Home News నౌషేరా సింహం బ్రిగేడియర్‌ ఉస్మాన్‌

నౌషేరా సింహం బ్రిగేడియర్‌ ఉస్మాన్‌

0
SHARE

‘నువ్వు ఇండియాలో ఉండి ఏం చేస్తావు. హిందుస్థాన్‌ హిందువులది. నువ్వు పాకిస్తాన్‌ ఆర్మీలోకి వచ్చెయ్‌. నీకు ఆర్మీ చీఫ్‌ పదవిని ఇస్తాను. తొలి పాకిస్తానీ ఆర్మీ చీఫ్‌గా చరిత్రలో నిలిచిపోతావు’ ఇదీ మహ్మదలీ జిన్నా నుంచి ఆ సైనికుడికి వచ్చిన ఆహ్వానం.

అంతకు ముందు ఎందరో ముస్లిం ఆర్మీ ఆఫీసర్లు అతడిని కలిశారు. అధికారులు అతడిని కలిశారు. ఒక ముస్లింగా పాకిస్తాన్‌తో చేతులు కలపమని అడిగారు. అతని చిరునవ్వు వాళ్లకి ‘అది జరిగే పని కాదు’ అని చెప్పింది.

బెలూచ్‌ రెజిమెంట్‌లో బ్రిగేడియర్‌గా ఉన్న మహ్మద్‌ ఉస్మాన్‌ భారత సైన్యంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుని, పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చేశాడు. ఆయనను డోగ్రా రెజిమెంట్‌కి ఎటాచ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బీబీపుర్‌కి చెందిన బ్రిగేడియర్‌ ఉస్మాన్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని ఏనాడూ నమ్మలేదు. భారతదేశం కోసం ఆయన పాక్‌ ఆర్మీ చీఫ్‌ పదవిని వదులుకుని వచ్చేశారు. బెలూచ్‌ రెజిమెంట్‌ను పాకిస్తాన్‌కు కేటాయించగానే ఆయన భారత్‌కు వచ్చేశారు.

బ్రిగేడియర్‌ అవివాహితుడు. ఆయన మద్యం ముట్టుకునేవాడు కూడా కాదు. నియమనిష్ఠలతో జీవితాన్ని గడిపేవాడు. ఆయన జీతంలో ఎక్కువ భాగం పేద విద్యార్థులను చదివించేందుకే ఖర్చు చేసేవాడు.

1935లో సైన్యంలో చేరిన బ్రిగేడియర్‌ ఉస్మాన్‌ రెండో ప్రపంచ యుద్ధంలో బర్మా (మయన్మార్‌)లో పనిచేశారు. దేశ విభజన తరువాత ఆయనను ముందు డోగ్రా రెజిమెంట్‌లోని 77వ పారాచ్యూట్‌ బ్రిగేడ్‌కి నాయకత్వం వహించమన్నారు. జమ్మూ కశ్మీర్‌పై పాక్‌ రక్కసి కన్ను పడి, కిరాయి మూకల ముసుగులో పాక్‌ సైన్యం జమ్మూకశ్మీర్‌ను కబళించేందుకు వచ్చినప్పుడు ఆయనకు, ఆయన బ్రిగేడ్‌కి జమ్మూ ప్రాంతంలోని నౌషేరా, ఝాంగర్‌ ప్రాంతాలను కాపాడే బాధ్యతను అప్పగించారు.

ఆయన వ్యూహ రచన, యుద్ధ కౌశల్యం ఎలాంటిదంటే 1948లో నౌషేరా వద్ద జరిగిన పోరాటంలో దాదాపు వెయ్యి మంది పాకిస్తానీలను ఆయన సైన్యం మట్టు పెట్టింది. మరో వెయ్యి మందికి గాయాలయ్యాయి. పాకిస్తాన్‌ తోకముడిచింది. నౌషేరా, ఝాంగర్‌లు శత్రువు గుప్పెట్లో నుంచి విముక్తమయ్యాయి. ఈ మొత్తం పోరాటంలో కేవలం 30 మంది భారతీయ జవాన్లు మాత్రమే చనిపోయారు. పాకిస్తానీ కిరాయి మూకలు పలాయనం చిత్తగించడంతో ఈ ప్రాంతం విముక్తమైంది.

దీనితో పట్టరాని కోపంతో పాక్‌ ప్రభుత్వం నేరుగా సైన్యాన్నే పంపించింది. అది మే 1948. పాక్‌ సైన్యం అత్యంత కీలకమైన ఝాంగర్‌, నౌషేరాలను చేజిక్కించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ బ్రిగేడియర్‌ ఉస్మాన్‌ నాయకత్వం, పోరాట పటిమల ముందు వారి పాచికలు పారలేదు. మే లో మొదలైన దాడి జూలై వరకూ కొనసాగింది. జూలై మూడో తేదీ, 1948 న పాకిస్తానీలకు, మన సైన్యానికి నౌషేరాలో భీకరమైన యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో ఒక ఫిరంగి గుండు నేరుగా బ్రిగేడియర్‌ ఉస్మాన్‌ను తాకింది.

ఆ క్షణంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి : ‘నేను చనిపోతున్నాను. కానీ ఒక్క అంగుళం నేల కూడా శత్రువుకి వదలకూడదు’ ఆఖరి ఊపిరితో ఆయన అన్న ఈ మాటలు బ్రిగేడియర్‌ ఉస్మాన్‌ వ్యక్తిత్వానికి, ధీరోదాత్తతకు నిలువెత్తు నిదర్శనాలు. బ్రిగేడియర్‌ మాటలు ఆయన సైనికులకు మంత్రాలయ్యాయి. వారు ప్రాణాలొడ్డి పోరాడారు. శత్రువును తరిమికొట్టారు. నౌషేరా, ఝాంగర్‌లు విముక్తమయ్యాయి. త్రివర్ణపతాకం రెపరెపలు మన విజయాన్ని సూచించాయి.

బ్రిగేడియర్‌ ఉస్మాన్‌కు మహావీరచక్ర ప్రదానం చేశారు. ఆయన అంతిమ సంస్కారం ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగింది. నేటికీ ఆయన సమాధి అక్కడ ఉంది.

– ప్రభాత్‌

(జాగృతి సౌజన్యం తో)