Home Telugu Articles హిందువుల రాజకీయ ఐక్యత అత్యంత అనివార్యం!

హిందువుల రాజకీయ ఐక్యత అత్యంత అనివార్యం!

0
SHARE

భారత రాజకీయాలు కనీవినీ ఎరుగని ఒక పెద్ద మలుపు దగ్గరకు చేరాయి. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల సమయానికే దేశ రాజకీయ దృశ్యంలో ఒక విభజన రేఖ స్పష్టంగా అవతరించింది. ‘హిందూత్వ’ రాజకీయాలు ఒక వైపు. హిందూయేతర రాజకీయాలు మరొకవైపు. ‘హిందూత్వ రాజకీయాలు’ అన్న పేరును నిజానికి హిందూత్వ రాజకీయ శిబిరం ప్రకటించుకోలేదు. ఈ పేరు పెట్టినది హిందూయేతర రాజకీయ శిబిరమే. పైగా హిందూత్వ రాజకీయాల పేరుతో ఇవాళ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న దాడి, విమర్శ ఇంత తీవ్రస్థాయిలో మున్నెన్నడూ లేదు. ఇక ఓటు బ్యాంక్‌ రాజకీయాలే హిందూయేతర రాజకీయ శిబిరానికి ఆయువుపట్టు. హిందూయేతర శిబిరం ఏర్పడడం కానీ, అక్కడ నుంచి అలాంటి విమర్శలు వెల్లువెత్తడానికి కారణం ఓటు బ్యాంక్‌. ఇక్కడే చాలా ప్రశ్నలు వస్తాయి. తరచి చూస్తే హిందూత్వ శిబిరం ఆవిర్భావానికీ, హిందూ ఓటు బ్యాంకు ఆలోచనకీ అనివార్యంగా రూపురేఖలు దిద్దిన వాస్తవం కూడా స్పష్టమవుతుంది.

ఎన్నికల వేళకే హిందూయేతర శిబిరంలో కదలిక ఇటీవల కాలంలో సర్వసాధారణం కావడం కూడా ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానంగా భావించు కోవాలి. మైనారిటీలతో కూడిన హిందూయేతర ఓటు బ్యాంకు రూపుదిద్దు కుంటూ ఉంటే, హిందూ ఓటు బ్యాంకు సహజంగానే పెద్ద ప్రయత్నం లేకుండానే ఆవిర్భవిస్తుందన్నది వాస్తవం. ఇందుకు ఈనాటి రాజకీయవేత్తల వ్యూహాలూ ఎత్తుగడలూ మాత్రమే కారణం కావు. మతం, మతం పట్ల ఉన్న మమేకత్వం, మతం ప్రాతిపదికగా దేశ విభజనను చూసిన అనుభవం, వీటి ఆధారంగా ఏర్పడిన బలమైన చారిత్రక నేపథ్యం హిందూ ఓటు బ్యాంక్‌ లేదా అలాంటి ఆలోచనకు ముఖ్యమని గమనించాలి. నిజానికి దీనిని హిందూ ఓటు బ్యాంక్‌ అనడం పూర్తిగా న్యాయం కాదు. దీనిని భారతీయ ఓటు బ్యాంక్‌ అనాలి. అంటే భారతీయతకు సానుకూలమైన ఓటు. ఇలాంటి ఓటర్లలో హిందువులు కూడా భాగం. ఈనాడు భారతీయతను గౌరవిస్తున్న హిందూ యేతరులు దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

