Home News రాణి పద్మిని కోరుకున్నది బలవన్మరణం కాదు, అమరత్వం

రాణి పద్మిని కోరుకున్నది బలవన్మరణం కాదు, అమరత్వం

0
SHARE
  • దేవదత్ పట్నాయక్ కు సంఘమిత్ర పురోహిత్ సమాధానం

దేవదత్ పట్నాయక్ జీ మీరు రాసిన పుస్తకాలు నేను చదవలేదు. కాబట్టి వాటిని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయను. ఇటీవల చిత్తోడ్ గఢ్ కు చెందిన రాణి పద్మిని గురించి మీ ట్వీట్ లను చూసిన తరువాత ఈ సమాధానం రాయాలనిపించింది.

అవమానం కంటే అగ్ని ప్రవేశమే మంచిదని భావించిన రాణి పద్మినికి మేవార్ ప్రజలలో ఉన్న గౌరవం, మన్నన మీకు ఏమాత్రం నచ్చలేదు. 700 సంవత్సరాలనాటి `తిరోగమన’, `పురుషాధిక్య’ సమాజంలో ఒక రాణి తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో గొప్ప `త్యాగం’గా ఇప్పటికీ ప్రజలు గుర్తించడం మీ `స్వేచ్ఛాయుత’, `పురోగమన’ ధోరణికి ఏ మాత్రం నచ్చుబాటు కాదు. అయితే ఈ `మూఢనమ్మకాలు’, `దురాచారాల’ వెనుక తత్వాన్ని కాస్త వివరించాలనుకుంటున్నాను.

మేవార్ రాజైన మహారావల్ రతన్ సింగ్ భార్య రాణి పద్మిని. అల్లావుద్దీన్ ఖిల్జీ వారు నివసించే చిత్తోడ్ గఢ్ దుర్గాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కధనాల ప్రకారం రాణి పద్మినిని సొంతం చేసుకునేందుకే ఖిల్జీ వారి కోటపై దాడి చేశాడు. అయితే ఈ కధనాలే అసలు గందరగోళానికి కారణం. ఖిల్జీ కోరికను తీర్చి, `సుఖంగా జీవించకుండా’ రాణి పద్మిని తనతోపాటు అంతమంది ప్రాణాలను ఎందుకు పణంగాపెట్టిందనే మీ ప్రశ్న కూడా ఆ గందరగోళం నుండి వచ్చినదే.

కానీ అసలు విషయం ఏమిటంటే, మధ్యయుగపు యుద్దాలు కేవలం అందమైన రాణుల కోసం మాత్రమే జరిగినవి కావని మీరు తెలుసుకోవాలి.

చిత్తోడ్ గఢ్ కేవలం ఒక కోట కాదు. 700 ఎకరాలలో విస్తరించిన ఒక భవ్యమైన నగరం. దానిని 180 మీటర్ల ఎత్తున కొండ పై నిర్మించారు. ఏ మధ్యయుగపు కోటతో పోల్చినా అది చాలా అద్భుతమైనది, ప్రత్యేకమైనది. 7వ శతాబ్దం నుండి కొనసాగుతున్న హిందూ సామ్రాజ్యానికి అది కేంద్రం. ఎంతటి సుదీర్ఘమైన ముట్టడినైనా తట్టుకోగలదు ఆ కోట. లోపల ఉన్న చెరువులు, బావులు 50 వేల సైన్యానికి ఒక సంవత్సరం పాటు దాహార్తి తీర్చగలవు. రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతం, నీటికొరతతో చూస్తే ఈ కోట ఎంత విలువైనదో, ప్రత్యేకమైనదో అర్ధమవుతుంది. అందుకనే ఆ కోట ఒక సామ్రాజ్యానికి కేంద్రమయ్యింది. అది ఎవరి చేతిలో ఉంటే ఆ మొత్తం ప్రాంతం వారిదవుతుంది. ఇప్పుడు మీకు అర్ధమయ్యేఉంటుంది ఖిల్జీ ఆ కోటను ఆక్రమించేందుకు ఎందుకంత ప్రయత్నించాడో.

ఖిల్జీ ముతక శృంగారాన్ని చిత్రీకరించడానికి పాపం బన్సాలి చాలా తాపత్రయపడ్డాడు కానీ ఖిల్జీ నిజమైన చరిత్ర మరోలా ఉంది. అతను పరమ కర్కోటకుడు, దుర్మార్గుడు. పసిపిల్లలను వారి తల్లుల ముందే నిర్దాక్షిణ్యంగా హతమార్చి రాక్షసానందం పొందినవాడు. 20వేల మంది హిందువుల పుర్రెలతో ఎముకల గోపురాలను కట్టి గర్వించినవాడు. ఇక `శృంగార జీవితానికి’ వస్తే ఖిల్జీ స్వలింగ సంపర్కం, పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. నిజంగా రాణి పద్మినే కావాల్సివస్తే ఆమెను ఎత్తుకుపోవడానికి, మాయంచేయడానికి అంతటి శక్తివంతమైన సుల్తాన్ ప్రయత్నించడా? ఇంతకుముందే చెప్పినట్లు మధ్యయుగపు యుద్దాలు ఎంతో క్లిష్టంగా,  నేటి మతిలేని బాలీవుడ్ కధలకంటే భిన్నంగా ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి.

మహారావల్ రతన్ సింగ్, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య యుద్దం 8 నెలలు సాగింది. సుదీర్ఘకాలంపాటు చిత్తోడ్ గఢ్ ముట్టడిలో ఉంది. చివరికి జరిగిన ప్రత్యక్ష యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ రతన్ సింగ్, ఆయన ముఖ్య అనుచరులు వీర మరణం చెందారు.

అలా రాజు యుద్ధభూమిలో చనిపోతే ఏం జరుగుతుంది? ఒక సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేయాలని దాడి చేసిన దురాక్రమణ దారుడు ఆ రాజ్యపు పాలకుడిని చంపేసి ఊరుకుంటాడా? యుద్దభూమిలో విజయం కంటే ప్రత్యర్ధిపై మానసికమైన విజయం సాధించడానికే దురాక్రమణదారుడు ప్రయత్నిస్తాడు. ఆధునిక కాలంలో కూడా దేశాలు ఇదే సూత్రాన్ని పాటిస్తుంటాయి. ప్రత్యర్థిని భయబ్రాంతులలో ముంచేందుకు, లొంగిపోయేట్లు చేసేందుకు వారి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. అందుకనే పాలకుల కుటుంబాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తుంటారు.

రతన్ సింగ్ చనిపోయిన తరువాత ఖిల్జీ ఏం చేయాలని, చేసిఉంటాడని మీరు అనుకుంటున్నారు? కోటనైతే జయించాడు. కానీ దోపిడీకి, దుర్మార్గాలకి అలవాటుపడిన తన సైనికుల ఆకలి తీరడం ఎలా? కోటను దోచుకోమని, కనిపించిన మహిళపై అత్యాచారానికి పాల్పడమని అనుమతి ఇచ్చివుంటాడు. ఎందుకంటే మధ్యయుగపు దురాక్రమణదారులు అనుసరించిన యుద్ధ నీతి అదేమరి. ఆ సేనలు శవాలపైన కూడా అత్యాచారాలకు పాల్పడెవన్నది చరిత్ర చెపుతున్న సాక్ష్యం.

అలాంటి పరిస్థితిలో దురాక్రమణ సేనల రాక్షస కృత్యాలను ఎవరు ఆపగలరు? మేవార్ ప్రజలను మరింత అవమానపరచడానికి, భయానికి గురిచేయడానికి ఖిల్జీ రాణీవాసపు స్త్రీలు, పిల్లలను బందీలను చేయమని ఆజ్ఞాపించి ఉంటాడు. బందీలను భయంకరంగా, దారుణంగా చిత్రహింసలకు గురిచేయమని ఆదేశించి ఉంటాడు.

