Home News ఆరెస్సెస్ సమావేశాల్లో పర్యావరణం, జల సంరక్షణపై చర్చ

ఆరెస్సెస్ సమావేశాల్లో పర్యావరణం, జల సంరక్షణపై చర్చ

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు ముంబైలోని కేశవ్ సృష్టి ప్రాంగణంలో  ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా  ఆరెస్సెస్ సర్ సంఘచాలక్  డాక్టర్ మోహన్ జీ భాగవత్ మరియు సర్ కార్యవాహ సురేష్ జోషి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మరియు భారత్ మాత చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాంబాహు మెహ్లి ఆడిటోరియం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ్ డాక్టర్ మన్మోహన్ వైద్య మాట్లాడుతూ, అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు సంవత్సరంలో  రెండుసార్లు,ఒకటి మార్చి నెలలో, మరొకటి దీపావళికి ముందు జరుగుతాయని తెలియజేశారు.

ఈ సమావేశాల్లో దేశం మొత్తం నుంచి ఆరెస్సెస్ అఖిల భారత, క్షేత్ర మరియు ప్రాంత ప్రతినిధులందరూ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో అఖిలభారత ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ మరియు సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర ఠాకూర్ కూడా ఉన్నారు. అఖిల భారత  కార్యకారి సమావేశాలు నవంబర్ 2 వరకు కొనసాగుతాయి. ముంబయిలో ప్రారంభమైన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మన్మోహన్ వైద్య మాట్లాడుతూ.. సమావేశాల్లో సంఘం వివిధ జాతీయ అంశాలను చర్చించడంతో పాటు గత సంవత్స కాలంలో చేసిన కార్యక్రమాలపై సమీక్ష మరియు రాబోవు సంవత్సరంలో చేయాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చ జరుగుతుందన్నారు.

ఇంతే కాకుండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏయే క్షేత్రాల్లో ప్రయోగాత్మక కార్యక్రమాలు నిర్వహించిందో వాటిపై కూడా సమీక్ష ఉంటుందని తెలియజేశారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 2010వ సంవత్సరం నుండి కార్యవిస్తరణలో భాగంగా కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు చేసింది. సంఘం పని రోజూవారీ శాఖల ద్వారా విస్తరించబడింది. నేడు లేహ్, లఢక్ మొదలుకుని త్రిపుర మరియు అండమాన్ వరకు దేశవ్యాప్తంగా 55 వేలకు పైగా ఆరెస్సెస్ శాఖలు నడుస్తున్నాయి. ఆరెస్సెస్ కార్యక్రమాలు నేడు దేశంలోని 850 జిల్లాలు మరియు 6 వేల తాలూకాలకు వ్యాపించింది.

సంఘ శాఖల్లో 90 శాతం నియమితంగా నడుస్తున్నాయి. ప్రతి 10 నుండి 12 గ్రామాలను ఒక మండలంగా విభజించడం జరిగింది. ఈ విధంగా 56 వేల మండలాల ద్వారా అన్ని గ్రామాలు  ఈ వ్యవస్థలో కలపబడ్డాయి. వీటిలో 58 శాతం మండలాలకు ఆరెస్సెస్ పని విస్తరించింది. గత మూడు సంవత్సరాల కాలంలో మండలాలలో 5 శాతం మరియు శాఖల ఏర్పాటులో 3 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం 31 వేలకు పైగా ప్రాంతాల్లో ఆరెస్సెస్ శాఖలు నడుస్తున్నాయి. అందులో 82 శాతం శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తుండగా 18 శాతం పట్టణ, నగర ప్రాంతాల్లో నడుస్తున్నాయి.

ప్రస్తుత సమావేశాల్లో పర్యావరణం మరియు జలసంరక్షణ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసే విషయమై ప్రత్యేక చర్చ జరుగుతుంది.

