Home News ఆంధ్రప్ర‌దేశ్‌లో మ‌రో రెండు చోట్ల విగ్ర‌హాల ధ్వంసం

ఆంధ్రప్ర‌దేశ్‌లో మ‌రో రెండు చోట్ల విగ్ర‌హాల ధ్వంసం

0
SHARE

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోధి కొండ పై ఉన్న శ్రీరాముని దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో అలాంటి సంఘటనలు మరో రెండు చోటుచేసుకున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ నగర్ విగ్నేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో స్వామి వారి విగ్రహం రెండు చేతులను దుండ‌గులు న‌రికి వేశారు.

అలాగే విశాఖ ఏజెన్సీలోని ఘాట్ మార్గంలో వంట్ల మామిడి సమీపాన ఉన్న కోమాలమ్మ పాదాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు మోదకొండమ్మ పాదాలు, తర్వాత కోమాలమ్మ పాదాలను దర్శించుకుంటారు. మోదకొండమ్మకు కోమాలమ్మ చెల్లెలు కావడంతో ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంత భక్తులు సైతం దర్శనానికి వస్తుంటారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన కోమాలమ్మ పాదాలు ధ్వంసమవటంతో భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

మొత్తం మీద రాష్ట్రంలో పలు దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు సైతం తీవ్ర నిరసన గళం వినిపిస్తున్నాయి. జరుగుతున్న వరుస ఘటనలపై ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ పెద్దల నోటి దురుసు వ్యాఖ్యలపై కూడా హిందూ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ విషయాలపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధ పడుతున్నాయి.

Source : VSK ANDRA