
ఆంధ్రప్రదేశ్: తీవ్ర వివాదాస్పదమవుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం ఘటనపై పోలీసులు దాఖలు చేసిన కేసును సీబీఐకి బదలాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్వేది ఘటన తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా పరిగణించారు. ఈ కేసులో రాజకీయ కుట్ర ఉండొచ్చని మంత్రి వెలంపల్లి కూడా అనుమానం వ్యక్తం చేశారు. మంత్రి ఇచ్చిన హామీల పట్ల సంతృప్తి చెందని హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన విరమించేది లేదని తెలపడంతో అనేకమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేనతో పాటు పలు హిందూ సంఘాలు పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కలెక్టర్లకు, మండల కేంద్రాల్లో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపాయి.
ఈ క్రమంలో ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ‘చలో అంతర్వేది’ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా తమ కార్యకర్తలకు పిలుపునివ్వడంతో వాతావరణం వేడెక్కింది.
దీంతో అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం ఎలా అగ్నికి ఆహుతైందన్న అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.