హిందూయేతర రాజకీయ శిబిరంలోని వారంతా ఆ జీవన విధానానికి వ్యతిరేకమని ఎవరూ చెప్పడం లేదు. తాము సెక్యులరిస్టులమనీ, సమన్యాయం, పురోభివృద్ధి ధ్యేయంగా ఉన్నవారమనీ ఈ శిబిరం చెప్పుకుంటూ ఉంటుంది. ఇది వాగాడంబరమని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. ఇస్లాం ఫండమెంటలిజం పేదరికంగా కారణంగా విస్తరించిందని మొదట వీరు వాదించారు. అది శుద్ధ తప్పని తేలింది. దీనితో మాట మారింది. మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడం సరికాదన్న నినాదం పట్టుకొచ్చారు. పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేస్తే మొత్తం పాకిస్తాన్‌ను నిందించడమేమిటన్న వాదన ఇలాంటిదే. కానీ ‘హిందూ ఉగ్రవాదం’ అంటూ, మతమంటే ఏనాడూ తీవ్రంగా పరిగణించని మెజారిటీ సమాజాన్ని అవమానించడం ఈ శిబిరం చేస్తున్న పెద్ద తప్పిదం. ఇలాంటి నిందను పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మదలీ జిన్నా కూడా వేయలేదు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌ను హిందువుల సంస్థ అని మాత్రమే అన్నాడు. ఆయన దృష్టిలో గాంధీ ‘హిందూ సాధువు’. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అక్కసుతో, భారతీయతను, భారతీయులను కూడా ఆ శిబిరం విమర్శించడం సర్వసాధారణంగా మారిపోయింది. భారతీయ జనతా పార్టీని రాజకీయంగా విమర్శించే హక్కు ఆ శిబిరానికి ఉంది. కానీ భారతీయతను విమర్శించే హక్కు లేదు. హిందూత్వను తూలనాడే అవసరం అసలే లేదు. ఇలాంటి ధోరణిలోని అనౌచిత్యాన్ని గుర్తించడం మొదలు కావడంతోనే హిందూ రాజకీయ ఐక్యతకు, తదనుగుణంగా హిందూ ఓటు బ్యాంకు రాజకీయా లకు సోపానాలు పడినాయని గుర్తించవలసి ఉంటుంది. పరిపూర్ణ భారతీయత, లేదా హిందూత్వను విశ్వసించే వారి రాజకీయ హక్కుల రక్షణకు హిందూ ఓటు బ్యాంక్‌ – నిజానికి భారతీయ ఓటు బ్యాంక్‌ ఏర్పడాలన్న ఆలోచన కొంత ఆలస్యంగా రూపుకట్టిందనే చెప్పాలి. చారిత్రక, వర్తమాన పరిణామాలను చూశాక ఇదొక అనివార్య పరిణామమనిపిస్తుంది. వర్తమాన రాజకీయ దృశ్యం ఇందుకు దోహదం చేసినా దీని మూలాలు మాత్రం గతంలోనే ఉన్నాయి.

రాజకీయ శక్తిగా భారతీయత

ఒక ప్రశ్నతో ఈ అంశాన్ని ప్రారంభించడం సమంజసంగా ఉంటుంది. ‘హిందూ ఉగ్రవాదం’ అన్నమాట కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పి. చిదంబరం నోటి నుంచి విన్నాం. కానీ క్రైస్తవ నేపథ్యం ఉన్న అధినాయకత్వం చేతిలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్న కాలంలో ఈ నీచమైన ఆరోపణ వచ్చింది. కాబట్టి ఇది యాదృచ్ఛికమని అనుకోలేం. ఇది భారతీయతను పట్టించుకునే హిందువులను బాధించేదే. హిందువుల ప్రయోజనాల మాటేమిటన్న ఆలోచనకు వచ్చేటట్టు చేసేదే. ఎనభయ్‌ శాతం ఉన్న హిందువుల మనోభావాలకు ఏదీ విలువ అన్న ప్రశ్నను లేవనెత్తేటట్టు చేసేదే. జాతీయ భావాలు, దేశీయమైన సాంస్కృతిక విలువలకు చోటు కరువైపోతున్నదన్న క్షోభ భారతీయ ఓటు బ్యాంకును పటిష్టం చేస్తోంది. చరిత్ర పుటలలోను ఇదే కనిపిస్తుంది.

