Home News వేద విజ్ఞాన పరిరక్షణ‌యే ఆధ్యాత్మికత, తత్వశాస్త్ర అభివృద్ధి – డా. మోహ‌న్ భ‌గ‌వ‌త్ జీ

వేద విజ్ఞాన పరిరక్షణ‌యే ఆధ్యాత్మికత, తత్వశాస్త్ర అభివృద్ధి – డా. మోహ‌న్ భ‌గ‌వ‌త్ జీ

0
SHARE
వేద విజ్ఞాన పరిరక్షణ‌యే ఆధ్యాత్మికత, తత్వశాస్త్ర అభివృద్ధి అని, రాబోయే కాలం భారతదేశానికి, సనాతన ధర్మానికి చెందినదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స‌ర్ సంఘ‌చాల‌క్ శ్రీ మోహ‌న్ భ‌గ‌వ‌త్ జీ అన్నారు. ఆగ‌స్టు 6న కంచి కామకోటికి చెందిన శంకరాచార్య విజయేంద్ర సరస్వతి గారు గంగానది ఒడ్డున వెలసిన చేత్ సింగ్ కోట సముదాయంలో చాతుర్మాసా వ్రతస్థలంలో ఏర్పాటు చేసిన అగ్నిహోత్ర సభ యాగ కార్యక్రమంలో మోహ‌న్ భగవత్ జీ పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  వేదాలు మన విజ్ఞాన భాండాగార‌మ‌ని అందులో అన్నీ ఇమిడి ఉన్నాయ‌న్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నిరంతర దండయాత్రల కారణంగా వేద విజ్ఞానం దెబ్బతిన్న‌ద‌ని అన్నారు. అగ్నిహోత్ర అనుచరులు యుగయుగాల నుండి ఈ జ్ఞానాన్ని కాపాడుతున్నార‌ని, ఈ సంప్రదాయాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయ‌న‌ అన్నారు.
“నేడు సైన్స్ కూడా ఒక పరిశోధన పద్ధతి. కానీ దాని పరిశోధన పద్దతిలో ఒక అసంపూర్ణత ఉంది. అందులో భౌతిక అనుభవాల నుంచి తెలుసుకుని అదే నిజమని నమ్మి దాన్ని అనుసరిస్తారు. కానీ ఇప్పుడు దాని గురించి మరింతగా తెలుసుకుని భౌతికత్వానికి మించినది ఏదో ఉంద‌ని అగ్నిహోత్ర అనుచరులు  తెలుసుకోగలిగారు. ప్రయోగశాలలో ప్రయోగం చేయడం దాని ఫలితం కోసం ఎదురుచూడడం, ఆ ఫలితం ఎన్నిసార్లు  చేసినా ఒకేవిధంగా రావాలి, అప్పుడే అది నిజ‌మంటాం. అదే వాళ్లు చెప్పేది. వారి ప్రమాణం అలాంటిది. ఎప్పుడూ ఒకేలాంటి ఫలితం రావచ్చు, రాకపోవచ్చ‌ని అంతకు ముందు వారికి నమ్మకం లేదు. కానీ భారతీయులకు ముందు నుంచి నమ్మకం ఉంది. ఇంతకు ముందు కూడా ఉంది, భ‌విష్య‌త్తులో కూడా ఉంటుందని వారు నమ్ముతున్నారు. అలాంటి నమ్మకకానికి కారణం మనం చెప్పలేం. విశ్వాసం కారణాన్ని చూడదు. తర్కం గురించి ఆలోచించదు. చాలా కాలం క్రితమే సమాజంలో ఈ భావన పాతుకుపోయింది. కానీ ఈ విషయాన్ని మిగిలిన ప్రపంచం ఇప్పటివరకు నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు సైన్స్ ఆగిపోయింది. దాంతో వాళ్లకి ఇప్పుడు మనం కూడా దీన్ని సకారాత్మక రూపంలో తీసుకోవాలని తెలిసింది.” అని అన్నారు.
” 70వ దశకంలో ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త ఒక వ్యాసంలో సైన్స్ పరిశోధన పద్థతి ఆగిపోయిందని రాశాడు. ఇప్పుడు మనకు కాంతి వేగం కంటే వేగంగా పరిశోధన చేయగల పరికరం కావాలి. వెలుతురు కంటే వేగం ఎక్కువగా ఉంటే, భౌతిక  వస్తువులన్నీ కలిసిపోతాయి, కాబట్టి మనం అలా చేయలేము, కానీ మనకు ఒక సాధనం ఉంది. అది మనస్సు, ఆ మనస్సు  అన్వేషించాల్సిన అవసముంది. అది మనం చేయాలనుకుంటే మనం పతంజలి యోగసూత్రాలు, యోగ వాశిష్టం లాంటి ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వేదవిద్య కూడా దాని పద్ధతి వేరు. అంతర్గ‌త దృష్టి ద్వారా కూడా సత్యం తెలుస్తుంది. దాని ద్వారా భౌతిక సత్యం కూడా తెలుస్తుంది. “అని అన్నారు.
