Home News దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు

దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు

0
SHARE

మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. తాజాగా.. ఈశాన్య, మధ్య భారతం, నైరుతి ప్రాంతాల్లోని గిరిజనుల గ్రామాల్లో మళ్లీ ఈ డిమాండ్‌ ఊపందుకుంది. డీలిస్టింగ్‌ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలంటూ ప్రధాన మంత్రి మోదీకి పోస్ట్‌ కార్డులు రాశారు. సికిల్మా, చోర్కిడిప్‌ా, లామ్‌గావ్‌, సుర్గుజా, లుండ్రాబ్లాక్‌, మనేంద్రగఢ్‌, చిరిమిరి, సర్బోఖా, బలరాంపూర్‌ తదితర ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల్లో డిమాండ్‌ ఊపందుకుంది.

బలరాంపూర్‌, జష్‌పూర్‌ ప్రాంతాల్లోని ప్రధాన గ్రామాల్లో, హెడ్‌ క్వార్టర్స్‌లో సమావేశాలను కూడా నిర్వహించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచనలు చేస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌, రంబావాలోని తాండాలా, సిహోర్‌, దేవాస్‌, భోపాల్‌ మరియు బద్వానీ జిల్లాల్లో కూడా సమావేశాలు జరిగాయి. కొన్ని కొన్ని నినాదాల ద్వారా గిరిజనులు పెద్ద ఎత్తున తమ డిమాండ్లను సమాజం ముందు వుంచుతున్నారు. ‘‘సమస్య అనేక్‌… సమాధాన్‌ ఏక్‌.. డీ లిస్టింగ్‌… డీ లిస్టింగ్‌ (సమస్యలు అనేకం వున్నా… సమాధానం మాత్రం ఒక్కటే డీ లిస్టింగ్‌…డీ లిస్టింగ్‌), ‘‘జో భోలేనాథ్‌ కా నహీ… వో హమారీ జాత్‌ కా నహీ.. (ఎవరైతే భోలేనాథ్‌కి సంబంధం లేదంటారో.. వారు మా జాతికి చెందిన వారుకాదు) లాంటి ముఖ్యమైన నినాదాలతో తమ నినాదాలను తయారు చేసుకున్నారు.

రాజ్యాంగంలో 2 ఏ నిబంధన 2 లో ఏదైనా ఉన్నప్పటికీ, గిరిజన విశ్వాసాలను త్యజించి క్రైస్తవ మతం లేదా ఇస్తాం మతంలోకి మారిన ఏ వ్యక్తి అయినా షెడ్యూల్డ్‌ తెగకు చెందిన సభ్యునిగా పరిగణించబడదు’’ అంటూ 1967, జూలై 10న జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. దేశంలో 700లకు పైగా వున్న గిరిజన తెగల అభివృద్ది మరియు పురోగతి కొరకు రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లు మరియు ఇతర సౌకర్యాలు రాజ్యాంగంలో పొందుపరిచారు.

ఈ సౌకర్యాలు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు మరియు వారి విశ్వాసాలను పరిరక్షిస్తూ, అభివృద్ధి చెందడానికి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే కొంత మంది గిరిజనులు వారి తెగ సంస్కృతి, సంప్రదాయాలను వదిలి, క్రైస్తవులు లేదా ముస్లింలుగా మతం మారి, షెడ్యూల్‌ తెగలకు చెందవలసిన సౌకర్యాలను పొందుతారు. ఈ విధంగా మతం మారిన క్రైస్తవులు లేదా ముస్లింల వల్ల నిజమైన గిరిజనులు పొందాల్సిన సౌకర్యాలు, హక్కులను 80 శాతం మేర నష్టపోతున్నారు. అందుకే వెంటనే ‘‘డీలిస్టింగ్‌’’ చేయాలంటూ గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.