Home Telugu Articles రామ జన్మభూమి గురుంచి నాకు తెలిసిన నిజం : కె.కె.మహ్మద్‌, ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త

రామ జన్మభూమి గురుంచి నాకు తెలిసిన నిజం : కె.కె.మహ్మద్‌, ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త

0
SHARE

దేవాలయాన్ని కూల్చివేసి వివాదాస్పద కట్టడం నిర్మించారనే కీలకమైన భావనపైనే ‘రామ జన్మభూమి ఉద్యమ స్ఫూర్తి’ ఆధారపడి ఉంది. ఉద్యమం కంటే ముందే పురావస్తు శాఖ వారు తమ కసరత్తు చేపట్టారు. ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డా||కరింగమన్ను కుజ్హియిళ్‌ మహమ్మద్‌ (కె.కె.మహ్మద్‌) సభ్యునిగా ఉన్న ప్రొఫెసర్‌ లాల్‌, ఆయన బృందం సేకరించిన పురావస్తు సాక్ష్యాలు వివాదాస్పద స్థలంలో అంతకు పూర్వమే ఉన్న కట్టడాలను ధ్వంసం చేసినట్లు ధ్రువీకరించాయి. చరిత్రను పునర్దర్శించే ఈ శాస్త్రీయ కసరత్తు పూర్తి ప్రక్రియను డా|| కె.కె.మహ్మద్‌ మలయాళంలో రచించిన తన గ్రంథం ‘నేన్‌ ఎన్నా భారతీయన్‌’ (Njanenna Bharatiyan – నేను భారతీయుణ్ణి) లో వివరించారు.

అయోధ్య సమస్య గురించి చర్చించేటప్పుడు కీలకం కాగల ఆయన గ్రంథంలోని కొన్ని భాగాలు:

డా|| కె.కె.మహ్మద్‌ – ”ఈ భాగాన్ని వివరించ కుండా నా జీవిత కథ పూర్తికాదు. ఇది ఎవరి మత విశ్వాసాలను కించపరచడానికి గాని, వేరొకరి మత విశ్వాసాలను సమర్థించడానికి గాని ఉద్దేశించినది కాదు. అటువంటి ఉద్దేశాలతో గాని, అటువంటి ప్రయోజనాలకు గాని దీనిని ఏవిధంగానూ ఉపయోగించకూడదు. 1990లో అయోధ్య సమస్య తీవ్రంగా మారింది. కాని అంతకుముందే 1978లోనే ఒక పురావస్తు శాస్త్ర విద్యార్థిగా అయోధ్యను పరిశీలించడానికి నాకు అవకాశం దొరికింది.

దిల్లీలోని పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, అయోధ్య వద్ద విస్తృత పరిశీలన (సర్వే) జరుపుతున్న ప్రొఫెసర్‌ బి.బి.లాల్‌ నేతృత్వంలోని బృందంలో నేనొక సభ్యునిగా ఉన్నాను. అంతకు ముందే ఉనికిలో ఉన్న దేవాలయ స్తంభాలను ఆధారంగా కనుగొన్నాము. ఆ రోజుల్లో ఇటువంటి ఆవిష్కరణను ఎవరూ వివాదాస్పదంగా చూడలేదు. చారిత్రక భావనతో పురాతత్వ శాస్త్ర నిపుణులుగా వాస్తవాలను మేము పరిశీలించాం.

