Home News ఆర్థిక సంస్కరణలతో భారత్ ప్రపంచ ఆర్ధికశక్తిగా 2030 నాటికి ఎదగడం సుసాధ్యమే – డా. సుబ్రహ్మణ్య...

ఆర్థిక సంస్కరణలతో భారత్ ప్రపంచ ఆర్ధికశక్తిగా 2030 నాటికి ఎదగడం సుసాధ్యమే – డా. సుబ్రహ్మణ్య స్వామి

0
SHARE

జాతీయవాద సంస్థ ప్రజ్ఞాభారతి నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన `భారత్ –ఆర్థిక శక్తిగా ఎదుగుదల’ సదస్సులో బిజెపి ఎంపి, ఆర్ధిక శాస్తవేత్త డా. సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ వచ్చే దశాబ్దoలో భారత్ ప్రపంచ ఆర్ధికశక్తిగా ఎదగడం సుసాధ్యమే అని అంటూ అయితే దానికి పెద్ద ఎత్తున సంస్కరణలు అవసరం అని చెప్పారు.

వేలాది సంవత్సరాలు భారత్ అభివృద్ధి చెందిన దేశమేనని, 12వ శతాబ్దoలో మహమ్మద్ ఘోరి భారత్ ఆక్రమణతో ఆరంభమైన ఆర్థిక పతనం 17వ శతాబ్ది నాటికి, మందకొడిగా ఉన్నా అప్పటికీ 25% ప్రపంచ వాణిజ్యం భారత్ చేతిలో ఉండేదని, అయితే తరువాత బ్రిటిష్ కాలంలో, ముఖ్యంగా 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత, బ్రిటిషు రాజ్యం భారత్ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, జమీందారీ చట్టంతో వ్యవసాయాన్ని కుప్పకూల్చి, భారత్ ను పేదరికంలోకి నెట్టేసిందని, అయితే భారత ప్రజలకు మళ్ళి పూర్వ వైభవం పొందడం సాధ్యమే అని చెప్పారు. ఇటివలి పరిశోధన ప్రకారం బ్రిటిష్ కాలంలో మొత్తం 71 ట్రిలియన్ డాలర్లు మనదేశం నుంచి దోచుకున్నారని చెప్పారు. అయితే 990లలో ప్రధాని పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణల అమలు కారణంగా 8% అభివృద్ధి సాధ్యం అయిందని చెప్తూ, తరువాత 2దశాబ్దాలలో చెప్పుకోదగ్గ సంస్కరణలు జరగలేదు, కాని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే ఐదు సంవత్సరాలలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, వారు అమలు చేస్తున్న సంస్కరణలతో ఇది సాధ్యమే అని చెప్పారు. నెహ్రూ కాలం నుంచీ అమలు చేసిన `సోవియట్ మోడల్’ ఆర్థిక విధానాల మూలంగా ప్రగతి జరగలేదని, దానివల్ల దేశం పూర్తిగా నష్టపోయిందని చెప్పారు. అయితే ఇప్పుడు స్పష్టమైన లక్ష్యాలు, ప్రాధాన్యతలు, వ్యూహాలు ఏర్పరుచుకుని, ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు విపరీతంగా పెంచి, సంస్కరణలతో 10% అభివృద్ధి రేటు సాధించడం వల్ల 2030లోపు  చైనాను అధిగమించి భారత్ ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకత మన సామర్థ్యం కన్నా చాలా తక్కువగా ఉన్నాయని అంటూ, వ్యవసాయంలో, పాల ఉత్పత్తిలో మార్పులు చేసి, ఇస్రాయెల్ దేశం లాగా సముద్ర జలాలనుఉంచి ఉప్పును తీసే `డీసలైనేషన్ ప్లాంట్లు’ స్థాపించి సముద్రపు నీటిని వ్యవసాయ వినియోగంలోకి తేవాలని అన్నారు. అలాగే కొత్త ఆవిష్కరణలు, వినూత్న ఉత్పత్తులు, కంప్యూటర్ `ఆర్టిఫిషియల్ ఇంటేల్లిజెన్స్’ రంగంలో శాస్త్రభాష అయిన సంస్కృతం ఉపయోగించడం లాంటి మార్పులు మన విద్యా ఆర్ధిక రంగాలలో రావాలని అన్నారు. ఒకప్పుడు 46నాగరికతలు ఉన్న ప్రపంచంలో అన్నీ కూలిపోయి కేవలం భారత్ మాత్రమే నిలదోక్కుకుందని, మరిన్ని మార్పులతో భారత్ ప్రపంచ ఆర్ధికశక్తిగా ఎదగడం సుసాధ్యమే అని చెప్పారు.

ప్రజ్ఞాభారతి అధ్యక్షులు శ్రీ హనుమాన్ చౌదరి గారు మాట్లాడుతూ, ఆర్ధిక వ్యవస్థను సుస్థిరం చేసి, అత్యున్నత ప్రగతి వైపు నడిపించడానికి కావలసిన వ్యూహాలు రచించడంలో డా. సుబ్రహ్మణ్య స్వామిని మించిన ఆర్ధికవేత్త లేరని చెప్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పరిచిన లక్ష్యాన్ని దేశం సాధించాలని అన్నారు. విపరీతమైన జనాభా పెరుగుదల కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 2కోట్లమంది కొత్తగా ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్నారని, ప్రభుత్వం నైపుణ్యశిక్షణ పెంచినా, కోట్లమందికి వేతనం కల్పించడం సాధ్యం కాదు, యువత కూడా స్వయం ఉపాధి, నైపుణ్యాలు పెంచుకోవాలని, పెట్టుబడులు గణనీయంగా పెరగాలని సూచించారు.

ఎం.ఎల్.సి  శ్రీ రామచంద్ర రావు మాట్లాడుతూ అత్యంత వేగంగా ఏమాత్రం అవినీతి లేకుండా మోదీ ప్రభుత్వం పనిచేస్తూ, 19రాష్ట్రాల్లో 24గంటలు కరెంటు ఇవ్వగలిగే స్థాయిలో ఉందని, ఒకనాడు ఆహారం కూడా దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉన్న దేశం ఈరోజు ఇతర పేద దేశాలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వగలిగే స్థాయికి చేరామని, వచ్చే దశాబ్దకాలంలో ప్రపంచoలోని అగ్ర దేశాల్లో ముందంజలో ఉంటామని అన్నారు. సదస్సులో ముఖ్య అతిధి  నవాబ్ నసీర్ అలీఖాన్ ప్రపంచoలో ఎన్నో దేశాలతో పోలిస్తే మనదేశం అసలైన సుస్థిర ఆర్ధిక ప్రగతి సాధిస్తోందని చెప్పారు. విజయవంతంగా జరిగిన ఈ సదస్సుకు భారీ సంఖ్యలో ప్రజలు, విద్యావేత్తలు, ప్రముఖులు హాజరయారు.