1998వ సంవత్సరం నుండి దేశంలో గ్రామ వికాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా 600 గ్రామాల్లో వచ్చిన ప్రత్యక్ష ఫలితాల ఆధారంగా మరో 2000 గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని మన్మోహన్ వైద్య తెలిపారు.

గో సంవర్ధన గతివిధిలో భాగంగా స్వదేశీ గో సంతతి సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం, గో చికిత్స మొదలైన వాటిలో ప్రయోగాలు సాగుతున్నాయని ఆయన తెలియజేశారు.  నేడు ప్రపంచంలో న్యూజిలాండ్, బ్రెజిల్ దేశాల్లో దీనికి ఆదరణ పెరుగుతోంది. 2010వ సంవత్సరం నుండి ఈ దిశగా విస్తృతమైన పని ప్రారంభించబడింది. ఇప్పటివరకు 1500 నూతన గోశాలలు ప్రారంభించబడ్డాయి. గో పరిశోధనా సంస్థల ద్వారా గోమూత్రం మరియు గోవు పేడపై ప్రయోగాలు జరుగుతున్నాయని తెలియజేశారు.

ప్రబోధన ద్వారా కుటుంబాలను కలిపే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని సంఘం చేపట్టింది. నేడు కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమవుతోంది. ఈ కుటుంబ వ్యవస్థను ఎలా రక్షించాలి, అందుకు చేపట్టాల్సిన విస్తృత కార్యక్రమంపై ఆరెస్సెస్ ఈ సమావేశంలో చర్చిస్తుందని తెలియజేశారు.

ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే స్వయంసేవకులు అన్ని ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ సహాయకార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఇటువంటి సహాయక చర్యల్లో పాల్గొనే స్వయంసేవకులకు శిక్షణనిచ్చే అంశాన్ని కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. స్వయంసేవకులు ప్రస్తుతం 1 లక్ష 50 వేల వివిధ సేవా ప్రకల్పాలు (ప్రాజెక్టులు) నిర్వహిస్తున్నారని తెలియజేశారు. స్వయంసేవకుల ఏయే అంశాలపై ఆసక్తి ఉంది అనే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వే జరుగుతోందని, దీని ద్వారా వారి వారి ఆసక్తికి తగినట్లుగా కార్యక్రమాల రూపకల్పనపై కూడా చర్చ జరుగుతుందన్నారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై చర్చ ఉంటుందని తెలియజేశారు.

రామమందిరం అంశంపై విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా “ఇది హిందూ-ముస్లిముల మధ్య సమస్య కాదు, ఒక మందిరం-మసీదు సమస్య కాదు. బాబర్ సైన్యం అయోధ్యపై దాడి చేసిన సమయంలో అక్కడ మసీదు నిర్మాణానికి  స్థలం లేకపోలేదు. మసీదుల నిర్మాణానికి కావలసినంత భూమి పుష్కలంగా ఉంది. కానీ అతడు దురాక్రమణ ద్వారా మందిరాన్ని నేలకూల్చాడు. మొట్టమొదట ఇక్కడ ఆలయం ఉందన్న పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో నిరూపించబడింది. ఇస్లామిక్ పండితుల ప్రకారం దురాక్రమణతో కబ్జా చేసిన భూమిలో చదివే నమాజ్ అంగీకరించబడదు. భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా నమాజు కోసం  మసీదు అవసరం లేదని, అది ఎక్కడైనా చేయవచ్చని చెప్పిందని ఆయన గుర్తుచేశారు.

రామమందిరం జాతీయ స్వాభిమానం, గౌరవాలకు సంబందించిన విషయం. సర్దార్ పటేల్ సోమనాథ ఆలయాన్ని పునప్రతిష్టించారు. అప్పటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యారు. ఇదే విధంగా ప్రభుత్వం రామమందిరానికి చెందిన భూమిని స్వాధీనపరచుకొని దాన్ని మందిర నిర్మాణం కోసం అప్పగించే విధంగా చట్టం చేయాలని మన్మోహన్ వైద్య కోరారు.