Home News మరోసారి పాక్ కు బుద్ధి చెప్పిన భారత్

మరోసారి పాక్ కు బుద్ధి చెప్పిన భారత్

0
SHARE

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీపై అనాగరికంగా వ్యక్తిగత విమ‌ర్శ‌ల‌కు దిగిన తీరును భారత్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. న్యూయార్క్ వేదికగా బిలావల్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిది ఆరిందమ్ బాగ్ని గట్టిగా తిప్పికొట్టారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాక్ ‘ ఉగ్రవాద కేంద్రం’గా మారిందంటూ గురువారం న్యూయార్క్ లోని ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పరోక్షంగా ఎండగట్టారు. ప్రపంచమంతా పాకిస్థాన్ ను ఉగ్రవాదానికి రాజధానిగా భావిస్తోంద‌ని, ఆ అభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నించాలని దాయాది దేశానికి హితవు చెప్పారు. దీనికి స్పందనగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ ఏకంగా భార‌త ప్రధానిపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు దిగాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై భార‌త్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బిలావ‌ల్ వ్యాఖ్య‌లు పాకిస్థాన్ స్థాయిని మ‌రింత దిగజార్చాయ‌ని పేర్కొంది.

పాక్ మంత్రి తన అసహనాన్ని స్వదేశంలో ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా పెంచి పోషిస్తున్న సూత్రదారుల వైపు మళ్లిస్తే బాగుంటుందని ఆరిందమ్ బాగ్ని సూచించారు. ఒసామాబిన్ లాడెన్ ను అమరవీరుడని కీర్తిస్తూ లఖ్వి, హఫీజ్ సయీద్, మసూద్ ఆజర్, దావుద్ ఇబ్రహీం వంటి అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇచ్చిన దేశంగా పాక్ ను విమర్శించారు. ఐక్యరాజు సమితి గుర్తించిన 128 మంది ఉగ్రవాదులు, 27 ఉగ్రవాద సంస్థలు గల దేశం ప్రపంచంలో మరొకటి ఉండదని బాగ్నీ అన్నారు. న్యూయార్క్, ముంబై, పుల్వామా, పఠాన్‌కోట్, లండన్ వంటి నగరాల‌లో పాకిస్తాన్ ప్ర‌యోజిత‌, ప్రేరేపిత ఉగ్రవాదం కలిగి ఉన్న‌ద‌ని భార‌త్ గుర్తు చేసింది. పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్ బుల్లెట్ల నుండి 20 మంది గర్భిణీ స్త్రీల ప్రాణాలను కాపాడిన ముంబై నర్సు అంజలి కుల్తే సాక్ష్యాన్ని పాక్ విదేశాంగ మంత్రి నిన్న UN భద్రతా మండలిలో మరింత స్పష్టంగా వినాల్సి ఉండేద‌ని హిత‌వు ప‌లికింది.

భార‌త విదేశాంగ స‌హాయ మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతూ ‘పాకిస్థాన్ విదేశాంగ మంత్రి వాడిన భాష ఆయన దివాళా తీసిన దేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా అత‌ను మానసికంగా కూడా దివాళా అయ్యాడ‌ని, తీవ్రవాద మనస్తత్వం ఉన్నవారి నుండి ఇంత‌క‌న్నా ఆశించగలం” అని ఘాటుగా స్పందించారు.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ ” బహుశా పాకిస్తాన్ ఇప్పటికీ 1971 నాటి బాధను అనుభవిస్తున్న‌ది. ఆ రోజు 93,000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు భారతదేశం ముందు లొంగిపోయారు. అతని తాత (జుల్ఫికర్ అలీ భుట్టో, మాజీ పాకిస్తాన్ అధ్యక్షుడు) వారు ఓడిపోయినప్పుడు ఏడ్చారు. ఉగ్రవాదానికి రక్షణ కల్పించడానికి, పాక్ నీచమైన ప్రణాళికలు ప్రపంచానికి బట్టబయలయ్యాయి” అని ఠాకూర్ అన్నారు.