Home News వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వ‌ర్యంలో అక్టోబ‌ర్ 30న సామూహిక వివాహాలు

వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వ‌ర్యంలో అక్టోబ‌ర్ 30న సామూహిక వివాహాలు

0
SHARE

దేశవ్యాప్తంగా గిరిజనులలో చైతన్యం తెస్తూ సమ సమాజంలో మేము కూడా భాగమే అనే ఒక్క నానుడిని వినిపిస్తూ దేశ ఆర్థికరంగంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ అనాదిగా వస్తున్న వాళ్ళ సంప్రదాయాలను వనవాసీ కళ్యాణ పరిషత్ సంస్థ ప్రోత్సహిస్తున్నది. ఈ మేర‌కు కష్టాల్లో ఉన్న చెంచులకు అక్టోబ‌ర్ 30న “సామూహిక వివాహాలు” నిర్వహించాలని నిర్ణయించిన‌ట్టు వ‌న‌వాసి క‌ల్యాణ ప‌రిష‌త్ ఒక ప్ర‌క‌ట‌లో పేర్కొంది.

“గిరిజనులకు వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలు ఉన్నాయి. గిరిజన సమాజంలో వివాహం అత్యంత ముఖ్యమైన పవిత్ర బంధం. పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇద్దరితో కుటుంబ నిర్మాణం. కుటుంబాల సమూహం, సంఘం. మూడడుగులు, ఏడడుగులతో మొదలైన దాంపత్యం జీవితాంతం సాగుతుంది. ఈ హిందూ వివాహ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ఈ సంప్రదాయాన్ని పాశ్చాత్యులు కూడా పాటిస్తున్నారు. అయితే, అద్భుతమైన వివాహ వేడుకలు ఖర్చుతో కూడుకున్నవి.” ఈ నేప‌థ్యంలో ఇటువంటి సామూహిక వివాహాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. “

“పురాతన తెగ చెంచులు నల్లమల అడవులలో నివసిస్తున్నారు. శ్రీశ్రీశ్రీ అహోబిల చెంచు లక్ష్మీ నరసింహస్వామి, శ్రీశ్రీశ్రీ శ్రీశైల మల్లికార్జునస్వామిని చెంచుల అల్లుళ్ళుగా పిలుస్తారు. చెంచులలో చాలామంది సంపదలో పేదవారు. పేదరికం కారణంగా వారికి పెళ్లిళ్లులేక పిల్లలు పుట్టడం చాలా కష్టం. జరిగే వివాహాలు కూడా కుల పెద్దల ఆశీస్సులకే పరిమితమవుతున్నాయి. ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది చెంచులు పెళ్లి వేడుక జరుపుకోలేక పోతున్నారు.”

వనవాసి కళ్యాణ పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా కష్టాల్లో ఉన్న చెంచులకు “సామూహిక వివాహాలు” నిర్వహించాలని నిర్ణయించారు. రెండు జిల్లాల్లోని ఆరు మండలాల్లోని 31 చెంచుగూడెంలలో సుమారు 140 జంటలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం 30 అక్టోబర్, 2021 శనివారం నాడు  శ్రీశైలం దారిలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త  గరికపాటి నరసింహారావుగారి ఆశీః ప్రసంగం మరియు ఇతర పెద్దలు కన్యాదాతలుగా, అతిథులుగా పాల్గొంటారని రాష్ట్ర ప్రచార ప్రముఖ్, ఎస్. చలపతి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.