Home News అంతర్వేది కేసు సీబీఐకి అప్పగింత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అంతర్వేది కేసు సీబీఐకి అప్పగింత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

0
SHARE

ఆంధ్రప్రదేశ్: తీవ్ర వివాదాస్పదమవుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం ఘటనపై పోలీసులు దాఖలు చేసిన కేసును సీబీఐకి బదలాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్వేది ఘటన తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు రోజుల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. తేనెతుట్టెను తీసే సమయంలో మంటలు పెట్టడంతో అది కాలిపోయిందని ఓ వాదన ఉంది. ఈ ఘటనలో వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అగ్నికుల క్షత్రియుడు, ఆలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ నిర్మించిన రథం కాలి బూడిదైంది. ఉత్సవ రథం కాలి బూడిదైన ఘటన పట్ల రాష్ట్రవ్యాప్తంగా హిందూ కార్యకర్తలు అంతర్వేదిలో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఛలో అంతర్వేది పిలుపుతో సాగిన ఈ కార్యక్రమంలో హిందూ కార్యకర్తలు వేలాదిగా పాల్గొని,  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని ఘెరావ్ చేశారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని, మరో కొత్త రథం నిర్మాణం చేస్తామని, ఈ ఘటనపై ఇప్పటికే కొందరు అధికారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.  
ఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా పరిగణించారు. ఈ కేసులో రాజకీయ కుట్ర ఉండొచ్చని మంత్రి వెలంపల్లి కూడా అనుమానం వ్యక్తం చేశారు.  మంత్రి ఇచ్చిన హామీల పట్ల సంతృప్తి చెందని హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన విరమించేది లేదని తెలపడంతో అనేకమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో   బీజేపీ, జనసేనతో పాటు పలు హిందూ సంఘాలు పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కలెక్టర్లకు, మండల కేంద్రాల్లో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపాయి. 

ఈ క్రమంలో ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ‘చలో అంతర్వేది’ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా తమ కార్యకర్తలకు పిలుపునివ్వడంతో వాతావరణం వేడెక్కింది.

దీంతో అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం ఎలా అగ్నికి ఆహుతైందన్న అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు.  దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.

ఇదిలా ఉండగా.. కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యమిస్తున్న హిందువుల దృష్టిని సమస్య నుండి మళ్లించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే తప్ప దీని వల్ల ఒరిగిందేమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా గతంలో అనేక కేసులలో సీబీఐ దర్యాప్తు అనేక ఏళ్లుగా సాగిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
.
Source: News18Telugu