Home News కాలం అనంతమైనది, దైవ స్వరూపం

కాలం అనంతమైనది, దైవ స్వరూపం

0
SHARE

కాలం దైవ స్వరూపం,  కాలం అనంతమైనది,  ఈ సృష్టి అన్వేషణకు మూలం కాల గణన  మనదేశంలో కాల గణన ఎంతో శాస్త్రీయమైనది. మన దేశంలో కాలగణన ఖగోళంలోని గ్రహగమనం ఆధారంగా లెక్కిస్తారు. మన కాలగణనలో మన్వంతరము, యుగాలు,  సంవత్సరాలు, మాసాలు, పక్షము, రోజులు ఉంటాయి. అందులో  14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ  మన్వంతరాల  క్రమంలో ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన  వైవస్వత  మన్వంతరం ఇప్పుడు నడుస్తున్నది. ఒక మన్వంతరము అంటే 71 మహా యుగాలు, ఒక మహాయుగం అంటే నాలుగు యుగాల మొత్తం. నాలుగు యుగాలు 1] కృతయుగము 2]త్రేతాయుగము 3] ద్వాపరయుగము 4] కలియుగం. ఒక యుగంలో నాలుగు పాదాలు ఉంటాయి. మనము ఇప్పుడు వైవస్వత మన్వంతరం లోని  కలియుగంలో మొదటి పాదంలో  ఉన్నాం. ఇప్పుడు నడుస్తున్న కలియుగం ఎప్పుడు ప్రారంభమైనది? దానిని చెప్పటానికి ప్రమాణం ఏమిటి ?  కలిశకం గ్రహ గమనాల ఆధారంగా చెప్పారు. కలియుగం ప్రారంభం రోజు ఆకాశంలో ఏడు గ్రహాలు మేష రాశిలో ఉన్నాయి.  ఆ ఏడుగ్రహాలలో 1.శని 2.గురువు 3. కుజుడు 4. సూర్యుడు 5. శుక్రుడు 6.బుధుడు 7. చంద్రుడు.  ఇప్పుడు ప్రపంచం అనుసరిస్తున్న కాల మానం ప్రకారం క్రీస్తు కు పూర్వం 3102 సంవత్సరం,  ఫిబ్రవరి 20వ తేదీ,  అర్ధరాత్రి 2 గంటల 27 నిమిషాల 30 సెకన్లకు ప్రారంభమైంది. అంటే 3102+2024=5126 సంవత్సరం. అంటే కలియుగం ప్రారంభమై ఇప్పుడు 5125 సంవత్సరం నడుస్తున్నది. ఆ సమయంలో ఈ భూమి మీద మూడు సంఘటనలు జరిగాయి 1)ద్వాపర యుగఅంతం జరిగింది. 2)భగవాన్ శ్రీకృష్ణుడు అవతారం పరిసమాప్తమైనది 3) భగవాన్ శ్రీకృష్ణుడు పట్టణమైన ద్వారకాపట్టణం సముద్రంలో కలిసిపోయింది. ఈ విషయాలన్నీ మనకు మహాభారతంలో కనబడుతుంది. మనకాలగణనలో   సంవత్సరాల ఆవర్తం ఉన్నది. ఒక ఆవర్తము అంటే 60సంవత్సరాలు. ఆ 60సంవత్సరాల ఆవర్తంలో 36వ సంవత్సరమైనా శుభకృతనామ సంవత్సరం పూర్తయి 37వ సంవత్సరమైన శోభ‌కృతు సంవత్సరంలో ఈ ఉగాదితో ప్రవేశిస్తున్నాము.

 దేశ చరిత్ర లోని కొన్ని తిరుగులేని విజయాలే శకాలు 

దేశ చరిత్రలోని కొన్ని తిరుగులేని విజయాలను మనవాళ్ళు శకాలుగా వర్ణించారు. అవి చాల ఉన్నాయి. అందులో ప్రసిద్ధమైనవి 1. యుధిష్ఠిర శకము 2. విక్రమార్క శకము 3. శాలివాహన శకము. ద్వాపర యుగ అంతంలో యుధిష్ఠిర శకము ప్రారంభమైతే కలియుగంలో విక్రమార్క శకము, శాలివాహన శకములు గుర్తించారు. భారతదేశానికి ఉత్తర భాగంలో విశేషంగా  విక్రమార్క శకం ప్రాచుర్యంలో ఉంటే దక్షిణా పథంలో శాలివాహన శకము విశేషంగా ఉన్నది. ఈ దేశ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనలో ధర్మ నిష్ఠ, పౌరుష ప‌రాక్రమాలు, పెంపొందించుకోవడం ప్రధాన లక్ష్యంగా అవి మనకు కనబడతాయి. ఆ శకాల గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

యుధిష్ఠిర శకం

ద్వాపర యుగం అంతం లోజరిగిన  కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ధర్మరాజు సమ్రాట్ గ పట్టాభిషేకం జరిగిన రోజు నుండి ప్రారంభమైంది. అది కలియుగానికి పూర్వం 37 సంవత్సరంలో అంటే ఇప్పటికి (5125+37=5162) సంవత్సరాలు పూర్తి అయి  5162వ సంవత్సరంలో ఈ ఉగాది తో  ప్రవేశిస్తున్నది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు 36 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. యుధిష్టర శకం మనకిచ్చే సందేశం ఏమిటి? ఎప్పుడైనా అంతిమ విజయం ధర్మానిదే.  మహాభారత సంగ్రామం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటం, అది  ధర్మం జయించిన వేళ.

