Home News కోవిడ్ డోసులు @200కోట్లు: వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ అరుదైన రికార్డు

కోవిడ్ డోసులు @200కోట్లు: వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ అరుదైన రికార్డు

0
SHARE

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా వ్యాక్సినేష‌న్‌ను భార‌త్ విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. గ‌తేడాది జనవరి 16 ప్రారంభ‌మైన వ్యాక్సిన్ పంపిణీ 18 నెలల్లోనే 200 కోట్ల డోసుల మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం వరకు దేశవ్యాప్తంగా 200,00,15,631 డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఘనతపై ప్రధాని మోదీ స్పందిస్తూ భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందన్నారు. ఈ ప్ర‌క్రియ‌లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ ఇదెంతో గర్వకారణమన్నారు. కరోనా మహమ్మారిపై యావత్ ప్రపంచం చేస్తోన్న పోరుకి భారత్ సాధించిన ఘనత మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు.

దేశవ్యాప్తంగా గతేడాది ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీ భారీస్థాయిలో శరవేగంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా వ్యాక్సినకు అర్హులైన వారిలో 98శాతం మంది కనీసం ఒకడోసు తీసుకున్నారు. 90శాతం అర్హులకు పూర్తిమోతాదులో (రెండు డోసులు) డోసులు అందాయి. దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 51.5 శాతం పురుషులు కాగా 48.9శాత మంది మహిళలు ఉన్నారు. వందకోట్ల మైలురాయిని దాటడానికి 9 నెలలు (277 రోజులు) పట్టింది. మరో 9 నెలల్లో 200 కోట్ల మార్కును చేరుకుంది.

గతేడాది సెప్టెంబర్ 17న ఒకేరోజు 2.5 కోట్ల దోసులను పంపిణీ చేసి భారత్ రికార్డు సృష్టించింది. దేశంలో మూడో డోసు (Boostet Dose) పంపిణీ జులై 15, 2022న ప్రారంభమైంది. ఇప్పటివరకు 5 కోట్ల 63లక్షల డోసులు పంపిణీ చేశారు. ప్రికాషనరీ డోసు పేరుతో ఇస్తున్న బూస్టర్ డోసును తొలుత ప్రైవేటులో అందుబాటులో ఉంచగా.. తాజాగా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తోంది. రెండు, మూడో డోసు మధ్య వ్యవధి తొలుత తొమ్మిది నెలలుగా ఉండగా.. ప్రస్తుతం దాన్ని 6నెలలకు తగ్గించారు.

మొత్తంగా చూస్తే ప్రపంచంలో 184 దేశాల్లో ఇప్పటివరకు 122 కోట్ల దోసులు పంపిణీ జరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్ పంపిణీలో చైనా, భారత్ లు ముందుండగా.. ఈయూ, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.