Home News సంఘం ద్వారా సమృద్ధి, సమర్పణ భావం, సామాజిక సమరసత: శ్రీ రామగిరి మహారాజ్‌

సంఘం ద్వారా సమృద్ధి, సమర్పణ భావం, సామాజిక సమరసత: శ్రీ రామగిరి మహారాజ్‌

0
SHARE

ప్రజలు నింద చేసినా, మెచ్చుకున్నా, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ఠవేసినా, ఇంటి నుంచి నిష్క్రమించినా… ఇప్పుడే మృత్యువు వచ్చినా.. యుగాంతంలో మరణం సంభవించినా… ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధీర పురుషులు న్యాయమార్గంలోనే వుంటారని, తప్పుడు మార్గాల్లోకి వెళ్లరని… శ్రీ క్షేత్ర గోదావరి ధామ్‌ పీఠాధిపతులు శ్రీ రామగిరి మహారాజ్‌ అన్నారు. ఇలాంటి సంస్కారం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ద్వారా లభిస్తుందని అన్నారు. నాగపూర్‌ మహానగరంలో సోమవారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ కార్యకర్త వికాసవర్గ-2 సమాపన్ సమారోహ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగిరి మహారాజ్‌ ఈ సందర్భంగా అనుగ్రహభాషణం చేశారు. అనుకూల పరిస్థితులు వున్నా.. ప్రతికూల పరిస్థితులు వున్నా… సమృద్ధి, సమర్పణ భావం, సామాజిక సమరసత సంఘం ద్వారా లభిస్తుందని… సంఘం ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలతో తాను చాలా ప్రభావితం అయ్యాయని తెలిపారు. 1925లో డాక్టర్జీ ప్రారంభించిన సంఘం ఇప్పుడు మహావృక్షమైందన్నారు. ఇదంతా స్వయంసేవకుల సమర్పణ భావం, కర్తృత్వ భావన, త్యాగం వల్లే సాధ్యమైందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సనాతన ధర్మాన్ని భ్రష్టం చేయడానికి చాలా వేగంగా ప్రయత్నం జరిగిందని, కానీ… సనాతన ధర్మాన్ని సాధు సంతులతో పాటు.. అత్యంత సమర్పణ భావం కలిగిన రాష్ట్రీయ స్వయం సేవకులు కాపాడుతూ వస్తున్నారని పేర్కొన్నారు.

భారతదేశం యుద్ధ భూమి కాదని, బుద్ధ భూమి అని రామగిరి మహారాజ్‌ స్పష్టం చేశారు. ఇది రామచంద్రుని భూమి అని, రామచంద్రుని ఆదర్శ భావాలను ఈ హిందూ సంస్కృతి అందరికీ ఇచ్చిందన్నారు. పితృవాక్య పరిపాలన కోసం రాముడు రాజ్యాధికారాన్ని కూడా వదిలేశాడని, ఈ ఆదర్శాన్ని రాముడు ఇచ్చాడని అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడ్డాడని, ప్రాణాల కంటే ఇచ్చిన మాటకే రాముడు ఎక్కువ విలువ ఇచ్చారన్నారు. ఈ విలువలన్నీ రాముడి జీవితం నుంచి మనకు లభిస్తాయన్నారు. పితృవాక్య పరిపాలన కోసం రాముడు రాజ్యాన్నే వదులుకోగా నేటి కాలంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారని రామగిరి మహారాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి సంస్కారాలను ఇచ్చారని.. కానీ వారిని పట్టించుకోవడం లేదన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. తల్లిదండ్రులను గౌరవించే సంస్కృతి మనదని, ఇదంతా ఋషులు ఇచ్చిన పరంపర అన్నారు.

సాంకేతికత, విజ్ఞానం అంటే ఇదేనా?..

హిందూ సంస్కృతి ప్రపంచంలోనే అత్యంత శ్రేష్ఠమైనదని, మనమందరమూ రాముడి, కృష్ణుడి వంశజులమని ఆయన పేర్కొన్నారు. ఇంతటి పవిత్ర సంస్కృతిని మూలమూలలా వ్యాప్తి చేయాల్సిన అవసరం వుందని, దీంతో పాటు సామాజిక సమరసతను కూడా ప్రతి గ్రామానికి చేరవేయాల్సిన బాధ్యత అందరిపైనా వుందని ఉద్బోధించారు. ఈ దేశ సంస్కృతిని విధ్వంసం చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని, అది సాధ్యం కాలేదని అన్నారు. ఈ దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు దీనిని సవరించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు. అందరూ భగవంతుడి బిడ్డలేనని, అందరిలో వున్న ఆత్మ ఒక్కటేనని అన్నారు. దేశాన్ని, సంస్కృతిని కాపాడడానికి సంఘం ఏ ప్రయత్నమైతే చేస్తుందో… దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలని రామగిరిజీ మహారాజ్‌ ఆకాంక్షించారు.