Home News సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

0
SHARE

సామాజిక సమరసత వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో వీర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాల, తండాల ప్రజలచే జగదాంబ దేవాలయం (స్థూపం దగ్గర) రంగంపేట గ్రామంలో సంత్ సేవాలాల్ జ‌యంతి వేడుక‌ల‌ను అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. సంత్ సేవలాల్ శోభా యాత్ర గ్రామ వీధుల గుండా గిరిజన ప్రజల సంసృతి సంప్రదాయాలు, నృత్యాలతో శోబాయమానంగా జరిగింది. జగన్మాత ఆలయంలో గిరిజన పూజారులచే అత్యంత భక్తి శ్రద్ధలతో విశిష్టంగా నిర్వహించే భోగ్ భండార్ నిర్వహించారు.

కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత క‌న్వీన‌ర్‌ శ్రీ‌ అప్పాల ప్రసాద్ గారు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మహ్మద్ ఘోరీ మన దేశం పై దాడి చేసి, మన తల్లుల, చెల్లెల చెరపట్టి, దేవాలయాలు ధ్వంసం చేసినప్పుడు, గోవులను వధించి, బలవంతంగా మతమార్పిడి జరుపుతున్నప్పుడు, ఘోరీ ని ఎదిరించి17 సార్లు ఓడించినసాహస వీరుడు పృథ్వీరాజ్ చౌహన్ వంశానికి చెందిన వారు బంజారాలు ( లంబాడి ) అని అన్నారు. మొఘలుల రాక్షసత్వానికి బలైన కొందరైతే, మరికొందరు చెట్టు గుట్టల్లో చెల్లా చెదురై, తమ సంస్కృతి ని కాపాడుకున్న వారు బంజారాలు అని పేర్కొన్నారు. బంజారా వంశంలో మళ్ళీ ధైర్యం, సాహసం కలిగించి, ఆధ్యాత్మిక కిరణాలు ప్రసరింప చేయడానికి జన్మించిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని అన్నారు. 1739లో రాయలు ఏలిన రాయల సీమలో గుత్తి లో అవతరించిన వర ప్రసాదం సేవాలాల్ అని కొనియాడారు. సప్త మాతృకలైన తుల్జా భవాని, మంత్రాల భవాని, సీతలా భవాని, హింగలా మాత, కంకాళి భవాని దోలాంగల్ భవాని, దండి భవాని, మేరా మా ఆశీస్సులతో దివ్య తేజమై వెలిగిన శక్తి పుంజం సంత్ సేవాలాల్ అని తెలిపారు. ఏక్ జాత్, ఏక్ వాత్, ఏక్ సాత్ అనే ఆలోచన తో ప్రజలను కలిపిన సంఘటనా శీలి సేవాలాల్ అని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని, పూర్వీజులు అందించిన విలువలు, సంప్రదాయం మరిచిపోవద్దని చాటిన మహాత్ముడు సేవాలాల్ అని తెలిపారు. తండ్రి రామావత్ భీమ్ నాయక్, తల్లి ధర్మణి యాదిలకు జన్మించి, ఆది పరాశక్తి అంశగా జాతి జనులను జాగృతం చేయవచ్చిన కారణ జన్ముడని కొనియాడారు. 12 ఏళ్ల వయస్సు లో భృగరాజు గురువు సమక్షంలో దీక్ష పొంది, చాంద్రాయణ గుట్ట వద్ద నున్న కాలోకుండ సరస్సు లో స్నానం ఆచరించి, చెన్న కేశవ స్వామి దర్శనం చేసుకుని, పార్వతి దేవీ సమక్షంలో ధ్యాన నిమగ్నుడయ్యాడ‌ని తెలిపారు. జంతుబలులను నిరసించి, అమ్మవారికి పొంగలిని నైవేద్యం పెట్టి, భక్తి సాగరంలో మునిగాడ‌ని తెలిపారు.

తినడానికి తిండి లేకున్నా ధర్మాన్ని వదలక, సబ్లీ పూజ, హోలీ సంప్రదాయ పండుగలతో ప్రజల్లో ధార్మిక భావన పెంచిన గొప్ప వాడ‌ని తెలిపారు. రాయచూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నప్పుడు,నిజాం నవాబు ఆహారం లో విషం పెట్టి, సేవాలాల్ చంపాలని ప్రయత్నం చేస్తే, తన మహిమ తో విషాన్ని పోగొట్టి, అమృత ఆహారంగా మార్చి, నిజాం నుండి గోవులను రక్షించిన మహిమాన్వితుడ‌న్నారు. తిరుపతిలో హతీరామ్ బాబా భక్తిని కొనియాడి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని,భక్తి మార్గం లో నడవాలని ప్రజలకు బోధించాడ‌ని తెలిపారు. ఆధ్యాత్మిక చైతన్యం, విద్య ను ఆర్జించి, నాగరికత తో జీవించటం, ఇతర మతాల్లోకి చేరకుండా, తన ధర్మాన్ని కాపాడుకోవటం అనే సూత్రాలతో ఉద్యమించిన సంత్ సేవాలాల్ మహారాష్ట్ర లో సమాధి పొంది, సేవా నిరతి ని, ఆధ్యాత్మిక చింతనను, భగవత్ తత్వాన్ని పంచిన సంత్ సేవాలాల్ అందరికి మార్గదర్శకుడ‌ని ప్ర‌సాద్ జీ అన్నారు.