హక్కులను, ఉద్యమాలను ఆధునిక దృష్టితో చూసే అవకాశం కొన్ని దశాబ్దాలకు గాని భారతీయులకు దక్కలేదు. ఇవి విదేశీయమే అయినా వాటిని భారతీయత కోణం నుంచి చూసే అవకాశం కల్పించినవారు రాజారామమోహన్‌రాయ్‌, స్వామి దయానంద, ఆత్మారాం పాండురంగ, స్వామి వివేకానంద వంటివారే. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. 1905లో బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం వచ్చే వరకు అందులో భారతీయతతో కూడిన చింతన తక్కువ. బాలగంగాధర తిలక్‌, లాలాలజపతిరాయ్‌, బిపిన్‌ పాల్‌ నాయకత్వం ఏర్పడే వరకు అలాంటి చింతనకు అందులో స్థానం దక్కలేదు. తరువాత అరవింద్‌ ఘోష్‌ వంటివారు కొంతవరకు ప్రభావితం చేయగలిగారు. కానీ భారతీయమైన ఆలోచన, ఆ ఆలోచన పునాదిగా ఉద్యమం, రాజకీయ హక్కుల సాధన అందులో లేదు. అయినప్పటికి భారత జాతీయ కాంగ్రెస్‌ను హిందువుల ప్రయోజనాలకు ఏర్పడిన సంస్థగా, ముస్లింల హక్కుల గురించి పట్టించుకోని సంస్థగానే నాటి ముస్లిం పెద్దలు భావించారు. కాంగ్రెస్‌ ఉద్దేశాలను ముస్లింలు సదా శంకిస్తూనే ఉన్నారన్నది నిజం. 1906లో అఖిల భారత ముస్లింలీగ్‌ స్థాపన దాని ఫలితమే. వీటన్నిటి ప్రభావంతోనే లాలా లజపతిరాయ్‌ కొత్త బాటను ఎంచుకున్నారు.

లజపతిరాయ్‌ మొదట ఆర్య సమాజ్‌ సభ్యుడు. పంజాబ్‌కు చెందినవారు. లజపతిరాయ్‌, లాల్‌చంద్‌, షాదీలాల్‌ అనే ముగ్గురు కలసి 1909లో పంజాబ్‌ హిందూ సభను స్థాపించారు. ఆ సంవత్సరం అక్టోబర్‌లో ఈ సంస్థ తన తొలి సమావేశాలను లాహోర్‌లో నిర్వహించింది. దీనికి మదన్‌మోహన్‌ మాలవీయ అధ్యక్షులు. ఈ సంస్థ హిందువులందరిదీ అని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సంస్థ హిందువుల హక్కుల గురించి పంజాబ్‌ పరిధిలో ప్రాంతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. ఈ గోష్టిలోనే సభ్యులు విస్పష్టంగా ఒక విషయం ప్రకటించారు. అది – హిందువుల హక్కులను కాపాడడంలో జాతీయ కాంగ్రెస్‌ విఫలమైంది. భారత రాజకీయాలకు, స్వరాజ్య ఉద్యమానికి హిందూ చింతనే పునాదిగా ఉండాలని కూడా ఈ గోష్టి కోరింది. పంజాబ్‌ పరిధిలోనే ఇలాంటి మరో ఐదు గోష్టులను కూడా పంజాబ్‌ హిందూ సభ నిర్వహించింది. తరువాత యునైటెడ్‌ ప్రావిన్సెస్‌, బిహార్‌, బెంగాల్‌, సెంట్రల్‌ ప్రావిన్సెస్‌, బీరార్‌, బొంబాయి ప్రెసిడెన్సీలలో కూడా ఇలాంటి సంఘాలు ఆవిర్భవించాయి. ఇంత కృషి జరిగిన మీదట మొత్తం దేశంలోని హిందువులను ఏకం చేయాలన్న యోచన వచ్చింది. ఇందుకు తొలి అడుగు 1910 నాటి అలహాబాద్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలోనే పడడం విశేషం. లాలా బైజ్‌నాథ్‌ నాయకత్వంలో ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడానికి ఒక బృందం ఏర్పాటయింది. కానీ ఇది అనుకున్నంత వేగంగా సాగలేదు. 1910లో మళ్లీ అలహాబాద్‌ వేదికగా హిందూ నాయకులు సమావేశం జరిపారు. ఇందులో విభేదాలు తలెత్తాయి. చివరికి డిసెంబర్‌ 8, 1913లో పంజాబ్‌ హిందూ సభ చేసిన తీర్మానం పెద్ద కదలికనే తెచ్చింది. త్వరలో అంబాలాలో జరిగే పంజాబ్‌ హిందూ సభ సమావేశాలలో అఖిల బారత హిందూ సభ ఏర్పాటు జరిగిపోవాలని ఇది తీర్మానించింది. అంబాలలో సమావేశం జరిగింది కానీ, అఖిల భారత సంస్థ ఏర్పాటును వాయిదా వేశారు. 1915లో కుంభమేళా జరుగుతున్నది కాబట్టి, ఆ సందర్బంగా అఖిల బారత వేదికను ఆరంభించాలని అంబాలా సమావేశాలు నిర్ణయించాయి. ఇది మాత్రం కార్యరూపం దాల్చింది. యుద్ధ ప్రాతిపదికను ఏర్పాట్లకు ఉపక్రమించారు. 1915 ఫిబ్రవరిలోనే హరిద్వార్‌, లక్నో, ఢిల్లీలలో ఏర్పాట్ల గురించి సమావేశాలు జరిగాయి. మొత్తానికి ఆ సంవత్సరం ఏప్రిల్‌లో హరిద్వార్‌లో సర్వదేశ హిందూ మహాసభ ఆవిర్భవించింది. ఈ కార్యక్ర మానికి గాంధీజీ, స్వామీ శ్రద్ధానంద కూడా హాజరయ్యారు. 1920 నాటికి ఈ సంస్థ వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌, బాలకృష్ణ మూంజే వంటివారి ప్రభావంలోకి వచ్చింది.1921 ఏప్రిల్‌లో జరిగిన సమావేశాలలో అఖిల భారత హిందూ మహాసభగా పేరు మార్చారు. అప్పటికి గాంధీజీ స్వరాజ్య ఉద్యమంలో కీలకంగా మారారు. ఆ సమయానికి హిందూ గళం వినిపించడానికి కొంత బలం కలిగింది. కానీ అప్పటికి ముస్లింల వేర్పాటువాద ధోరణి కూడా బలం పుంజుకోవడం మొదలయింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావం

నిజానికి హిందువులను సామాజికంగా ఏకం చేయడానికి స్పష్టమైన సిద్ధాంతంతో ఆవిర్భవించిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌. 1925లో డాక్టర్‌ కేశవరావ్‌ బలీరామ్‌ హెడ్గేవార్‌ ఆ పని చేయగలిగారు. ఇది హిందూ మహాసభను మించి హిందువుల ఐక్యత కోసం పనిచేసింది. హిందువులు అంటే విస్తృతార్థంలో భారతీయులే. భారతదేశంలో పుట్టినవారంతా భారతీయులు. భారతదేశానికి మరొక పేరు హిందుస్తాన్‌. భౌగోళికంగా వచ్చిన పేరు. ఐక్యత హిందువుల చరిత్రలో పెద్ద లోపమన్న విషయాన్ని గ్రహించడం డాక్టర్జీ గొప్పదనం. భారతదేశంలో ఈ సంస్థ ఆవిర్భవించడం ద్వారా ఒక గొప్ప చారిత్రక కర్తవ్యం నెరవేరింది. అయితే ఇది సేవ ద్వారానే ప్రజలకు చేరువ అయింది. జాతీయత, భారతీయ విలువలు దీనికి ప్రాతిపదిక. (15,7776 సాంఘిక సంక్షేమ పథకాలను ఈ సంస్థ ఇప్పుడు దేశ ప్రజలకోసం నిర్వహిస్తున్నది.)

నిజానికి జిన్నా ఎత్తుగడలను అర్థం చేసుకున్న సంస్థ హిందూ మహాసభ. వాటిని నిరోధించడానికి గళం ఎత్తిన సంస్థ కూడా అదే. జిన్నా, ఆయన వ్యూహాల పట్ల దొంగ నిద్ర నటించిన సంస్థ జాతీయ కాంగ్రెస్‌. 1940లో లాహోర్‌ లీగ్‌ సమావేశాలలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని జిన్నా కోరారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ముస్లిం లీగ్‌ సహా చాలా సంస్థలు బహిష్కరించాయి. అందులో హిందూ మహాసభ కూడా ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్‌ మీద నిషేధం ఉంది. నాయకులు జైళ్లలో ఉన్నారు. ఈ అవకాశాన్ని జిన్నా ఉపయోగించుకున్నారు. దేశ విభజనకు అవసరమైన అభిప్రాయాన్ని బాగా నాటారు. దీనికి కొంతయినా అడ్డుకట్ట వేసిన సంస్థ హిందూ మహాసభ. జిన్నా విధానాలను బాహాటంగా విమర్శించడంలో కాంగ్రెస్‌ కంటే, పటేల్‌, రాజాజీ కంటే బాలకృష్ణ మూంజే ముందుండేవారు. ఈ హిందూ మహాసభకు చెందినవారే డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ. ఆయన కొన్ని విషయాలలో హిందూ మహాసభతో విభేదించి భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. ఈ సంస్థ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ రెండో సర్‌సంఘచాలక్‌ గురూజీ కొందరు కార్యకర్తలను పంపించారు. వారే దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌ కృష్ణ అడ్వాణీ, నానాజీ దేశ్‌ముఖ్‌ తదితరులు. స్వతంత్ర భారత నిర్మాణంలో వీరి కృషి ఎంత నిర్మాణాత్మకమైనదో చరిత్ర రుజువు చేసింది.

స్వేచ్ఛ, సమత్వం, సామ్యవాదం వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలు భారతీయు లకు ఒకరకమైన స్పృహను కలిగించాయి. నిజమే. కానీ భారతీయులలో రావలసిన రాజకీయ ఏకత్వానికి భారతీయ మూలాలు కలిగిన సాంస్కృతిక దృష్టి అవసరమని చెప్పిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. 1915లో ఏర్పాటైన హిందూ మహాసభకు 1925 నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త రూపం కాదు. ఈ సంస్థ ఏర్పడడం కొందరు హిందూ మహాసభ నాయకులకు రుచించ లేదు కూడా. కానీ ఒకటి వాస్తవం. హిందూ మహాసభ తెచ్చిన చైతన్యం పదేళ్ల తరువాత ఆవిర్భవించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా నిర్మాణాత్మక మైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ తొలి సర్‌సంఘచాలక్‌ డాక్టర్జీ, వారి వారసులు గురూజీ ప్రవచించిన ఐక్యతా సూత్రం తొలినాటి హిందూ సంస్థల ఆశయాలను మించి సమకాలీన సమాజం మీద ప్రభావం చూపించాయి.

హిందూ మహాసభతో డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ విభేదించి 1951లో భారతీయ జనసంఘ్‌ను ఏర్పాటు చేయడం భారత రాజకీయాలలో, మరీ ముఖ్యంగా హిందూ ఐక్యతా కృషికి రాజకీయ కోణాన్ని అద్దడంలో కీలకాంశం. పైగా ఈ సంస్థకు లభించిన ఆదరణ ఇతర హిందూ సామాజిక, రాజకీయ సంస్థలకు లభించలేదనే చెప్పాలి. ఉదాహరణకి 1948లో స్వామి కర్పత్రి రామరాజ్య పరిషద్‌ అనే రాజకీయ పక్షాన్ని నెలకొల్పారు. ఇది రాజస్తాన్‌లో ఎక్కువగా విస్తరించింది. అలాగే 1952 తొలి లోక్‌సభ ఎన్నికలలో మూడు స్థానాలు గెలిచింది. పండిట్‌ నెహ్రూకు పోటీగా ఈ ఒక్క పార్టీ అభ్యర్థి మాత్రమే బరిలో దిగారు. తరువాత జరిగిన ఎన్నికలలో కూడా ఈ పార్టీ కొంత ప్రభావం చూపింది. అగ్నివీర్‌, ఆర్షవిద్యా సమాజం, అంతర్రాష్ట్రీయ హిందూ పరిషద్‌, హిందూ సేన, హిందూ సేవా పరిషద్‌, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక, ఆల్‌ వరల్డ్‌ రుద్రా ఫౌండేషన్‌ రుద్ర దళ్‌, హిందూ రైట్స్‌ యాక్షన్‌ ఫోర్స్‌ వంటి ఎన్నో సంస్థలు -స్వాతంత్య్ర సమరానికి ముందునాటివి, స్వరాజ్యం వచ్చిన తరువాత ఏర్పడినవి- కూడా ఉన్నాయి. అయితే వాటి ప్రభావం పరిమితం. హిందువుల ఐక్యత, ఆ ఐక్యతను రాజకీయ శక్తిగా మలచడంలో జనసంఘ్‌ చేసిన కృషి విశిష్టమైనది.

భారతీయ జనతా పార్టీ, కొత్తశకం

1977లో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత నాలుగు పార్టీలు విలీనమై జనతా పార్టీ ఆవిర్భవించింది. భారతీయ లోక్‌దళ్‌, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్‌ పార్టీ, భారతీయ జనసంఘ్‌ కలసి జనతా పార్టీగా ఆవిర్భవించాయి. కానీ జనతా పార్టీలోని సోషలిస్టులు జనసంఘ్‌కు వెన్నుపోటు పొడిచారు. ద్వంద్వ సభ్యత్వం పేరుతో జనసంఘ్‌ సభ్యులను బయటకు నెట్టారు. దాని ఫలితమే భారతీయ జనతా పార్టీ. 1980లో మాజీ జనసంఘ్‌ సభ్యులంతా ఈ పార్టీ పేరుతో ఐక్యమయ్యారు. ఇది భారతదేశ చరిత్రను మార్చింది. ఇప్పుడు దాదాపు 19 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది. లేదా అధికారంలో భాగస్వామిగా ఉంది. కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారం నిర్వహి స్తున్నది. అయినా హిందువుల మీద నిందలు తప్పడం లేదు. ఈ దేశంలోని చాలామంది మేధావులు చెప్పినట్టు హిందువులు మతోన్మాదులే అయితే ఇంత ఆధిపత్యం ఉన్నందుకు ఎంతకైనా తెగించేవారు. కానీ అలా జరగలేదు. అయినా నీచమైన నిందలు ఎదుర్కొనక తప్పడం లేదు. హిందూ ఫాసిజం, హిందూ ఉగ్రవాదం, మెజారిటీ మతోన్మాదం వంటి పేర్లతో పరోక్షంగా హిందూ సమాజాన్ని దూషిస్తూనే ఉన్నారు. ఈ ధోరణి మారాలి. లేదా మనమే మార్చాలి.

హిందువుల రాజకీయ ఐక్యత అనివార్యం కాదా!

నిజానికి ఈ ప్రశ్నను స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తరువాత కాదు, ఇంకా ముందే వేసుకుని ఉండవలసింది. ముస్లింల పాలనలో, తరువాత బ్రిటిష్‌ పరిపాలనలో పూర్తిగా నష్టపోయినవారు హిందువులే. ఆఖరికి దేశ విభజనలో దారుణంగా నష్టపోయినవారు సైతం హిందువులే. లియాఖత్‌ అలీ, నెహ్రూ ఒప్పందం ఈ విషయం వెల్లడిస్తుంది. ఆ ఒప్పందం ప్రకారం ఇక్కడి ముస్లింలు పాకిస్తాన్‌ వెళ్లాలి. అక్కడి హిందువులు ఇక్కడికి రావాలి. పాకిస్తాన్‌లో ఉన్న హిందువులను కట్టుబట్టలతో తరిమేశారు. కానీ ఇక్కడ ముస్లింలు క్షేమంగా ఉన్నారు. ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే వారి మేధాశక్తిని శంకించవలసిందే. కశ్మీర్‌ సమస్య దేశ విభజన ఫలితం కాదా? ఇటు బంగ్లాదేశ్‌తో సమస్యలు కూడా అందులో నుంచి వచ్చినవి కావా! విదేశీ పాలన మూలంగా ఎక్కువ సాంస్కృతిక విధ్వంసాన్ని చవి చూసినది హిందూ జీవనమే. వారి కళా సంపదే. కశ్మీరీ పండిట్లను స్వస్థలం నుంచి తరిమేస్తే దాని గురించి అడిగిన వారు లేరు. అభివృద్ధి జరగాలి. కానీ ఇందుకు ఒక వర్గం ప్రార్థనా స్థలాలనే కూలుస్తున్నారు. ముస్లింలకు పర్సనల్‌ లా బోర్డు ఉండాలి. కానీ హిందువుల ఆచార వ్యవహారాలలో కోర్టులు యథేచ్ఛగా కలగచేసు కోవచ్చునట. రామజన్మ భూమి వివాదం ఏడు దశాబ్దాల నాటిది. కానీ ఆ అంశాన్ని విచారించడానికి తొందరేమిటి అంటుంది కోర్టు. కానీ అసలు హిందుత్వంతో ఎలాంటి సంబంధం లేనివారు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ పిటిషన్‌ వేస్తే ఆగమేఘాల మీద తీర్పు వస్తుంది. టీవీ చర్చలలో, సినిమాలలో హిందూ దేవుళ్లను, దేవతలను అవహేళన చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ. ఎంఎఫ్‌ హుసేన్‌ కారు మీద నగ్నస్త్రీ బొమ్మ గీస్తే అది కళ. కళాదృష్టి. హిందూ ఆలయాల మీద బొమ్మలు బూతు. ఆయన మహా కళాకారుడు కాబట్టి సరస్వతి దేవిని నగ్నంగా చిత్రించినా నోరెత్తకూడదు. రంజాన్‌, దసరా నిమజ్జనం ఒకేరోజు వస్తే హిందువులు నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని, తరువాత ఎప్పుడో ఆ నిమజ్జనం చేయాలి. మన దేశం సెక్యులరిస్టు దేశమే అయితే ఇలా ఎందుకు ఉంది? దీనిని ప్రశ్నించడానికి రాజకీయ శక్తి కావలసిందే. అలాంటి పాత్రను ప్రస్తుత పరిస్థితులలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ నిర్వహించాలని కోరు కుందాం. దీనర్థం మిగిలిన వర్గాలను, మతాలను ద్వేషించడం కానేకాదు. అదే భారతీయ హిందూ సమాజం కోరుకుంటే వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎన్ని మసీదులు కూలాయి? ఎన్ని చర్చ్‌లు దగ్ధమయ్యాయి? కొన్ని విమర్శలు ఉండవచ్చు. ఇతర పార్టీలు ఎన్ని విమర్శలయినా గుప్పించవచ్చు. కానీ ఒకటి వాస్తవం. భారతీయ జనతా పార్టీ చైతన్యవంతమవుతున్న భారతీయతకు గళం. దాదాపు నూట ఐదేళ్లుగా సాగుతున్న భారతీయ ఐక్యతా కృషి ఫలితం..

Source: Jagriti Weekly