Home Hyderabad Mukti Sangram రజాకార్ల ఎదుర్కోవడానికి గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటు..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-14)

రజాకార్ల ఎదుర్కోవడానికి గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటు..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-14)

0
SHARE

కొంతకాలం తర్వాత హైద్రాబాద్ రియసత్ ప్రధానమంత్రి అయిన లాయక్ ఆలీ చెరియాల ప్రాంత పర్యటనకు వచ్చాడు. ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వాన వెయ్యిమంది గ్రామస్థులు వెళ్ళి రజాకార్ల దాడుల గురించి చెప్పాడు. ఆయన అందరూ కలిసిమెలసి ఉండాలనీ నీతులు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక లాభంలేదని ఆ ప్రాంతాలలో గ్రామీణులు తమ ఆత్మరక్షణకు ఆయుధాలు వగైరా సేకరించటం మొదలుపెట్టారు. భైరవునిపల్లి బురుజుపై వల్లపట్ల రామచంద్రరావు దేశ్‌ముఖ్ నుండి సంపాదించిన ఫిరంగిని పెట్టారు.

నాలుగైదు మణుగుల మందుగుండు సామగ్రి తయారుగా ఉండేది. అలాగే గ్రామంలో కంసాలి ఇనుపగుండ్లను తయారుచేసేపని మొదలుపెట్టాడు. బెక్కల్, ధూళిమిట్ట, తోరసాల్, జాలపల్లి, కొండాపూర్, కుటిగల్, సోలిపూర్, అంకుశీపూర్ తదితర గ్రామాలు తమ రక్షణదళాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటన్నింటికి భైరవునిపల్లి కేంద్ర బిందువుగా పనిచూస్తూ వచ్చింది. అందువల్ల ఈ గ్రామంపై రజాకార్లు తమ దృష్టిని కేంద్రీకరించారు. భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హాషిం కూడా భైరవునిపల్లి గ్రామస్థులను తిరుగుబాటుదార్లుగా భావించి దాడిచేయటానికి సిద్ధపడ్డాడు. ఈ గ్రామస్థుల ధైర్యం తనకు సవాలుగా కనిపించింది.

ఇక్బాల్ హాషం ఓటమి

ఈ డిప్యూటీ కలెక్టర్ శాంతిస్థాపన నెపంతో తన పోలీసు బలగంతో గ్రామాలమీద పడ్డాడు. కొడకండ్ల గ్రామంలో దాదాపు నలభై మంది నిర్దోషులను కాల్చి చంపేశాడు. తర్వాత 150 మంది గల తన ముఠాతో భైరవునిపల్లి చేరుకున్నాడు. బురుజుపైనుండి ఈ ముఠాను పసిగట్టిన కాపలాదారులు నగారా మ్రోగించారు. చిన్న ఫిరంగి కాల్పులకు హాషిం ముఠా తట్టుకోలేక పోయింది. ఉదయం పదిగంటల నుండి సాయంత్రం వరకు రెండువైపుల నుండి కాల్పులు కొనసాగాయి. ఎంత ప్రయత్నించినా హాషిం తన ముఠాతో గ్రామంలో ప్రవేశించలేకపోయాడు. ఎనిమిది గంటలపాటు సాగిన ఈ పోరాటంలో హాషిం ముఠా నలుగురు నిరాయుధులను మాత్రం చంపగలిగింది.

తమ పక్షాన పదిహేను మందికి పైగా చనిపోయాకి, వాళ్ళను బళ్ళపై వేసుకొని తిరుగుముఖం పట్టక తప్పలేదు. తన ప్రయత్నం విఫలం కాగా హాషిం మరింత కసితో ఆ గ్రామాన్ని నేలమట్టం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. విజయవంతమైన తమ పోరాటం వల్ల భైరవునిపల్లి గ్రామస్థుల ధైర్యం మరింత పెరిగింది. రజాకార్ల ముఠాలను నిర్భయంగా ఎదుర్కొనగలమనే ధీమా హెచ్చింది. అయితే నిజాం సైన్యం ముందు తాము నిలువగలమా? అనే అంశాన్ని వాళ్ళు తీవ్రంగా ఆలోచించలేదు. సైన్యం వచ్చి చుట్టుముట్టనున్నదనే వార్త తెలిసినా గ్రామం ఖాళీచేసి అడవుల్లోకి పారిపోవాలనే ఆలోచనే వాళ్ళకు తట్టలేదు. తత్ఫలితంగా భైరవునిపల్లి సర్వనాశనం కాక తప్పలేదు.

హైద్రాబాద్ వరంగల్ మార్గంలో ఉన్న జనగామ తాలూకా కేంద్రంలో నిజాం ప్రభుత్వం తాత్కాలికంగా మిలిటరీ క్యాంపు ఏర్పాటు చేసింది. నిజాం సైన్యంలో ఒక మేజర్, ఇద్దరు కెప్టెన్‌లు తమ దళాలతో సహా వచ్చి విడిది చేశారు. మరోవైపు నుండి సాయుధపోలీసు దళం వచ్చింది. వరంగల్, నల్లగొండ డి.యస్.పి.లు, వరంగల్‌కు చెందిన డి.జి.లు స్వయంగా వచ్చి ఏర్పాట్లు చూశారు. రజాకార్ల ముఠా తమ నాయకులతో సిద్ధంగా ఉంది. వరంగల్, మెదక్ సుబేదారులు (కమీషనర్‌లు) ఇక్బాల్ హాషిం, తమ బలగాలతో వచ్చి కలుసుకున్నారు.

ఇంత పెద్ద ఎత్తున సాగుతున్న సైనిక ఏర్పాట్లను చూసి జనగామ ప్రజలు భీతావహులైపోయారు. రోజు రోజుకూ పెరుగుతున్న రజాకార్ల అత్యాచారాలు, నిజాం ప్రభుత్వ దమనకాండ ప్రజలను నిస్సహాయుల్ని చేశాయి. ఏదో పెద్ద హత్యాకాండకు పన్నాగం పన్నుతున్నారనే విషయం స్పష్టమైంది. ఆ రాత్రి ట్రక్కుపై సామాన్లు వేసుకొని 500 మంది సైనికులు, పోలీసులు, రజాకార్లు జనగామ నుండి సిద్ధిపేటవైపు వెళ్ళే రోడ్డుమీదుగా బయలుదేరారు. వెంట 200 మందికి పైగా హిందూ, ముస్లిం సివిల్ అధికారులు కూడా ఉన్నారు.

(విజయక్రాంతి సౌజన్యం తో)