Home News సమాజ నిర్మాణంలో మహిళలు, ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది

సమాజ నిర్మాణంలో మహిళలు, ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది

0
SHARE

సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో  నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో రెండు  రోజుల పాటు జరిగిన సేవా సంగమంలో 250 సేవా సంస్థలు (ఎన్.జి.ఒ లు) పాలుపంచుకున్నాయి. అలాగే ఇందులో జరిగిన వివిధ సమావేశాల్లో 900 మంది మహిళలు, 1100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో స్వచ్ఛంధ సంస్థలకు సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన మరియు ఆర్ధిక లావాదేవీలు, ఖాతాల నిర్వహణ, డిజిటల్ మార్కెటింగ్ సద్వినియోగం వంటి విషయాల్లో శిక్షణనిచ్చారు. అంతేకాకుండా  కార్యక్రమంలో మహిళల, ఉపాధ్యాయుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. 

సేవాతత్పరత, సమాజ నిర్మాణంలో మహిళలు, ఉపాధ్యాయుల పాత్రపై కార్యక్రమంలో కూలంకుషంగా చర్చించారు. భావితరాల విద్యార్థుల్లో సేవా భావన పెంపొందించడం ద్వారా సమాజ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయగలమని వక్తలు అభిప్రాయపడ్డారు. 

కార్యక్రమంలో భాగంగా వివిధ స్వచ్ఛంధ సంస్థలు తమ తమ ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. వీటి  ద్వారా సందర్శకులకు తమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాయి. దీనితో పాటు కార్యక్రమ నిర్వాహకులు  ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. 

కార్యక్రమ ఉద్ఘాటనలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలే శ్యామ్ కుమార్, సేవాభారతి తెలంగాణ అధ్యక్షులు శ్రీ డి. దుర్గారెడ్డి గారు, సేవా సంగమం అధ్యక్షులు శ్రీ ఎం.వీ. రామరాజు, ఉపాధ్యక్షులు శ్రీమతి డా. సుమలత, దక్షిణమధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్, తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ పెడవల్లి దేవేందర్ పాల్గొన్నారు. 

ముగింపు కార్యక్రమంలో ఆరెస్సెస్ జ్యేష్ట ప్రచారక్ శ్రీ రవికుమార్ అయ్యర్, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణామూర్తి, హరేకృష్ణ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ సత్యగౌర చంద్రప్రభుదాస్,  సేవా సంగమం అధ్యక్షులు శ్రీ ఎం.వీ. రామరాజు, ఉపాధ్యక్షులు శ్రీమతి డా. సుమలత, దక్షిణమధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ పాల్గొన్నారు. 

సేవా సంగమంలో పాల్గొన్న స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, నిర్వాహకులు, కార్యకర్తలు అందరూ సేవాభావంతో తమ తమ కార్యక్షేత్రాలలో పనిచేస్తామని సంకల్పం చేసుకున్నారు. 

అనేక ఏళ్లుగా సమాజసేవలో నిమగ్నమైన సేవాభారతి పూర్వ అధ్యక్షులు శ్రీ నాగరాజు, జనహిత ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ నరసింహ మూర్తి, వైదేహీ ఆశ్రమ నిర్వాహకులు శ్రీ బాలకృష్ణ, ఏకలవ్య ఫౌండేషన్ స్థాపకులు శ్రీ వేణుగోపాలరెడ్డి, స్పార్ష్ హొస్పైస్ కు చెందిన శ్రీ రామ్మోహన్,డాక్టర్ శ్రీమతి రోహిణిలను సన్మానించారు. .