Home News వరద బాధితులకు స్వయంసేవకుల సాయం

వరద బాధితులకు స్వయంసేవకుల సాయం

0
SHARE
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో అనేక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ నీటి ప్రవాహంతో కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో  సేవాభారతి కార్యకర్తలు, స్వయంసేవకులు వరద బాధితులకు తమ వంతు సాయంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మల్కాజిగిరి ప్రాంతంలో  భారీగా నీట మునిగిన ప్రాంతాల్లో స్వయం సేవకులు వారి ప్రాణాలను పణంగా పెట్టి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఉప్పల్, మేడిపల్లి లో వరదల్లో చిక్కుకుపోయిన సుమా రెసిడెన్సి కాలనీ, ప్రగతి నగర్ కాలనీ ప్రజల్ని సేవాభారతి కార్యకర్తలు సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం ఇతర సదుపాయాలను కల్పించారు. సికింద్రాబాదులోని నాగారం లో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పాలు, తాగునీటిని అందించారు.
  కిషోర్ వికాస్ కార్యకర్తలు కూడా తమ వంతు సహాయంగా ఎంజీ నగర్, షేక్ పేట బస్తిలకు చెందిన 113  మంది వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. చార్మినార్ బాగ్ లోని ఉప్పుగూడ, జగ్గంపేట, గౌలిపుర ప్రాంతాల్లోని వరద బాధితులను సేవాభారతి కార్యకర్తలు, స్వయం సేవకులు పరామర్శించి వారికి భోజనం, ఇతర సహాయక చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల సేవాభారతి కార్యకర్తలు స్వచ్ఛందంగా పడవలను తయారుచేసి వాటి ద్వారా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి నిత్యవసరాలు, దుప్పట్లు, టార్పాలిన్ కవర్లు, దుస్తులు, పాత్రలను, ప్రథమ చికిత్స సమగ్రిని అందజేశారు.
దాతలు ముందుకు రావాలి : 
 మానవ సేవయే మాధవ సేవగా భావించి వరదల్లో చిక్కుకున్న బాధితులకు తమ వంతు సాయంగా దాతలు ముందుకు రావాలని సేవాభారతి పిలుపునిస్తోంది. నిత్యవసర వస్తువులు, నీళ్ల బాటిల్లు, బిసిట్లు, స్నాక్స్ , టార్పాలిన్ కవర్లు, దుస్తులు, దుప్పట్లు, ప్యాకింగ్ సామగ్రి, మెడికల్ కిట్లను అందించి సేవా గుణాన్ని చాటు కోవాలని దాతలను సేవాభారతి విజ్ఞప్తి చేస్తోంది.
ప్రాణాలకు తెగించి ఇద్దరు వ్యక్తులను రక్షించిన ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు
వరదల్లో చిక్కుకున్న ఇద్దరిని ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు కాపాడిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. గత కొన్ని రోజులుగా  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటమునిగాయి. అదే విధంగా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్  ప్రాంతంల్లోని ఇండ్లలోకి వరదనీరు భారీగా చేరుకుంది. విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్,  వీహెచ్పీ బీజేపీ కార్యకర్తలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నీట మునిగిన ఇంటిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్న విషయాన్ని స్వయంసేవకులు గుర్తించారు. తక్షణమే స్పందించి మరో ఆలోచన లేకుండా వరద నీటిలోకి దిగి స్తంభాలకు ఉన్న కేబుల్ తీగల సహాయంతో నీటిలో చిక్కుకున్న వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి తీసుకువచ్చారు.
        ఇంతలో క్రైమ్ బ్రాంచ్ సీఐ మక్బూల్ జానీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా మరో ఇద్దరి నిండు ప్రాణాలు కాపాడిన స్వయంసేవకులను ఈ సందర్భంగా సిఐ మాక్భూల్ జానీ అభినందించారు.
రోగ నిరోధక హోమియో మందులు పంపిణీ
భారి వర్షాలకి దెబ్బతిన్న ప్రాంతాల్లో సేవాభారతి సికింద్రాబాద్ లో 3 రోజులుగా వర్ష ప్రభావిత బస్తీల్లో రోగనిరోధక మందులను స్వయం సేవకులు పంపిణీ  చేశారు. వర్షాల వల్ల విష జ్వరాలు ప్రబల కుండా 23 బస్తీల్లోని 32,000 కుటుంబాలకు చెందిన సుమారు 1 లక్ష 50 వేల మందికి రోగ నిరోధక హోమియోపతి మందులను పంపిణి చేశారు.
సేవాభారతి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు(19-10-2020)
        గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌ నగరంలోని ప్రజల ప్రజల కోసం సేవాభారతి పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి సికింద్రబాద్‌ సమీపంలోని బొడుప్పల్‌ వద్ద పలు ప్రాంతాలు నీట మునిగాయి. వెంటనే స్పందించిన సేవాభారతి కార్యకర్తలు హుటాహుటిన వరద ముంపు ప్రాంతాలకు చేరుకుని, బాధితులకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులను అందజేశారు. చెంగుచెర్ల, సాయినగర్‌, వినాయక్‌ నగర్‌, భీమ్‌ రెడ్డి నగర్, విజయపురికాలనీల్లో సుమారు‌ 250 మందికి సేవాభారతి కార్యకర్తలు ఆహార పొట్లాలను, 10 కుటుంబాలకు 7కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు, చింతపండు, పసుపు, కారం వంటి ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.