బాబ్రి మసీదు గోడలపై పొందుపరచిన ఆలయ స్తంభాలున్నాయి. ఈ స్తంభాలు నల్లని సాలగ్రామం వంటి శిలతో (బ్లాక్‌ బసల్ట్‌) తయారయ్యాయి. 11-12 శతాబ్దిలలోని ఆచరణకు అనుగుణంగా స్తంభాల దిగువ భాగంలో ‘పూర్ణ కలశాలు’ చెక్కబడి ఉన్నాయి. ఆలయ కళలో పూర్ణ కలశాలు సంపదను సూచించే ఎనిమిది పవిత్ర చిహ్నాలలో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1992లో మసీదు కూల్చిన సమయంలో అటువంటి పధ్నాలుగు స్తంభాలు అక్కడ బయటపడ్డాయి. మసీదు పోలీసు వారి రక్షణలో ఉంటూ, లోపలికి ఎవరినీ రానీయక పోయినప్పటికీ, మేము పరిశోధక బృంద సభ్యుల కావడంతో మమ్మల్ని ఎవరూ నిరోధించలేదు. అందువలన నేను స్తంభాలను చాలా దగ్గర నుండి చూడగలిగాను. ప్రొఫెసర్‌ బి.బి.లాల్‌ నేతృత్వంలోని బృందంలో భారత పురావస్తు సర్వేక్షణ విభాగం (ఆర్కియాలజి సర్వే ఆఫ్‌ – ఎఎస్‌ఐ) అధికారులతో పాటు పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థులం మేము పన్నెండు మందిమి ఉన్నాము. అయోధ్యలో వివిధ అన్వేషణల్లో రెండు నెలలు గడిపాం. బాబర్‌ సేనాధిపతి మీర్‌, అంతకు ముందు తామే కూల్చివేసిన లేదా వేరెవరో కూల్చిన ఆలయ శిథిలాలను ఉపయోగించి ఈ మసీదును నిర్మించాడు. మసీదు వెనుక వైపున, ప్రక్కవైపునా త్రవ్వకాలు జరిపేటప్పుడు బ్లాక్‌ బసల్ట్‌ స్తంభాలతో నిలిచి ఉన్న ఇటుక వేదికలను మేము కనుగొన్నాము. ఈ వాస్తవాల ఆధారంగానే బాబ్రి మసీదు దిగువన ఆలయం ఉందని 1990లో నేను ప్రకటించాను.

అప్పటికే వాతావరణం వేడెక్కింది. హిందు, ముస్లిం నాయకులు వ్యతిరేక వైఖరి అవలంబించారు. ఇరు పక్షాలలోని మితవాదులు సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. అయితే, కఠినంగా మారిన వైఖరితో విశ్వహిందూ పరిషత్‌ అప్పటికే రామజన్మ భూమి సమస్యను తమ కార్యక్రమంగా చేపట్టింది. అయోధ్యను హిందువులకు వదిలివేసి వివాదాన్ని పరిష్కరించాలని ముస్లిం మితవాదులు ఆలోచించసాగారు. కొందరు ముస్లిం నాయకులూ ఇదే అభిప్రాయంతో ఉన్నా పైకి చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. కనీసం కొందరు ముస్లిం నాయకులు, అయోధ్యను హిందువులకు వదిలివేయడం ద్వారా విశ్వహిందూ పరిషత్‌ ప్రభావాన్ని తగ్గించవచ్చునని భావించినట్లు నాకు తెలుసు. ఆ స్వరాలకు ప్రాముఖ్యం లభించి ఉంటే, పరిస్థితి కొంత సరళం కావడానికి వీలయ్యేది. కాని ఎదురు తిరిగే నైజం ఉన్న ముస్లింలతో జతగూడిన కొద్దిమంది వామపక్ష చరిత్రకారులు విషయాన్ని వక్రీకరించారు.

