Home News సామాజిక సమరసత ఆద్వర్యంలో ముత్యంపేట పల్లెలో ఉచిత వైద్య శిబిరం

సామాజిక సమరసత ఆద్వర్యంలో ముత్యంపేట పల్లెలో ఉచిత వైద్య శిబిరం

0
SHARE

తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా తొగుట మండలం లోని ముత్యంపేట గ్రామంలో 50 పైగా కుటుంబాలు సంచార జాతుల కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి. వారి జీవన స్థితిగతులపై సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో 10 డిసెంబర్,2016( శనివారం) నాడు గ్రామంలో సర్వే నిర్వహించడం జరిగింది.

జిల్లా కేంద్రం సిద్దిపేటకు 15 కిమీ దూరంలో వున్న గోవర్ధనగిరి రెవిన్యూ గ్రామ పరిధిలోనిది, ఈ ముత్యంపేట పల్లె.   ఇప్పటికి ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన ఈ పల్లె ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితుల్లొ బ్రతుకుతున్నారు.

విద్య లేక, పరిశుభ్రత పాటించక అనారోగ్యం పాలవుతూ, స్థిరమైన జీవనోపాధి, ఆదాయం లేక, అప్పుల బారిన పడుతూ, మూఢనమ్మకాలు పాటిస్తూ, అప్పు తెచ్చిన మొత్తాన్ని మద్యానికి, జంతు బలులకు దుర్వినియోగం చేస్తూ తమ జీవితాలు బలి చేసుకుంటూ వున్నారు. కొద్దిగా విద్యాబుద్దులు నేర్చిన యువకులపై, కుల పెద్దలు తమ భావాలను బలవంతంగా రద్దుతున్నారని వారు వాపోతున్నారు.  పక్కా ఇళ్ళు లేక గుడిసెల్లో ఉంటూ అపరిశుభ్రత వాతావరణంలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. జీవనోపాధికి చెట్ల వెంట తిరుగుతూ పిట్టలు, నక్కలను వేటాడి బ్రతుకులు వెళ్ళదీస్తున్నారు.

అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులు లక్ష్మణ్, రామేశ్వర్ రెడ్డి లు బాల బాలికల్లో విద్యాబుద్ధులు నర్పడానికి కృషి చేస్తున్నారు. ఈ పల్లె నుండి 12 మంది అందె గ్రామానికీ చదువుకోసం వెళ్లే వారికి ‘సామాజిక సమరసత’ వేదిక ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేసింది.  ఆధ్యాత్మిక భావ వ్యాప్తికి గణపతి నవరాత్రులు అర్చకులతో జరిపించి, విలువల గొప్పతనం వివరించింది.

ఇక్కడ పల్లెల్లో ఉన్న 50 మంది బాలబాలికలకు పరిశుభ్రత, భజనలు నేర్పించింది. గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు నరేశ్ బాబు ఆధ్వర్యంలో 6 గురితో కూడిన వైద్యబృందం పల్లెలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, 200 మందికి ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించింది.  డా. నరేశ్ బాబు గారి ఆధ్వర్యంలో గజ్వేల్ నుండి  డా. పెంటాచారి, డా. శ్రీనివాస్, డా. నీహారిక,  డా. సత్యనారాయణ, డా. లింగం తదితరుల  బృందం వచ్చి వైద్యసేవలు నిర్వహించింది.

సామాజిక సమరసత వేదిక వీరి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి నడుం కట్టింది. ప్రభుత్వ పథకాలు అందక, దుర్భరమైన జీవనం గడిపే ఇక్కడి

ప్రజలకు ప్రభుత్వ అండదండలు తప్పనిసరని  గుర్తించింది. సిధ్దిపేట జిల్లా లో ఇంత దారుణమైన సంచార జాతుల బస్తీ వుందా?  సామాజిక సమరసత వేదిక సర్వే లో బయట పడ్డ చెప్పలేని నిజాలు.

30 ఏళ్ల క్రితమే ఇక్కడికి వలసవచ్చి స్థిరపడి పోయిన ఈ 50 కుటుంబాలు దయనీయమైన స్థితిలో బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. పెంటయ్య అని ఒక పెద్దమనిషి ( ఈ ఫోటోలలో వున్నాడు) ఈ ప్రజల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి, ఎస్.సి కుల ధృవపత్రం తెప్పించాడు. అది మినహాయిస్తే వీరి బ్రతుకులలో వచ్చిన మార్పు ఏమీ లేదు. పూరిగుడిసెల్లో సంసారం, చెత్తా చెదారం మధ్య మురికినీరు ప్రవహిస్తున్న చోట వంటలు, స్నానం  చేయకుండానే రోజంతా తిరుగుళ్లు, ఫలితంగా చర్మవ్యాధులు ప్రబలి అనారోగ్యం తో బాధపడుతున్నారు. కడుపునొప్పులు, ఎసిడిటీలు, కీళ్లనొప్పులు, కంటివ్యాధులు మొదలైన రోగములు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి.

ప్రైమరీ పాఠశాలకు వెళ్ళే 50 మందికి పైగా  బాలబాలికలు స్నానము చేయకుండా బడికి వస్తారు. స్నానం కి ఇంటికి పంపిస్తే మళ్ళీ బడికి రారు.  ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ, అమ్మవారికి బలులు ఇవ్వాలని,  దానికోసం  స్థోమత కి మించి 10,000 రూపాయలు అప్పు తెచ్చి ఖర్చులు చేయటం ఆనవాయితీ గా, మూఢనమ్మకం గా మారింది.

సామాజిక సమరసత వేదిక 15 మంది యువ విద్యార్థులతో  డిసెంబరు 10 వ తేదీన   సమగ్రంగా సర్వే జరిపించింది. దీని పూర్తి నివేదిక కొద్ది రోజుల్లోనే వస్తుంది. మాట్ల సుమన్ అధ్వర్యంలో సూకూరి  శ్రీనివాస్, జక్కుల కరుణాకర్,సంతోష్, సతీష్, విశాల్, కాల్వ వినోద్, రవి, కనకయ్య, మాట్ల మహేశ్, జక్కుల కుమార్, అర్జున్, జక్కుల మహేశ్, యాదగిరి, చంద్రశేఖర్ మొదలైన వారు సర్వే చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వీళ్ళ వరకు ఎందుకు రావడం లేదు? సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారి  ఇలాఖా ఇది. ఈ దుస్థితి వారి వద్దకు వెళ్తే గాని అభివృద్ధికి నోచుకోదా? మద్యానికి బానిసలుగా,  దురాచారాలకు బలిపశువులై బ్రతుకులీడుస్తున్న వీరి జీవితాల్లో వెలుగులు రావడానికి ఎంతకాలం పడుతుందో?

 ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నడుము కట్టి వెనుక బడిన ఈ ప్రజల ప్రగతికి కృషి చేయాలి.