Home News కుల విద్వేషాల నుండి సమరసత పైపు ప్రయాణించి ఘనంగా శివరాత్రి జరుపుకున్న అందె గ్రామస్తులు

కుల విద్వేషాల నుండి సమరసత పైపు ప్రయాణించి ఘనంగా శివరాత్రి జరుపుకున్న అందె గ్రామస్తులు

0
SHARE

సిద్దిపేట జిల్లా  మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో గత నాలుగు సంవత్సరాలు గా శివరాత్రి పండుగను సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటారు. ఎస్ సి వర్గానికి చెందిన కుటుంబాలు ఒక పెద్ద పండుగగా ఇళ్లకు సున్నం వేసికొని, దేవుని కి పెద్ద ప్రమిదలో దీపం వెలిగించి పిల్లా పాప ఉపవాసం వుండి, రాత్రంతా జాగారం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

ఈ సారి కూడా అందెలో ఫిబ్రవరి 13 న రాత్రి అన్ని వర్గాల ప్రజలు సుమారుగా 500 మంది గాంధీ విగ్రహం వద్ద కూడగా , తడ్కపల్లి ఆవాస విద్యార్థులచే పురాణ నాటికలు, కోలాటం, చిరుతల భజన, గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల చే నృత్య ప్రదర్శనలతో శివరాత్రి రంగ రంగ వైభవంగా జరిగాయి. అన్ని కులవృత్తుల వారికి సన్మానం, పాఠశాల ప్రతిజ్ఞ అయిన ‘భారత దేశం నా మాతృభూమి . భారతీయులందరూ నా సహోదరులు’ అను అంశం పై వ్యాస రచన,ఉపన్యాస, పాటల పోటీలు నిర్వహించారు. 10 వ తరగతిలో 80 శాతానికి పైగా మార్కులు పొందిన విద్యార్థులకు పారితోషికం అందించారు.

ఒకప్పుడు ఈ గ్రామం కులాల మధ్య ద్వేషం తో అట్టుడికిపోయింది. పచ్చగా బతుకుతున్న ప్రజలు విడపోయి పరస్పర అనుమానాలతో జీవనాన్ని గడిపారు. అన్యోన్యంగా వుంటున్న వారు రెండు సంవత్సరాల పాటు సామాజికంగా ఒకరినొకరు దూరమై ఎవరో పెట్టిన చిచ్చు కు బలయ్యారు. కాని పొరపాటు గ్రహించిన గ్రామ యువకులు, ప్రజలు రంగంలోకి దిగి , మళ్ళీ సామరస్య మార్గం లో కార్యక్రమాలు రూపొందించారు.

కులాలెన్నున్నా మన ఆచార సంప్రదాయాలు ఒకటేనని, మనలోని రక్తం మన సంస్కృతి ఒకటేనని చాటిచెపుతుందని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రకటించారు.

జిల్లా అధ్యక్షులు ఉప్పరి రత్నం, ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఆవాస ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ నివాస్ , ఉపాధ్యాయులు క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు మాట్ల సుమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో మహేష్, కర్ణాకర్,సంతోష్,కుమార్,శ్రీకాంత్ తదితరులు పనిచేయగా నరేష్, యాదగిరి తదితరులు సహకరించారు.