ఎస్‌.గోపాల్‌, రొమిల్లా థాపర్‌, బిపిన్‌ చంద్రల నాయకత్వంలో కొందరు చరిత్రకారులు రామాయణ చారిత్రికతను ప్రశ్నించడం ప్రారంభించారు. 19వ శతాబ్దానికి ముందు దేవాలయ కూల్చివేత రికార్డు లేదని వారు వాదించారు. అయోధ్య ఒక బౌద్ధ- జైన కేంద్రం అని కూడా వారు ప్రకటించారు. ప్రొఫెసర్‌ ఆర్‌ఎస్‌ శర్మ, అక్తర్‌ అలి, డిఎన్‌ ఝా, సూరజ్‌భాన్‌, ఇర్ఫాన్‌ హబిబ్‌ మొదలైన వారి చేరికతో ఈ బృందం భారీ పరిమాణాన్ని పొందింది. వీరిలో సూరజ్‌ భాన్‌ మాత్రమే పురావస్తు శాస్త్రవేత్త. బాబ్రి మసీద్‌ యాక్షన్‌ కమిటి (బిఎంఎసి) కి చెందిన నిపుణులుగా ఆర్‌ఎస్‌ శర్మ బృందానికి చెందిన చరిత్రకారులు వివిధ అధికారిక సమావేశాల్లో పాల్గొన్నారు.

చాలా బిఎంఎసి సమావేశాలు భారతీయ చరిత్ర పరిశోధన మండలి (ఐసిహెచ్‌ఆర్‌) అధ్యక్షుడు డా.ఇర్ఫాన్‌ హబిబ్‌ నేతృత్వంలో జరిగాయి. ఐసిహెచ్‌ఆర్‌ సభ్య కార్యదర్శి ఎమ్‌జిఎన్‌ నారాయణన్‌ ఐసిహెచ్‌ఆర్‌లో బిఎంఎసి సమావేశాలు జరపడాన్ని అభ్యంతర పెట్టినప్పటికి ఇర్ఫాన్‌ హబిబ్‌ ఆయనను త్రోసి పుచ్చారు. ఈ వామపక్ష చరిత్రకారులకు వార్తా పత్రికలు, ఇతర పత్రికలలో చాలా పలుకుబడి ఉండడంతో, అయోధ్యకు సంబంధించిన యదార్థాలను ప్రశ్నిస్తూ వారు ప్రచురించిన వ్యాసాలు సాధారణ ప్రజలను గందరగోళానికి గురి చేసాయి. ఈ  రకమైన వాతావరణం వలన ఒకానొక సమయంలో తమ వాదనను పక్కనపెట్టి హిందువుల వాదనను ఒప్పుకోవచ్చునేమో అని ఆలోచించిన కొందరు సాధారణ ముస్లిములు సైతం నెమ్మదిగా తమ వైఖరిని మార్చుకోవడం ప్రారంభించారు. దాంతో మితవాదులు కూడా బాబ్రి మసీదును వదులుకోజాలమనే వైఖరికి కట్టుబడవలసి వచ్చింది. కమ్యూనిస్టు చరిత్రకారుల జోక్యం వారి మానసిక పరిస్థితిని మార్చివేసింది. ఈ రెండు గ్రూపులు కలసి సంయుక్తంగా చేసిన అల్లరితో పరిష్కారానికి ఉన్న అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.

ఈ రాజీ అమలయి ఉంటే, మనదేశంలో హిందూ-ముస్లిం సంబంధాల చరిత్రలో ప్రధాన మలుపుగా ఉండేది. ఇదే ఇతర వివాదాస్పద అంశాలకూ సహజ పరిష్కారంగా పరిణమించేది. కోల్పోయిన ఈ అవకాశం హిందూ, ముస్లిం మత మూఢత్వాలే కాక, కమ్యూనిస్టు మూఢత్వం కూడా మనదేశానికి ప్రమాదకరమని నిరూపించింది.

నా ప్రకటన 1990, డిసెంబరు 15 న వచ్చింది. అప్పటికే ఇరు పక్షాల చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు తీవ్రస్థాయి వాదనలు ప్రారంభించారు. మసీదుకు దిగువన ఉన్న ఆలయ అవశేషాలను నేను చూసినట్లు నా ప్రకటనలో స్పష్టంగా చెప్పాను.

నేను ఎఎస్‌ఐలో (ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) డిప్యూటి సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్టుగా పనిచేస్తు ఉండేవాడిని.

