Home News చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు- NCERT కీలక సిఫార్సులు

చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు- NCERT కీలక సిఫార్సులు

0
SHARE

పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (NCERT) కమిటీ ముఖ్యమైన సిఫార్సులు చేసింది. పాఠశాల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీంతో పాటు తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సూచించింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ.. ఈ చరిత్రలోని పాఠ్యాంశాల్లో పలు మార్పులను ప్రతిపాదించింది.

కమిటీ ఛైర్మన్ సీఐ ఐజాక్ మాట్లాడుతూ “ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలో ఉన్న చరిత్ర ‘ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు’గా ఉంది. అయితే, మన చరిత్రను నాలుగు భాగాలుగా విభజించాలని ప్యానెల్‌ కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేసింది. క్లాసిక్‌ పీరియడ్‌ (సంప్రదాయ చరిత్ర), మధ్య యుగం చరిత్ర, బ్రిటిష్‌ కాలం, ఆధునిక భారతదేశ చరిత్ర.. ఇలా నాలుగు భాగాలుగా వర్గీకరించి చరిత్రను బోధించాలి. క్లాసిక్‌ పీరియడ్‌లో ని పాఠ్యాంశాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, పురాణాలను చేర్చాలి. రాముడంటే ఎవరు? ఆయన ఉద్దేశాలు ఏమి? అనేది విద్యార్థులు తెలుసుకోవాలి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల గురించి విద్యార్థులు కొంతవరకైనా తెలుసుకోగలగాలి” అని తెలిపారు.

గత సంవత్సరం ఏర్పాటైన ఏడుగురు సభ్యుల కమిటీ, కొత్త NCERT సాంఘిక శాస్త్రాల పాఠ్యపుస్తకాల అభివృద్ధికి కావాల్సిన కీలకమైన ఆదేశాల‌ను సిఫార్సులు చేసింది.

7-12 తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రిని ఖరారు చేయడానికి జూలైలో నోటిఫై చేయబడిన 19మంది సభ్యుల నేషనల్ సిలబస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (NSTC) కమిటీ సిఫార్సును ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవచ్చు. NSTC ఇటీవలే సామాజిక శాస్త్రం కోసం ఒక కరిక్యులర్ ఏరియా గ్రూప్ (CAG)ని ఏర్పాటు చేసింది. ఈ సబ్జెక్ట్ కోసం సిలబస్, టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్‌ని అభివృద్ధి చేసింది.

“7 – 12వ తరగతి విద్యార్థులకు రామాయణం, మహాభారతాలు బోధించడం అవ‌స‌ర‌మ‌ని, పాఠ‌శాల ద‌శ‌లోనే విద్యార్థులు తమ దేశం కోసం వారి ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని, గర్వాన్ని పెంపొందించుకుంటారు. వారిలో దేశభక్తి కొరవడినందున ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు దేశం విడిచి ఇతర దేశాలలో పౌరసత్వం పొందుతున్నారు. అందువల్ల, వారు తమ మూలాలను అర్థం చేసుకోవడం, దేశం, సంస్కృతి పట్ల ప్రేమను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం కొన్ని విద్యా బోర్డులు విద్యార్థులకు రామాయణాన్ని బోధిస్తున్నప్పటికీ, వారు దానిని పురాణంగా బోధిస్తున్నారు. పురాణం అంటే ఏమిటి? విద్యార్థులకు ఈ ఇతిహాసాలను బోధించకపోతే విద్యావ్యవస్థ ప్రయోజనం లేదు, అది దేశ సేవ కాదు” అని కమిటీ ఛైర్మన్ సీఐ ఐజాక్ అన్నారు.

చరిత్ర పుస్తకాల్లో భారతీయ రాజుల పాలన మొదలైన విషయాలకు మరింత ఎక్కువగా స్థానం కల్పించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి పాఠాలను చేర్చాలని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తరగతి గదుల గోడలపై రాజ్యాంగ పీఠికను రాయాలని ప్రతిపాదించింది. పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరు బదులు ‘భారత్’ అని ఉపయోగించాలని ఇటీవల ఈ కమిటీ సిఫార్సులు చేసింది.

తరగతి గదుల గోడలపై రాజ్యాంగ ప్రవేశికను వ్రాయమని సిఫారసు చేయడం వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ, ఇస్సాక్, “మా ప్రవేశిక గొప్పది. ఇది ప్రజాస్వామ్యం, లౌకికవాదంతో సహా సామాజిక విలువలకు ప్రాముఖ్యతనిస్తుంది. అందువల్ల, తరగతి గదుల గోడలపై వ్రాయమని మేము సిఫార్సు చేసాము, తద్వారా ప్రతి ఒక్కరూ దాని నుండి అర్థం చేసుకోవచ్చు. నేర్చుకోవచ్చని ఆయ‌న తెలిపారు.

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా NCERT పాఠశాల పాఠ్యాంశాలను సవరిస్తోంది. రాబోయే విద్యాసంవ‌త్స‌రం నాటికి కొత్త NCERT పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది.