Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

ప్రీతిలతా వడ్డేదార్

తెల్ల వాని పైన గుళ్ళ వర్షముతోడ
ప్రీతి లతిట చెలగె భీకరముగ
చిట్టగాంగునందు చిరుత తీరు గనుము
వినుర భారతీయ వీర చరిత

భావము

భారతీయులను కుక్కలు అని అవమానించిన బ్రిటిషు వారిని తుదముట్టించేందుకు స్వాతంత్ర్ర్ర్య సమరయోధురాలు ప్రీతిలతా వడ్డేదార్ తన బృందంతో కలిసి బ్రిటిషు వాని క్లబ్బుపై దాడి చేసి గుళ్ళ వర్షం కురిపిస్తే తెల్లవాడు తెల్లబోయాడు. చిట్టగాంగునందు చిరుత వోలె చెలగిన వీరవనిత చరిత విను ఓ భారతీయుడా!

చరిత్ర

1932 లో తూర్పు బెంగాల్‌లో స్వాతంత్ర్య ఉద్యమం తారాస్థాయిని చేరుకుంది. అప్పటికే ఆంగ్ల పాలకులు వందేమాతరం దెబ్బతగిలి ఉన్నారు, విప్లవవీరులు సింహ గర్జన చేశారు. మాష్టర్ డా గా పిలువబడే సూర్యసేన్ నేతృత్వంలో 50 మంది యువ కిషోరాలు మాతృభూమి విముక్తి కోసం నూనూగు మీసాల యవ్వనాన్ని దేశం కోసం అర్పించడానికి సిద్దం అయ్యారు. వారు చేసిన సాహసాలను చూసిన దేశ ప్రజలు అప్పట్లో వారిని చిట్టగాంగ్ వీర కిషోరాలుగా పిలిచేవారు. అలాంటి వారిలో 21 సంవత్సరాల భగభగమండే జ్వాల ప్రీతిలతా వడ్డేదార్.

చిట్టగాంగ్ దగ్గర పాటియాలోని దల్గాట్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో 1911 సంవత్సరం మే ఐదవ తేదీన ప్రతిభ, జగ్ బంధు వడ్డేదార్ దంపతులకు ప్రీతిలతా వడ్డేదార్ జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు మంచి విద్యను అందించారు. అలా చదువుకునే సమయంలో దేశం పరాయిపాలనలో మనం ఉన్నామని ఆమె తెలుసుకున్నారు. బ్రిటిష్ పాలకుల ఆగడాలు ఆమెను స్వతంత్ర స్వరాజ్య సంగ్రామం వైపు అడుగుల వేయించింది. విద్యార్థి దశలోనే ఆమెకు ఔత్సాహిక విప్లవాత్మక కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న కొంత మంది మహిళలతో పరిచయం ఏర్పడింది. అలాంటి వారిలో లీలానాగ్ ఒకరు. ఢాకా విశ్వ విద్యాలయంలో ఆమె విద్యార్థిని. అంతేకాదు సుభాష్ చంద్రబోస్‌కు సహచరురాలు కూడా. ఆమె దీపాలి సంఘం అనే విప్లవ సమూహాన్ని స్థాపించారు. ఈ సంస్థ మహిళలకు పోరాటాల్లో శిక్షణనిచ్చేది. తర్వాత ప్రీతిలత ఈ సంస్థలోనే క్రియాశీలక సభ్యురాలు అయ్యారు.

ఉన్నత విద్య కోసం కలకత్తాలోని బెతున్ కాలేజీకి వెళ్లిన సమయంలో మాస్టర్ డా గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ విప్లవ నాయకుడు సూర్య సేన్ నుంచి ఆమె ప్రేరణ పొందారు. మాస్టర్ డా నేతృత్వంలోని తిరుగుబాటు బృందంలో తనను చేర్చుకోవాలని ఆమె కోరారు. ప్రారంభంలో ఆమెను బృందంలోకి తీసుకునేందుకు సూర్యసేన్ సంకోచించారు. బ్రిటీష్ పాలన నుంచి భారతదేశాన్ని విడిపించాలన్న ఆమె అచంచలమైన దృఢ నిశ్చయాన్ని గమనించిన ఆయన తర్వాత అంగీకరించాడు.

కలకత్తాలోని (ఇప్పటి కోల్‌కతా) రహస్యంగా ఓ బాంబులు తయారు చేసే కర్మాగారం నుంచి బాంబు కేసింగ్‌లను సేకరించే అత్యంత కష్ట మైన పనిని ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఆమె బెంగాల్ లోని వివిధ రహస్య సంఘాలకు చెందిన మహిళలు హాజరైన మహిళా సమావేశాలను నిర్వహించడం ప్రారంభించారు. జైలు పాలైన విప్లవ యోధులకు బంధువుగా నటిస్తూ, వారిని కలిసి రహస్య సమాచారం సేకరించడం ప్రారంభించారు. ఆమె ప్రతి పనిని అంకితభావంతో నేర్పుగా చేసేవారు.

బ్రిటిష్ పాలకులు తాగి తందనాలు ఆడటం కోసం పహర్తలిలో ఒక గెస్ట్ హౌస్‌ను (club house) నిర్మించారు. ఆ భవనం దగ్గర గోడమీద ఇలా వ్రాశారు.. ”కుక్కలు, భారతీయులకు ఇటు వైపు ప్రవేశం లేదు” అని. అది తెలిసిన మాష్టర్ డా వీరకిషోరాలకు నెత్తురు మరిగింది. పగ తీర్చుకోవాలనుకున్నారు. 1930లో సూర్యసేన్ తమ ప్రఖ్యాత చిట్టగాంగ్ ఆయుధ దాడులకు ప్రణాళికలను రచించారు. ప్రీతిలత తమ తోటి విప్లవకారులతో కలిసి, ఈ సాహసోపేతమైన మిషన్‌లో చురుగ్గా పాల్గొన్నారు.

ఈ సంఘటన తర్వాత బ్రిటీష్ వాళ్ళు ఆమె బృందం మీద పూర్తి బలగాలతో దాడి చేశారు. చాలా మందిని అరెస్టు చేయగా, ప్రీతిలతతో పాటు మరికొందరు సభ్యులు తప్పించుకోగలిగారు. 1932లో మరలా భారతీయుల పట్ల వివక్షాపూరిత వ్యవహారశైలికి చిహ్నమైన చిట్టగాంగ్‌లోని పహర్తాలి యూరోపియన్ క్లబ్ హౌస్ మీద దాడి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రీతిలత నిబద్ధత గల విప్లవయోధుల బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి, దాడికి సన్నాహాలు ప్రారంభించారు.

1932 సంవత్సరం సెప్టెంబర్ 23న ఆమె తన తోటి విప్లవకారులతో కలిసి బ్రిటీష్ ఆధిపత్యానికి చిహ్నమైన ఆ క్లబ్ హౌస్ మీద ధైర్యంగా దాడి చేశారు. భీకరంగా తుపాకీలతో గుళ్ళ వర్షం మొదలైంది. ఆ బుల్లెట్ల దాడికి బ్రిటీష్ వారికి మతిభ్రమించినంత పనైంది. ఒక్కసారిగా బెంబేలెత్తారు. అనేకమంది అక్కడిక్కడే హతమైపోయారు. కానీ దురదృష్టవశాత్తు మన సమర జ్వాలామణి ప్రీతిలత కాళ్ళలోకి బుల్లెట్లు దూసుకెళ్ళాయి. వెంటనే పోలీసు బలగాలు ఆమెను చుట్టుముట్టాయి. శతృవులు తనను చుట్టు ముడుతున్నారని గ్రహించి, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో దొరకకూడదనే అచంచల ధైర్యంతో, ఆ భారతమాత వీరపుత్రిక ఆత్మార్పణ గావించించారు. తన జేబులోంచి ఓ సైనైడ్ గుళిక తీసి, నోట్లో వేసుకున్నారు. దేశం కోసం బలిదానం చేశారు. అంతిమంగా మాతృభూమి రక్షణకోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన ధీర వనిత ప్రీతిలతా వడ్డేదార్.

ఆమె త్యాగనిరతి, ధైర్య సాహసాలకు నిదర్శనం అన్నట్టుగా కోల్‌కతాలో ఓ పార్కులో ప్రీతిలత విగ్రహం సందర్శకులకు స్ఫూర్తినిస్తున్నది. అయితే ప్రీతిలత గురించి దాదాపుగా బెంగాలీలు, చిట్టగాంగ్ వాసులకు తప్ప చాలా మందికి తెలియదు. ఇలాంటి మనదేశ సమర జ్వాలామణుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై వుంది. జైహింద్

-రాంనరేష్