ఆ రోజుల్లో మేము చెన్నైలో ఉన్నాం. యునెస్కో ప్రాయోజిత సిల్క్‌ రూట్‌ సెమినార్‌ నిర్వహించాం. నేను, శ్రీ కెటి నరసింహన్‌లు నిర్వాహకులం. దిల్లీ నుంచి సంయుక్త కార్యదర్శి (సాంస్కృతిక) శ్రీ ఆర్‌సి త్రిపాఠి, ఎఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ ఎమ్‌సి జోషి హాజరయ్యారు. సెమినార్‌ జయప్రదంగా నిర్వహించినందుకు ఇద్దరూ నన్ను మెచ్చుకున్నారు. ‘అలీఘర్‌ ప్రొఫెసర్‌ ఇక్కడ ఉన్నట్లైతే, అతడు సిగ్గుపడేవాడు’ అన్నాడు డా||జోషి. ఆయన డా||ఇర్ఫాన్‌ హబిబ్‌ గురించి ప్రస్తావించారు.

1992 డిసెంబర్‌ 6న నేను సెయింట్‌ గ్జేవియర్‌ పవిత్ర శేషాలను ఉంచిన గోవాలోని జోమ్‌ జీసస్‌ చర్చి రెక్టర్‌తో సంభాషణలో ఉన్నాను. అప్పుడు బాబ్రి మసీదు కూల్చివేసిన వార్త వచ్చింది. ఆ తరువాతి సంవత్సరం కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా పాత గోవాలోని క్రైస్తవ చర్చిలపై హిందూ అభిమానులు దాడి చేస్తారేమోనని ఫాదర్‌ రిగో భయపడ్డారు. మేము రెండు జట్లుగా ఏర్పడ్డాము. ఒక జట్టు ఫాదర్‌ రిగో నాయకత్వంలో బామ్‌ జీసస్‌ చర్చి వద్ద స్థావరం ఏర్పరచుకుంది. నా నాయకత్వంలో రెండోజట్టు సెయింట్‌ కేథడ్రల్‌, సెయింట్‌ అస్సిస్సీల వద్ద రాత్రంతా ఉన్నాము.

అయోధ్యలో కట్టడం కూల్చివేత సమయంలో దొరికిన విలక్షణమైన శిల్పం ‘విష్ణుహరి శిల’ అనే రాతి ఫలకం. బలినీ, దశ కంఠుని (రావణ) హతమార్చిన విష్ణువుకు (రాముడు విష్ణుమూర్తి అవతారం) ఈ దేవాలయం అంకితం చేయబడినదని – ఈ ఫలకంపై సంస్కృతంలో 11-12 శతాబ్ది నాటి నాగరి లిపిలో, వ్రాయబడి ఉంది. 1992లో డా||వైడి శర్మ, డా||కెఎమ్‌ శ్రీ వాత్సవలు ఈ స్థలం గురించి అధ్యయనం చేసినప్పుడు మట్టితో చేసిన విష్ణు అవతారాలు, శివ, పార్వతుల చిన్న విగ్రహాలను కనుగొన్నారు. ఇవి కుషాణుల కాలానికి చెందినవి (100-300 ఎడి). 2003లో అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై మరల త్రవ్వకాలు జరిపినప్పుడు, ఒకప్పుడు ఆలయ స్తంభాలకు ఆధారంగా నిలచిన 50కి మించిన ఇటుక పునాదులను కనుగొన్నారు. సాధారణంగా దేవాలయాల పై భాగంలో కనబడే ‘అమలక’, ‘అభిషేక’ జలం ప్రవహించే ‘మకర ప్రణాళి’ కూడా త్రవ్వకాలలో ఉన్నాయి. బాబ్రి మసీదు ముందు ప్రాంగణం చదును చేసే సమయంలో 263 ఆలయ సంబంధిత కళాకృతులు కనుగొన్నట్లు ఉత్తరప్రదేశ్‌ ఆర్కియాలజి సంచాలకులు డా||రాగేశ్‌ తివారి ఒక నివేదిక సమర్పించారు.

