Home News బిహెచ్ఇఎల్ రామచంద్రపురంలో వేడుకగా నారద జయంతి

బిహెచ్ఇఎల్ రామచంద్రపురంలో వేడుకగా నారద జయంతి

0
SHARE

బిహెచ్ఇఎల్ రామచంద్రపురం: సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైశాఖ బహుళ విదియ నాడు దేవర్షి నారద జయంతి కార్యక్రమం బిహెచ్ఇఎల్ రామచంద్రపురం (సంగారెడ్డి జిల్లా) గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని జయలక్ష్మి మాత భవనంలో జ్యోతి ప్రజ్వలనతో మొదలైంది. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు, బీరంగూడ, రామచంద్రపురం నగరాల నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి మార్గదర్శనం చేయటానికి విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచార ప్రముఖ్ బోయిని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 1925 సంవత్సరంలో మొదలైందని అప్పటినుండి సంఘ కార్యం విస్తరిస్తూ 1994 నాటికీ ప్రచార విభాగం ప్రారంభించి, జాతీయవాద జర్నలిజం గురించిన సందేశాన్ని సమాజంలో వ్యాపింపచేస్తున్నదని తెలిపారు.

“ది ఆర్గనైజర్” వారపత్రిక దక్షిణ భారత-బ్యూరో చీఫ్, కుంటి సురేందర్ గారు మాట్లాడుతూ జాతీయవాద జర్నలిజం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైందని తెలిపారు. నారద మహర్షిని ఆదర్శంగా తీసుకుని నేటి పాత్రికేయులు సమాచారాన్ని లోక కళ్యాణం కోసం, దేశం యొక్క రక్షణ కోసం ఉపయోగించేలా పనిచేయాలని తెలిపారు.

సమాచార భారతి జాయింట్ సెక్రటరి ఉప్పల ప్రదీప్ గారు మాట్లాడుతూ నారద మహర్షి జయంతి ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకోవటం చాల సంతోషం అని తెలిపారు. ప్రశ్నోత్తరాలు స్వీకరించి సభకు మార్గదర్శనం చేశారు.

అనంతరం రామచంద్రపురం నగర ప్రచార ప్రముఖ్ అరవిందర్ గారు, నగర ప్రచార ప్రముఖ్ మనోజ్ గారు కార్యక్రమానికి హాజరైన పాత్రికేయులకు, నగర వాసులకు ధన్యవాదాలు తెలిపి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని జరుగుతాయని, అందరు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

వేడుకలో పాల్గొన్నవారికి జాగృతి అయోధ్య రామమందిర ప్రత్యేక సంచికను అందచేశారు. అనంతరం భోజన ప్రసాదంతో కార్యక్రమం ముగిసింది.