రాణి పద్మిని సామాన్య స్త్రీ కాదు. ఆమె శౌర్యవంతుల వంశానికి చెందినది. అంతేకానీ బుద్ధిలేని బాలీవుడ్ కధల్లో లాగా ఆమె ఏమి తెలియని అమాయకురాలు, సౌందర్య భావన తప్ప మరొకటి లేని ఆటబొమ్మ కాదు. రాజు మరణం తరువాత కోటలో ఉన్న తనతో పాటు వందలాదిమంది స్త్రీల పరిస్తితి ఏమిటో, తాము ఎలాంటి అవమానాలు ఎదుర్కోవలసి వస్తుందో ఆమెకి బాగా తెలుసు. మొదట సుల్తాన్, అతని ప్రధాన సేనానులు, ఆ తరువాత ఆఖరి సైనికుడి వరకు అందరి చేతిలో ఘోరమైన అత్యాచారాలు, అవమానాలు తప్పవని తెలుసు. రాణీవాసపు స్త్రీలనందరిని చుట్టుముట్టి, అందరినీ వివస్త్రలను చేసి బహిరంగంగా ఊరేగిస్తారు. తల్లుల ముందరే పసిపిల్లలను కత్తికి ఎర వేస్తారు. మగవారందరిని, ముసలివాళ్లతో సహా చంపేస్తారు. ఇక ఆ రాజ్యంలో ఒక్క మగాడు కూడా ప్రాణాలతో లేడని, లేదా ప్రాణాలతో ఉన్నా తనపై తిరుగుబాటు చేసే స్థితిలో లేడని సుల్తాను నిర్ధారించుకునేవరకు ఈ మారణకాండ సాగుతుంది. ఘోరమైన అత్యాచారాలు, అవమానాల తరువాత కూడా బతికున్న స్త్రీలను బందీలుగా పట్టుకుపోతారు. సెక్స్ బానిసలుగా అమ్మివేస్తారు. సుదీర్ఘమైన యుద్దంలో రాజును, కుటుంబసభ్యులను కోల్పోయిన మేవార్ ప్రజలకు తమ రాణి, ఇతర స్త్రీలపై ప్రతిరోజూ జరిగే అత్యాచారాలు ఎంత సహించలేనివి అవుతాయో ఒక్కసారి ఊహించండి.

రాణి పద్మినికి ఇదంతా తెలుసు. శత్రువులకు చిక్కితే తమకు అపారమైన హింస, అవమానాలు, వ్యాధులు తప్ప మరొకటి లేవని ఆమెకి తెలుసు. తమ రాజ్యాంపై దండెత్తిన ఆటవిక మూకలు తమ కామవాంఛను తీర్చుకునేందుకు ఆఖరుకు శవాలను కూడా వదిలిపెట్టవని ఆమెకు తెలుసు. మేవార్ ప్రజలు తన ఛిద్రమైన కళేబరాన్ని చూసి తట్టుకోలేరని ఆమెకు తెలుసు. అందుకే రాజపుత్ర ప్రతీకార జ్వాలను ప్రజ్వలింపచేయాలని, ప్రజల్లో ధైర్యాన్ని నింపాలని అనుకుంది. అందుకు ఒక నిర్ణయం తీసుకుంది.

అవును, అప్పటివరకూ తనను దేవతలా పూజించిన, ఆరాధించిన ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకుంది. తన వీరుడైన భర్తను, పరాక్రమవంతులైన సేనానులను చంపేసిన దుర్మార్గులకు అంతఃపురంలో బూడిద కుప్ప తప్ప మరేమీ దక్కకూడదని ఆ నిర్ణయం తీసుకుంది. తాను ఎలాంటి అత్యాచారం, అవమానానికి గురికాకూడదని ఆ నిర్ణయం తీసుకుంది. తన ప్రజలు అధైర్యపడకూడని అనుకుంది. తన జీవితం మేవార్ కోసమేనని, ఏదో ఒకనాడు మేవార్ ప్రజలు తమ రాణీ కోసం ప్రతీకారం తీర్చుకుంటారని, సామ్రాజ్యాన్ని తిరిగి సాధిస్తారని ఆమెకి తెలుసు.

ఆమె అనుకున్నది అక్షరాల నిజమైంది. ఖిల్జీ ఆక్రమణతో చిత్తోడ్ గఢ్ పౌరుషం, పరాక్రమాలు అడుగంటిపోలేదు. రాణి పద్మిని జ్వలింపచేసిన స్వాభిమాన జ్వాల వ్యర్ధం కాలేదు. పదేళ్ళ లోపునే రాజపుత్ర శిసోడియాలు కోటను మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత చిత్తోడ్ గడ్డ రాణా సంగ్రామ్ సింగ్, రాణా ఉదయ్ సింగ్, రాణా కుంభ వంటి ఎంతోమంది హిందూ వీరులు, పరిపాలకులకు జన్మనిచ్చింది. వారంతా చిత్తోడ్ కీర్తిని దశదిశలా వ్యాపింపచేశారు.

అలా రాణి పద్మిని ఎంచుకున్నది చావును కాదు , అమరత్వాన్ని అని ఇప్పటికైనా తెలిసిందా దేవదత్ పట్నాయక్ జీ

RightLog.in    సౌజన్యంతో