Home News కశ్మీర్‌కు రికార్డు స్థాయిలో పర్యాటకులు

కశ్మీర్‌కు రికార్డు స్థాయిలో పర్యాటకులు

0
SHARE
  • మార్చిలో 1.8 లక్షల మంది పర్యాటకులు
  • దశాబ్ద కాలంలో అత్యధిక సంఖ్యగా నమోదు

దశాబ్ద కాలంలో తొలిసారి అన్నట్టుగా ఈ సంవత్సరం మార్చి మాసంలో 1 లక్ష ఎనభై వేల మంది పర్యాటకులు కశ్మీర‌ును సందర్శించారని కశ్మీర్ పర్యాటక విభాగ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున కశ్మీర్‌కు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెప్పారు.

“ఈ సంఖ్య (మార్చిలో 1.8 లక్షల మంది పర్యాటకుల సందర్శన) రికార్డు సృష్టించింది. మా అంచనా ప్రకారం పర్యాటకుల సంఖ్య మరింత పెరగవచ్చు. ఈ ఘనత సంబంధిత శాఖల సమష్టి కృషికి దక్కుతుంది” అని కశ్మీర్ పర్యాటక శాఖ డైరెక్టర్ జి.ఎన్. ఐటూ తెలిపారు.

అంతకుమునపు, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఏడు సంవత్సరాల రికార్డును అధిగమిస్తున్నట్టుగా ఒక్క ఫిబ్రవరి మాసంలోనే 1లక్ష 42వేల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారు.

సరికొత్త పర్యాటక ఆకర్షణలు, ప్రోత్సాహక ప్రయత్నాలు

అధికార వర్గాల ప్రకారం, పర్యాటకుల సంఖ్య పెరగడానికి ఊతమిచ్చే ప్రధానమైన అంశాల్లో ఒకటిగా అమర్‌నాథ్ యాత్రను పేర్కొనవచ్చు. కోవిడ్ మహమ్మారి కారణంగా గడచిన రెండు సంవత్సరాలుగా అమర్‌నాథ్ యాత్రను సంబంధిత అధికారులు రద్దు చేశారు. ఈ ఏడాది తిరిగి ప్రారంభించారు. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర 43 రోజుల పాటు కొనసాగుతుంది. రెండు సంవత్సరాల వ్యవధి తర్వాత ప్రారంభం కానున్న యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది కనుక తగు రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

అలాగే శ్రీనగర్‌లోని జబర్వన్ పార్కులో పర్యాటకులు, స్థానికుల కోసం తొలిసారి అన్నట్టుగా హాట్-ఎయిర్ బెలూన్ రైడ్‌ను పర్యాటక శాఖ ప్రారంభించింది. కశ్మీర్ అంతటా కీలకమైన పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల కోసం పారా గ్లయిడింగ్ లాంటి వాటిని ప్రారంభించే ప్రణాళికలో ఉన్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో అన్ని హోటళ్ళు, హౌస్ బోట్లు వచ్చే రెండు మాసాలకు బుక్ అయిపోయాయని, కశ్మీర్ పర్యాటక రంగానికి ఇదొక శుభ సూచకమని
వారు చెప్పారు.

తెరుచుకున్న తులిప్ గార్డెన్

శ్రీనగర్‌లోని జబర్వన్ పర్వత పాదాల చెంత ఉన్న ఆసియా ఖండంలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్‌‌ సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. 10 లక్షలకు పైగా తులిప్‌లతో కూడిన తులిప్ గార్డెన్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నదని వారు చెప్పారు.