త్రవ్వకాలలో లభించిన సాక్ష్యాలు, తరువాత ఆవిష్కరించిన చారిత్రక కళాకృతుల సమగ్ర విశ్లేషణ తరువాత, బాబ్రి మసీదు దిగువన ఆలయం ఉందనే నిర్ణయానికి భారత పురావస్తు సర్వేక్షణ (ఎఎస్‌ఐ) వచ్చింది. అలహాబాద్‌ హైకోర్టు, లక్నో బెంచ్‌ కూడా అదే నిర్ణయానికి వచ్చింది. త్రవ్వకాలను నిస్పాక్షికంగా నిర్వహించడానికి 131 మంది బృందంలో 52 మంది ముస్లింలను త్రవ్వకాలలో చేర్చారు. అంతేకాక, బిఎంఎసి బృందానికి చెందిన పురావస్తు, చారిత్రక ప్రతినిధులు – సూరజ్‌ భాన్‌, మండల్‌, సుప్రియ వర్మ, జయమీనన్‌ల సమక్షంలో త్రవ్వకాలు జరిగాయి.

త్రవ్వకాలు మరింత నిష్పాక్షికంగా చేయడానికి వీలయ్యేదా?

హైకోర్టు తీర్పు తరువాత కూడా వామపక్ష చరిత్రకారులు పిల్లిమొగ్గలు వేయడం కొనసాగించారు. వారు గతంలో కూడా నిస్సిగ్గుగా తమ వైఖరి మార్చుకున్నారు. బిఎంఎసి ప్రతినిధులుగా, త్రవ్వకాలలో పాల్గొన్నవారు కేవలం చరిత్రకారులే కావడం ఈ అసంబద్ధతకు కారణం. వారిలో ముగ్గురికో, నలుగురికో పురావస్తుశాస్త్ర పరిజ్ఞానం కొంత ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి పురావస్తు శాస్త్ర పరిజ్ఞానం వారికి అసలే లేదు. దాంతో డా||బి.ఆర్‌.మణి వంటి ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్తల ముందు వారు మరుగుజ్జులైపోయారు. జెఎన్‌యు, అలీఘర్‌ విశ్వవిద్యాలయాల నుండి బిఎంఎసి ప్రతినిధులుగా వచ్చిన వారికి క్షేత్ర స్థాయి పురావస్తు శాస్త్ర పరిజ్ఞానం లేకపోవడం కారణంగా ఎఎస్‌ఐకి చెందిన శాస్త్రవేత్తలు వారిని పరిగణనలోకి తీసుకోలేదు. ఎఎస్‌ఐ సత్యవాదానికి, నిష్పాక్షికతకు కట్టుబడింది.

ఇదిలా ఉండగా, విహెచ్‌పికి సన్నిహితుడనని చెప్పుకొనే ఒక ఎఎస్‌ఐ అధికారి డా||మణి స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశాడు. ఆయన తన ప్రయత్నాలలో సఫలీకృతుడై ఉంటే దేవాలయ ఉనికిని ఋజువు చేయాలనే ఉత్సాహం అయోధ్యను మరొక విధమైన పోరాటంలోకి తీసుకెళ్ళి ఉండేది. అయితే ఎఎస్‌ఐ స్థిరంగా నిలిచింది. డా||మణిని తొలగించలేదు. ఆ విధంగా ఎఎస్‌ఐ నిష్పాక్షికతను మరోసారి నిరూపించుకుంది.

