Home News అంధ విద్యార్థులలోని ప్రతిభను ప్రోత్సహిస్తున్న దేవనార్ పాఠశాల  – ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్...

అంధ విద్యార్థులలోని ప్రతిభను ప్రోత్సహిస్తున్న దేవనార్ పాఠశాల  – ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ జి

0
SHARE

“శరీరంలో ముఖ్యభాగమైన కళ్ళు లేని చిన్నారుల్లో గొప్ప ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న మీరు ధన్యులు” అంటూ సికింద్రాబాదులోని ‘దేవనర్ అంధ విద్యార్థుల పాఠశాల’ ఉపాధ్యాయులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలే శ్యాంకుమార్ గారు ప్రశంసించారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేవనర్ అంధ విద్యార్థుల పాఠశాల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలే శ్యాంకుమార్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన శ్యామ్ జి.. డా. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత ఘట్టాలను పాఠశాల విద్యార్థులకు తెలుపుతూ, ఆయన రాష్ట్రపతిగా వున్నప్పుడు మద్రాసు పర్యటనలో ఉండగా రోడ్డుపై వెళ్తున్న తన కాన్వాయిని ఆపి ఎప్పుడో బాల్యంలో తనకు విద్య నేర్పిన గురువుకు పాదాభివందనం చేసిన విషయాన్నీ గుర్తుచేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలని, అదేవిధంగా ప్రాధమికంగా విద్య నేర్పిన గురువులను గౌరవించాలని హితవు పలికారు. విద్యార్థులు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ, వారి వారి జీవితాలలో గొప్పవారుగా తయారు కావాలని,  అదే దారిలో తల్లి భారతిని ఎవరు మరువరాదని, గురువుల ద్వారా తాము నేర్చిన విద్యలు పదిమందికి పంచి దేశానికి ఉపయోగపడాలి అని విద్యార్థులను కోరారు.
స్వామి వివేకానంద జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్మని, ఆయన మంచి జీవితం గడపడానికి అవకాశం వున్నప్పటికీ తన దేశప్రజల కోసమే అహర్నిశలు ఆయన తపన చెందారని, చివరికి తాను చేసిన తపస్సు కూడా భారతమాత ఔన్నత్యం కోసమేనని తెలుపుతూ, అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందడుగు వేయాలి అని తెలియచేశారు.
సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయమని, అలాంటిది అంధులకు సేవ చేయడం ఇంకా ఎంతో ఉన్నతమైన విషయంగా పేర్కొంటూ.. సామాన్యులు చేయలేని కార్యాన్ని పద్మశ్రీ డాక్టర్ రాజీవ్ గారు చేసి చూపడం ఎంతో అభినందనీయమని తెలియజేస్తూ, వారితో వారి శ్రీమతి గారిని అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాలు, డాక్టర్ రాజీవ్ దంపతులు మరింత కృషి చేసి విద్యార్థులు మరింత వృద్ధిలోకి వచ్చి దేశానికి సేవలు చేసే విధంగా తీర్చిదిద్దాలని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా దేవనార్ స్కూలు యాజమాన్యం తమ వార్షిక రిపోర్ట్ తెలియచేస్తూ.. తమ  విద్యార్థులు అంధుల క్రికెట్ పోటీలలో పాల్గొనడం, సైన్స్ టాలెంట్ లో ముందుండటం, కంప్యూటర్ విజ్ఞానంలో చక్కటి ప్రతిభ చూపడంతో పాటు ఇతర అన్నింటిలోనూ పురస్కారాలు అందుకున్న విషయాలను తెలియజేశారు. అంతేకాకుండా నేడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కీలకంగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయ పరిజ్ఞానంలో కూడా తమ విద్యార్థులు పురస్కారాలు అందుకున్న విషయం తమకు ఎంతో గర్వ కారణం అని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రంగంలో విద్యార్థుల ప్రతిభకు దోహదపడిన కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాని ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం అభినందించింది.
ఈ సందర్బంగా విద్యార్థులు ఫ్లూటు వాద్యం, పాటలు, నృత్యం మొదలగు సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొనడం ఆహుతులు అందరిని ఎంతో అలరించింది. కార్యక్రమంలో వివిధ రకాల పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు శ్రీ శ్యాంకుమార్ గారు బహుమతులు అందజేశారు. శరీరంలోని అన్ని భాగాలు చక్కగా ఉన్న వారు కూడా ఇంత చక్కటి ప్రతిభ కనపరచలేరని, అంత చక్కటి విన్యాసాలు చేశారని శ్రీ శ్యామ్ కుమార్ ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత వ్యవస్ధ ప్రముఖ్ శ్రీ సూర్యప్రకాష్ గారు, విశిష్ట అతిధిగా పాల్గొన్నారు, విశ్వహిందూ పరిషద్ నుండి శ్రీ మురళీధర్ రావు, ప్రాంత సంపర్క్ ప్రముఖ్ శ్రీ సత్యరామమూర్తి, విభాగ సహ కార్యవాహ శ్రీ భర్తేపూడి శ్రీనివాస్, సికింద్రాబాద్ జిల్లా వ్యవస్థా ప్రముఖ్ శ్రీ మోహన్ దాస్, మరియు ఇతర సంఘ పెద్దలు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు పురస్కారాలు అందిస్తూ శ్రీ వివేకానందుని జీవిత చరిత్ర బ్రెయిలి లిపిలో పుస్తకాకాన్ని ఆవిష్కరించారు.