విక్రమార్క శకం

విక్రమార్క శకం కలియుగంలో 3044 సంవత్సరంలో ప్రారంభమైంది, అంటే 2081 సంవత్సరాలు పూర్తియై 2082 లో ప్రవేశిస్తున్నది దానిని బట్టి క్రీస్తుకు పూర్వం 58లోవిక్రమార్క శకం ప్రారంభమైంది. క్రీస్తు లెక్క ప్రకారం 2024+58=2082 లో ప్రవేశిస్తున్నది.  2080 సంవత్సరాల పూర్వం ఉన్న విక్రమార్కుని కాలం లో భారతదేశం మీద శకులు దండయాత్రలు జరుగుతుండేవి. చిన్న వయసులోనే విక్రమార్కుడు ఆ  దాడులను తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభం చేశాడు. ఐదు సంవత్సరాల వయసులో విక్రమార్కుడు అరణ్యంలోకి వెళ్లి 12 సంవత్సరాల పాటు సుదీర్ఘ సాధన చేసే అద్భుత శక్తులు సంపాదించాడు. అతను మాళవ ప్రాంతంలోని ఉజ్జయని  ని రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు. ఉజ్జయిని  మహాకాలుని దేవాలయం  ఉన్నది. అది జ్యోతిర్లింగాలలో ఒకటి. విక్రమాదిత్యుడు శకులు, హుణులను జయించటానికి   భయంకరమైన యుద్ధాలు చేశాడు. శకుల బాధ  మనకే కాదు ఇప్పటి అరేబియా  బాబిలోనియా, పర్షియా,  దేశాలకు కూడా ఉండేది. ఆ దేశాల రాజుల పిలుపు పై  విక్రమార్కుడు అక్కడికి కూడా వెళ్లి అక్కడి నుండి శకులను తరిమివేసాడు. అందుకే ఆ అరబ్ దేశాల ప్రజలు విక్రమాదిత్యుని తమకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించిన రాజుగా కీర్తిస్తారు. అరేబియాలో మహాదేవుని మందిరం నిర్మాణం చేశాడు. అట్లాగే విక్రమార్కుడు అయోధ్య పట్టణంలో రాముడు జన్మించిన స్థలంగుర్తించి  అక్కడ భవ్యమైన రామమందిర నిర్మాణం చేశాడు. ఈ విషయాలన్ని కాళిదాసు రచించిన గ్రంథాలలో మనకు తెలుస్తాయి. శకుల నుండి ఈ దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుని పేరుతో అప్పటి నుండి  విక్రమార్క శకం ప్రారంభమైంది.

శాలివాహన శకం

శాలివాహన శకం ఇది కలియుగంలో  3179 లో ప్రారంభమైంది. అంటే ఇప్పడు  1945 లో ప్రవేశించింది.  క్రీస్తు లెక్కప్రకారం క్రీస్తుశకం 78లో శాలివాహన శకం ప్రారంభమైనది,  అంటే (2024-78=1946) 1946లో  ప్రవేశిస్తుంది.  శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనవడు.  శాలివాహనుడు శకులను ,చీనులను, తార్తారులను ,బాహ్లికులను , కామరూపాదేశీయులగు కిరాతాది మ్లేచ్చులను రోమనులను, శట్లైన  ఖోరాసదేశస్తులను జయించి వారుదోచుకొనిపోయిన ధనరాశులను తిరిగి స్వాధీనం చేసుకొని వారిని దండించాడు.సింధునది కి తూర్పునగల భారత దేశమును ఆర్యస్థానమని సింధునదికి పశ్చిమాన గల దేశమును మ్లేచ్ఛ దేశమని హద్దులు ఏర్పరచి దిగ్విజయం సాధించిన  వేళానుండి శాలివాహన శకం ప్రారంభమైనది. శాలివాహన శకం విక్రమశకం  తరువాత 135 సంవత్సరాలకు ప్రారంభమైనది. శాలివాహనుడు  ఈ దేశంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుని ఒకే ఛత్రం  కింద ఈ దేశాన్ని పాలించినవాడు. ఇటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకునేందుకు యుధిష్టర,  విక్రమార్క, శాలివాహన శకలు ఏర్పడ్డాయి. అవి ఇప్పుడు మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే 1000 సంవత్సరాలు భావ దాస్యాన్ని వదిలించుకుని హిందుత్వ జాగరణతో జాతీయ పునరుజ్జీవనంతో స్వాభిమానంతో ఈ దేశం ప్రపంచంలో నిలబడి,  ప్రపంచానికి శాంతిబాటలు  వేసే మరో కొత్త శకం ప్రారంభించు కోవాలని పిలుపు నిస్తున్నది.