బిఎంఎసి ప్రముఖ నాయకుడు సయ్యద్‌ షాహబుద్దిన్‌, కేంద్రమంత్రి అనంత కుమార్‌కు వ్రాసిన ఒక లేఖలో- భాజపా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, దేవాలయ విస్తరణకు భాజపా శాసనసభ్యుడు జవహర్‌ ప్రసాద్‌ చేసిన ప్రయత్నాలను ధైర్యంగా ఎదుర్కొని నిరోధించిన ఎఎస్‌ఐని ప్రశంసించారు. ఈ అధికారిక లేఖను ఎఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ నాకు పంపారు. సయ్యద్‌ షాహబుద్దిన్‌కు వివరణాత్మక తిరుగు సమాధానం ఇస్తూ నేను అయోధ్య అంశాన్ని కూడా ప్రస్తావించాను. ప్రొఫెసర్‌ బిబి లాల్‌ నేతృత్వంలో జరిగిన అయోధ్య త్రవ్వకాలలో నేను పాల్గొన్నానని, బాబ్రి మసీదు దిగువన ఆలయ అవశేషాలు నేను చూసాననీ వ్రాసాను. ఈ యదార్థాన్ని అర్థం చేసుకొని అయోధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు సానుకూల ముస్లిం అభిప్రాయాన్ని సృష్టించేందుకు చొరవ తీసుకోవాలని నేను ఆయనను వేడుకున్నాను. ముస్లిం నాయకులతో జరిగే తదుపరి సమావేశంలో ఈ విషయాలను చర్చించగలమని ఆయన నాకు హామీ ఇచ్చారు.

ఆ సమావేశం తరువాత, మసీదును హిందువులకు అప్పగించడానికి ఎవరూ ఒప్పుకోలేదని ఆయన నాకు తెలియజేశారు. తరువాతి కాలంలో నేను ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపాను. బాబ్రి మసీదును హిందువులకు అప్పగించడానికి ఆయన అంగీకరించలేదు. తిరుగు ప్రయాణంలో నేను బాగా ఆలోచించాను. భారతదేశం ఒక ముస్లిం ఆధిక్యత కల లౌకిక రాజ్యంగా ఉండి, (ముస్లిం ఆధిక్యత గల దేశం లౌకిక రాజ్యం కాదనుకోండి). ముస్లిం నాయకుడు ఒక ఆలయం లోపల (అదీ ఒక జాతీయ స్మారక చిహ్నం) ఒక మసీదును విస్తరించడానికి ప్రయత్నించినట్లైతే, దానిని ఒక హిందూ అధికారి అడ్డుకున్నట్లైతే ఎంతమంది ముస్లిములు ఆ (హిందూ) అధికారిని సమర్థించి ఉండేవారు? ఇదే భారతీయ లౌకికత గొప్పదనం.

జర్మనీకి చెందిన అంతర్జాతీయ త్రవ్వకాల బృందంతో ఒకసారి నేను ఒమన్‌ దేశంలోని సలాలా వెళ్ళాను. భూగర్భ నగరం అల్‌ బాలిద్‌ త్రవ్వకం మా లక్ష్యం. అక్కడ నాకు కొందరు కేరళీయులతో పరిచయం కలిగింది. వారు కేరళలో కన్నూర్‌-తలస్సెరి ప్రాంతానికి చెందినవారు. వారందరు సిమి సానుభూతి పరులు కూడా. వారు నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. వారిలో కొందరికి అయోధ్యపైనా అభిప్రాయాలు తెలుసు. కాని నేను వారికి కొన్ని నియమాలు విధించాను. నేను వచ్చి మాట్లాడతాను. నా అభిప్రాయాలను ప్రశ్నించవచ్చు. కాని నేను జర్మనీ వారి ఆహ్వానంపై అక్కడకు వెళ్ళాను కాబట్టి, అక్కడ ఎటువంటి అసహ్యమైన సంఘటన జరుగరాదు. క్రమశిక్షణ పాటించాలి. వ్యతిరేక అభిప్రాయాల పట్ల సహనం కలిగి ఉండాలి. వారు అంగీకరించిన మీదట నేను రామజన్మభూమి గురించి మాట్లాడాను. ప్రారంభంలో ఇస్లాం సహనంతో ఉన్న కాలంతో ప్రారంభించాను. నా ఖురాన్‌ పఠనం వారికి ఆశ్చర్యం కలిగించింది. త్రవ్వకాలలో కళాఖండాల ఆవిష్కరణ గురించి నేను వివరంగా మాట్లాడాను. వారు అత్యంత శ్రద్ధగా విన్నారు. నా ఉపన్యాసాన్ని ఈ విధంగా ముగించాను.

‘ముస్లింలకు మక్కా, మదీనా ఎలాగో హిందువులకు అయోధ్య అదేవిధంగా ముఖ్యమైనది. మక్కా గాని, మదీనా గాని వేరొక మతం ఆధీనంలో ఉండడాన్ని ఏ ముస్లిమూ ఊహించలేడు. హిందువులు జనాధిక్యంగా ఉన్న దేశంలో కూడ, తమ దేవాలయం ముస్లిముల ఆధీనంలో ఉన్నదనే అవమానాన్ని ఎదుర్కొంటున్న నిస్సహాయ హిందువుల మొరను ముస్లిములు ఆలకించాలి. హిందువులు బాబ్రి మసీదును రామజన్మ భూమిగా నమ్ముతుండగా, ఆ ప్రాంతంలో ప్రవక్త మహమ్మదుకు ఏ సంబంధమూ లేదు. స్థలానికి సహబీస్‌తో కాని ఖులాఫర్‌ రన్విదిన్‌తో కాని ఏ సంబంధము లేదు; అలాగే, తాబియన్‌తో కాని, ఔలియ లేదా సలాఫ్‌ అజ్‌ – సలియాతో కాని ఏ సంబంధం లేదు. ఇది మొగల్‌ పాదుషా బాబర్‌కు మాత్రమే సంబంధించినది. అటువంటప్పుడు ఈ మసీదుకు అంతటి ప్రాముఖ్యం ఎందుకు?

నేను నా చిన్ననాటి సంఘటన వివరించాను. ‘జెరూసలేం కు చెందిన బైతుల్‌ ముక్దాస్‌ యూదుల వశమైనప్పుడు మేమందరం కొడువలి జుమా మసీదులో సమావేశమై, బైతుల్‌ ముక్దాసును తిరిగి పొందడానికి అల్లాకు మొరపెట్టుకున్నాము. మనం బైతుల్‌ ముక్దాస్‌ను కోల్పోయినప్పుడు పడిన క్షోభనే ఒక సాధారణ హిందువు ఈ రోజు అనుభవిస్తున్నాడు. నేను విద్యావంతుడైన ప్రగతి శీల హిందువు గురించి మాట్లాడటం లేదు. తీవ్రమైన చలి కాలంలో పైన చొక్కా లేకుండ, కాళ్ళకు చెప్పులు లేకుండ, కేవలం శ్రీరాముని దర్శనం కోసం ఎంతో దూరం నుండి నడచి వచ్చే ఉత్తర భారతదేశపు హిందువు గురించి మాట్లాడుతున్నాను. వారి బంధమూ, మతపరమైన వారి భావాలను మనం గౌరవించలేమా?

అక్కడున్న ప్రేక్షకులు అంతర్మథనానికి లోనయారు. నేను కొనసాగించాను. స్వాతంత్య్రానంతరం ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశం ఏర్పడింది. భారతదేశం ఒక హిందూ రాజ్యంగా ప్రకటించుకోగలిగి ఉండేది. కాని గాంధి, నెహ్రూ, పటేల్‌, అజాద్‌ వంటి గొప్ప మహనీయులు ఆ విధంగా జరుగనీయలేదు. ముస్లిం అల్పసంఖ్యాకులకు వారి స్వంత దేశాన్ని ఇచ్చిన తరువాత సైతం, భారతదేశాన్ని ఒక మతాతీత లౌకిక రాజ్యంగా ప్రకటించారు. ఇటువంటి విశాల హృదయాన్ని ప్రపంచంలో మరెక్కడా చూడలేము. ఈ విధంగా చేసినందుకే, ధోవతి కట్టుకున్న ఆ ముసలాయన మతాతీత లౌకికత్వ బలిపీఠంపై తన ప్రాణాలు త్యాగం చేయవలసి వచ్చింది.

