
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ వ్యాప్తంగా అందించిన వైద్య సేవలు అభినందనీయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారు అన్నారు. ఆదివారం సేవాభారతి ఆధ్వర్యంలో తెలంగాణ లోని ప్రముఖ డాక్టర్లు, వాలంటీర్లతో నిర్వహించిన వెబినార్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించినందుకు డాక్టర్లను, వారికి సహకరించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. కరొనా వల్ల సొంత కుటుంబ సభ్యులే దగ్గరికి పోలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ మానవ సేవయే మాధవ సేవ అని భావించి ఈ కొవిడ్-19 సమయంలో సేవా భారతి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. కొన్నిచోట్ల కరొనాతో మృతిచెందిన వారికి దహన సంస్కారాలను కూడా సేవా భారతి సభ్యులే దగ్గరుండి నిర్వహించినట్టు తెలిపారు. కరోనాతో యుద్ధంలో అనేక మంది డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారన్నారు. రానున్న రోజుల్లో కూడా కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారికి మనోధైర్యాన్ని అందించడంలో డాక్టర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. సమాజం లో ప్రతి ఒక్కరికీ సేవ చేయడానికి ముందుడాలని ఈ సందర్భంగా భాగాయ్య గారు పిలుపునిచ్చారు. సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాలకు, హెల్ప్ లైన్ కేంద్రాలకు సేవా దృక్పథంతో సహరించిన డాక్టర్లకు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు.