Home Telugu Articles మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్న స్థలంలో ‘హఠాత్తుగా ప్రత్యక్షమైన’ 200 ఏళ్లనాటి మసీదు!

మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్న స్థలంలో ‘హఠాత్తుగా ప్రత్యక్షమైన’ 200 ఏళ్లనాటి మసీదు!

0
SHARE

సెక్యులర్ భారతదేశంలో మైనారిటీ ముస్లిం వర్గం సంపాదించుకున్న మూకబలం, ప్రాబల్యం మరోసారి హైదారాబాద్ ఘటనతో బయటపడింది. `అన్యాయంగా’ తమ మసీదును కూల్చేశారని, తమను `వేధింపులకు’ గురిచేస్తున్నారంటూ ముస్లిం సమూహాలు కల్లోలం రేపడానికి ప్రయత్నించారు. `మైనారిటీల’ పార్టీగా పేరుపడిన ఎంఐఎం, అధికార టీఆరెస్ పార్టీ అండదండలతో నగరాన్ని గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అసలు ఏం జరిగింది?

నగరంలో రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ అంబర్ పేట్ లోని ఒక స్థలాన్ని మక్బూల్ అనే వ్యక్తికి రూ. 6కోట్లు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంది. చట్టబద్దంగా ఆ స్థలం కార్పొరేషన్ కు చెందుతుంది. కానీ కొందరు ఆ స్థలంలో మసీదు ఉండేదంటూ ప్రచారం ప్రారంభించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లారు. దానితో చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్న స్థలంలో `200 ఏళ్ల నాటి మసీదు’ `పుట్టుకువచ్చింది’. ఇంకా కొందరి లెక్కల ప్రకారం అక్కడ ఉన్న మసీదు `400 ఏళ్ల’ నాటిది! అంత `పురాతనమైన’ మసీదును కూల్చేయడం అన్యాయమంటూ ఎంఐఎం నాయకులు ఆ స్థలంలోనే ప్రార్ధనలు చేయడానికి ప్రయత్నించారు. అంతేకాదు అది వక్ఫ్ బోర్డ్ స్థలమని ప్రకటించి, అందులో మసీదు కట్టడానికి సన్నాహాలు కూడా ప్రారంభించారు. వారు చేసిన `శాంతియుతమైన’ ఆందోళనల్లో 4 పోలీసులతో పాటు 8మంది గాయపడ్డారు. ఈ ఉద్రిక్తతలకు కారణమైన ఎంఐఎం నాయకులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్ళిన బిజీపీ ఎమ్మెల్యేను మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు.

టౌన్ ప్లానింగ్ అధికారి చెప్పినదేమిటి?
స్వాధీనం చేసుకున్న స్థలం పట్టా భూమి అని, దాని యజమాని 1955 నుంచి ఆస్తి పన్ను కడుతున్నారని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కె. శ్రీనివాస రావు స్పష్టం చేశారు. స్థలాన్ని తగిన పరిహారం చెల్లించి చట్టబద్ధంగానే స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు

ఏ అధికారంతో ఎంఐఎం ఆ స్థలంపై హక్కు కోరుకుంటోంది?

ఒకవేళ ఆ స్థలం 1955 నుంచి ఆస్థి పన్ను కడుతున్న మక్బూల్ అనే వ్యక్తిది కాదని, మసీదుకు చెందినదేనని అనుకున్నా, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అందులో రాత్రికిరాత్రి మసీదు కట్టడానికి ఎంఐఎంకు హక్కు ఎవరిచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. “ఎంఐఎంకు గాని, మైనారిటీ వర్గానికి గాని చట్టపరమైన ప్రక్రియలను గౌరవించి, అనుసరించాల్సిన బాధ్యత, అవసరం ఉండవా? వారు ఈ చట్టలకు అతీతులా?” అని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

ఇంత గొడవ ఎందుకు జరిగింది?

కార్పొరేషన్ చట్టబద్ధంగా పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకున్నా స్థలాన్ని గురించి ఇంత వివాదం ఎందుకు రేగింది? ప్రభుత్వానికి చెందిన భూమిని ఒక మతవర్గానికి చెందినవారు ఆక్రమిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్లు?

దీనికి సమాధానం గతంలో జరిగిన మరొక సంఘటనలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తే తెలిసిపోతుంది. నిబంధనలకు వ్యతిరేకంగా కట్టిన మసీదుల గురించి పోలీస్ కమిషనర్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక పత్రికా ప్రకటన చేశారు. దీనిపై ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మైనారిటీ వర్గం వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటు కమిషనర్ ను ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వం ఏం సందేశం పంపింది? మసీదులు చట్టవిరుద్ధంగా కట్టినప్పటికీ వాటి గురించి కమిషనర్ మాట్లాడటం తప్పు అనేకదా?