ప్రేక్షకులకు కొంత ఆలోచించే అవకాశం ఇస్తూ కొద్దిసేపు ఆగిపోయాను. ఆ తరువాత కొనసాగించాను. ‘ముస్లింలు అధిక సంఖ్యలో ఉంటే భారతదేశం మతాతీత లౌకిక రాజ్యం అయ్యేదా?’. ప్రేక్షకుల నుండి సమాధానం లేదు. నేను చెప్పాను. ‘లేదు, భారతదేశం ముస్లిం జనాధిక్యత కల దేశమే అయి ఉంటే, అల్ప సంఖ్యా హిందువులకు ప్రత్యేక దేశాన్ని ఇచ్చిన తరువాత తనను తాను మతాతీత లౌకిక రాజ్యంగా ప్రకటించుకొని ఉండేది కాదు. హిందుత్వంలో నున్న విశాల దృక్పథం ఇదే. అదే హిందుత్వ సహనశీలత. ఈ ఉదార మనస్సును మనం అర్థం చేసుకోవాలి. గౌరవించాలి.

భారతదేశంలో హిందువులు కాక వేరొక మతస్తులు అధిక సంఖ్యాకులయి ఉంటే, ముస్లిముల దుస్థితి ఏ విధంగా ఉండేదో మనం ఒకసారి ఊహించడం మంచిది. అటువంటి చారిత్రక వాస్తవాన్ని అందరూ అంగీకరించి, రాజీ పడడానికి సిద్ధపడతారు. అప్పుడే మనం సరైన అర్థంలో మతాతీత లౌకిక రాజ్యం అవుతాము. ఈ ఆలోచనా విధానాన్ని నేను రివర్స్‌ థింకింగ్‌ అని పిలిచాను. మీరు హిందువు అయితే మీరు ముస్లింను అని ఊహించుకొని సమస్యను చేరుకోండి. ఒకవేళ మీరు ముస్లిం అయితే మీరే హిందువునని భావించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మనం వేర్వేరు మతాలకు చెందిన వారమవడం కేవలం యాదృచ్ఛికం.

బాబ్రి మసీదుపై ఉన్న హక్కును హిందువులకు అనుకూలంగా వదలుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చుననే నా అభిప్రాయాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారని నాకనిపించింది. అయితే ఎవరూ బహిరంగంగా అంగీకరించలేదు. ఒకోసారి హావభావాల నుండే మనకు సమాధానాలు లభిస్తాయి. ప్రేక్షకులు అధిక భాగం యువకులే. కార్యక్రమం ముగిసిన తరువాత నిర్వాహకులు నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి ‘సయ్యద్‌ షాబుద్ధిన్‌ వంటి అగ్ర నాయకులకు ఈ విషయాలు అన్నీ మీరు ఎందుకు చెప్పలేదు?’ అని అడిగారు. ‘ఆ సమయంలో నాకు ఆయనతో పరిచయం లేదు. షేర్‌ షా సూరి మక్బారా సంఘటన తరువాతే ఆయనతో నాకు పరిచయం కలిగింది. ఆ తరువాత అన్ని విషయాలతో ఆయనకు లేఖ వ్రాసాను’ అని చెప్పాను.

భారతదేశంలో అనేక మతాలున్నాయి. ఐరోపాలో మతతత్వం గణనీయంగా తగ్గింది. కేవలం వారసత్వం, సంస్కృతి కారణంగా పశ్చిమ మతాలు ఉనికిలో ఉన్నాయి. హిందువులలో పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్న వారు కూడా ఎక్కువగా హిందువులేనని మనం గుర్తుంచుకోవాలి.

– డా|| కె.కె.మహ్మద్‌

(జాగృతి సౌజన్యం తో)