“బెంజీన్ అనే రసాయనం దాని పరమాణు సూత్రం ఎలా ఉంటుంద‌నే  దానిపై కికూలీ అనే రష్యా శాస్త్ర‌వేత్త పరిశోధన చేశాడు. కానీ అతనికి మార్గం దొరకలేదు. అదే ఆలోచ‌న‌తో నిద్రలోకి జారకున్నాడు. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. అందులో రెండు పాములు ఒకదాని తోకలను మరొకటి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కల వచ్చిన వెంటనే అతని మనసులోకి ఒక భావన వచ్చింది. కార్బన్, అణువుల కూర్పు చక్రరూపంలో నిరంతరంగా ఉంటే.. ఇందులో మనం బెంజీన్  పరమాణు నిర్మాణాన్ని సంతృప్తి పరచవచ్చు. ఆ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే కొత్త సైన్స్ శాఖ ఉద్భవించింది. దాని మూలానికి కారణం ఆ కల మాత్రమే. ప్రయోగ విధానం కాదు. కానీ విజ్ఞానంలో కూడా ఎక్సట్రా సెన్సరీ పర్సెప్షన్ అనే విషయం ఉందని చెప్పారు. ఈ ఎక్సట్రా సెన్సరీ అంటే ఏమిటీ అంటే భౌతికదృష్టికి కూడా అందకుండా మరింత లోతుగా ఆలోచించడం అన్నమాట. దీన్నే మనం అంత‌దృష్టి అంటున్నాం. ఈ ఆధారంగానే మన పూర్వీకులు సత్యాన్ని కనుక్కున్నారు.” అని మోహ‌న్ జీ అన్నారు.
“నేటి సైన్స్ ఎక్కడ ఆగిపోయిందో, వేదాల జ్ఞానం అక్కడినుంచే మొదలైంది. ఈ విషయాన్నే నిర్ధారించే గ్రంథాలు అనేకంగా నేడు మనకున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో 105 కోట్ల మంది హిందువులున్నారు. భారతీయ మతసంప్రదాయం ఏదైనా వేదాలలో జ్ఞానం ఉంటుంద‌ని న‌మ్మ‌కం ఉంటుంది. వారికి స్వంత ప్రత్యేకమైన గ్రంథాలు ఉన్నప్పటికీ వారు వాటినీ నమ్ముతారు. కానీ మనకు వేదాల గురించి పూర్తి సమాచారం తెలియదు. ఈ సంప్రదాయం అంతరించిపోతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నిరంతర దండయాత్రల కారణంగా వేద విజ్ఞానం దెబ్బతిన్న‌ది.” అని తెలిపారు.
“అగ్నిహోత్ర సంప్రదాయానికి చెందిన అనుచరుల జ్ఞాన, కర్మ, భక్తిలాంటి  త్రివేణీకి సరైన ఉదాహరణగా నిలిచే వ్యక్తులు. మీరు మీ పనిని చేయండి. మీ రక్షణ కోసం హిందూ సమాజం ఉంటుంది. దాన్ని సురక్షితంగా ఉంచడానికి  హిందూ సమాజాన్ని ఏకం చేయడం మా పని. మీరు చేయాల్సిందల్లా కేవలం సత్సంబంధాన్ని కొనసాగించడం. భారతదేశం భౌతికంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పురోగ‌తి చెందుతోంది. ఆధ్యాత్మికంగా, ధార్మికంగా అభివృద్ధి చెందాల్సిందే. అదృష్టవశాత్తూ ఇలాంటి క్లిష్టపరిస్థితులన్నింటిలోనూ, తీవ్రమైన కలియుగంలో కూడా ఈ జ్ఞానాన్ని, విద్యను కాపాడుకోవడానికి అనేక విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కుంటూ, నిష్టతో ఒక వ్రతంలాగా దీన్ని భావిస్తూ అగ్నిహోత్రాన్ని ధరించి ఆ వేదాలను ర‌క్షించ‌డానికి కృషి చేస్తున్నారు. శ్రద్ధతో, భక్తితో వాళ్లు ఆ పనిని ఆచరిస్తూనే ఉన్నారు. ప్రపంచం అంతటా ఇది విస్తరించాలి. ఈ ప్రపంచానికి అంతటికీ మీ కృప ఉండాలి. బ్రహ్మతేజస్సు, క్షాత్ర తేజస్సు కలిసి భారత దేశం ప్రపంచానికంతటికీ జ్ఞాన భిక్ష పెట్టే విశ్వగురువు అవుతుంది. ” అని మోహ‌న్ జీ అన్నారు.