Home News సంస్కర్త, ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే

సంస్కర్త, ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే

0
SHARE

-ఆకారపు కేశవరాజు

సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా

సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి… అందరూ సమానంగా బ్రతకాలి… అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత గొప్పది.

1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్ గావ్ లో సావిత్రిబాయి జన్మించింది. 1847 నాటికి భర్తతో కలిసి బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల నడపటం కొందరికి నచ్చలేదు. దీంతో సావిత్రీ బాయిపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచేదారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు.
బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి.

ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే, కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

1852లోనే మహిళాసేవ మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు, బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు. 1874లో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు. ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు.1873లోనే సత్యశోధక్ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రీబాయి ప్రపంచచరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ జీవితంలో కలిని నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు.
అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.

1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం, మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది.

సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచియిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో ప్వాన్కాశీ సుభోధ్ రత్నాకర్ 11 పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.