకుర్తి చిరునామాగా నిలుస్తుందన్నారు. రాబోయే కొద్ది కాలంలోనే కందకుర్తి విశ్వఖ్యాతిని ఘటిస్తుందని కందకుర్తి గ్రామంలో పుట్టిన ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులన్నారు. ఈ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటం కోసం ముందుకు వచ్చిన కేశవ సేవాసమితి బృందాన్ని సేవా భారతి సంస్థను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామానికి మంచి చేయాలనే ఆలోచనతో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులన్ని విజయవంతంగా పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు స్వామీజీ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమాధిపతి పిట్ల కృష్ణ మహారాజు, ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు, అఖిల భారతీయ అధికారి శ్రీ పొన్నపల్లి సోమయాజులు గారు, ప్రాంత సేవా భారతి ప్రముఖ్ శ్రీ వాసు గారు, ఇందూరు విభాగ్ ప్రచారక్ శ్రీ నర్రా వెంకట శివకుమార్ గారు, కేశవ సేవా సమితి అధ్యక్షులు శ్రీ చామకూర సుధాకర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.