Home Rashtriya Swayamsevak Sangh భారతీయతే మన అస్తిత్వం – డా. మన్మోహన్ వైద్య

భారతీయతే మన అస్తిత్వం – డా. మన్మోహన్ వైద్య

0
SHARE

మతమార్పిడి చర్చ్ మద్దతు, అభారతీయ కమ్యూనిస్ట్ సిద్ధాంతపు ప్రభావం కలిగిన కాంగ్రెస్ నాయకులు కొందరు భారతదేశ పేరుప్రతిష్టలు, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేయడం ఎంతో బాధాకరం. బాగా చదువుకున్న ఇలాంటి నేతలు చేసే ప్రకటనలు చూస్తూ ఉంటే మాజీ రాష్ట్రపతి డా. ఎస్. రాధాకృష్ణన్ చెప్పిన ఒక మాట గుర్తుకువస్తుంది. 1949 విద్యాసంఘం నివేదికలో డా. రాధాకృష్ణన్ మన దేశంలో (ఆంగ్ల)విద్యకున్న అభారతీయ లక్షణాన్ని గురించి ఇలా వ్రాసారు – “శతాబ్ద కాలంగా మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే, అది భారతదేశపు గతాన్ని పూర్తిగా విస్మరించింది. భారతీయ విద్యార్ధులకు తమ సొంత సంస్కృతి గురించిన జ్ఞానం ఏమాత్రం కలిగించడం లేదు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మనకి చెప్పుకోదగిన మూలాలు లేనేలేవని అనిపించేట్లు చేస్తోంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అంతకంటే దారుణంగా,అసలు చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం కలవకుండా మన మూలాలే అడ్డుపడుతున్నాయనే భావం కలిగిస్తోంది ఈ విద్యావ్యవస్థ’’.

ఇటీవల ఒక సీనియర్ కాంగ్రెస్ నేత అటువంటి ఒక అసంబద్ధమైన, దారుణమైన ప్రకటన చేశారు. బిజెపి ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ దేశం `హిందూ పాకిస్తాన్’ అయిపోతుందని ఆయన వాపోయారు.

అభారతీయ కమ్యూనిస్ట్ ఆలోచనలు, భావాలు మనలో ఎంతగా పాతుకుపోయాయంటే, మన ఆలోచనా విధానమేకాదు, మన భాష, ఉపయోగించే మాటలు కూడా అలాగే ఉంటున్నాయి.  హిందూ పాకిస్తాన్, హిందూ తాలిబాన్, హిందూ తీవ్రవాదం అనే పదాలు పూర్తిగా అభారతీయమైనవి. వీటిలో `హిందూ పాకిస్తాన్’ అనే మాట పూర్తిగా విరోధాభాసాలంకారం(oxymoron). ఈ అర్ధంలేని ప్రకటన గురించి చర్చించడానికి ముందు అసలు భారత్ అంటే ఏమిటో, హిందుత్వ అంటే ఏమిటో అర్ధం చేసుకోవాలి.

ఇటీవల నాగపూర్ లో మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీ “యూరోప్ లో జాతి – రాజ్య భావన వికసించకముందే భారత్ ఒక రాజ్యంగా విలసిల్లింది. పరిమిత భూభాగం, ఒకే భాష, మతవిశ్వాసాలు, సమాన శత్రుమిత్ర భావన అనే అంశాలపై యూరోప్ లో జాతి – రాజ్యాలు ఏర్పడ్డాయి. మరోవైపు భారతీయ జాతీయవాదం `వసుధైవ కుటుంబకం’, `సర్వేభవంతు సుఖినః సర్వేసంతు నిరామయ’ అనే వైశ్విక భావాల ఆధారంగా ఏర్పడింది. ఈ వైశ్విక దృష్టికి మూలం భారతీయ తత్వచింతనలో ఉంది. మనం సర్వప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తాం. అందరి సుఖశాంతులు కోరుకుంటాం. మన జాతీయ అస్తిత్వం సమ్మేళనం(confluence), సమానీకరణం(assimilation), సహజీవనం(co-existence)అనే సుదీర్ఘమైన ప్రక్రియ ద్వారా ఏర్పడింది.  మతవిశ్వాసాలు, భాషలో వివిధత్వమే భారతదేశ ప్రత్యేకత. మనది కేవలం `సహిష్ణుత’ కాదు. ఇతరుల పట్ల `గౌరవం’, `అంగీకారం’. మనం వివిధత్వాన్ని అంగీకరిస్తాం, గౌరవిస్తాం. ఆ వివిధత్వానికి గర్విస్తాం. శతాబ్దాలుగా ఇదే మన సామూహిక చింతన అయింది. కనుక మన జాతీయవాదాన్ని మూఢత్వం, మత గుర్తింపు, ప్రాంతీయ తత్వం, అసహనం, ద్వేషం ఆధారంగా నిర్వచించాలనుకోవడం దానిని పలుచన చేయడమే అవుతుంది.’’

ఇటువంటి విశాల, సమన్వయపూర్వక, సహనశీల, వైశ్విక ఆలోచనా ధోరణికి ఆధారం ఆధ్యాత్మికత. ఈ విషయం ప్రపంచమంతా గుర్తించింది. దీనినే `హిందూ జీవన దృక్పధం’ అని డా. రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఈ జీవన విధానపు లక్షణాలను ఆయన ఇలా వివరించారు – “హిందూ సంస్కరణ పద్దతిలో ప్రతి సమూహానికి తన గత సంబంధాలను, వ్యక్తిత్వాన్ని, ప్రయోజనాలను నిలుపుకునేందుకు వీలు ఉంటుంది. విద్యార్ధులకు తమ కాలేజీ  ఎంత అపురూపమైనదో సమూహాలకు వారి దేవుళ్ళు అంత విలువైనవాళ్లు. కనుక విద్యార్ధులను మెరుగుపరచడానికి కాలేజీ మార్చాల్సిన అవసరం లేదు. ప్రతి కాలేజీలో విద్యాప్రమాణాలను పెంచితే అప్పుడు ఏ కాలేజీలో చదివినా విద్యార్ధులు లాభపడతారు. హిందువు ఒకే పరమాత్మ తత్వాన్ని గుర్తిస్తాడు. అయితే ఆ తత్వానికి వివిధ పేర్లతో పిలవవచ్చును. హిందూ సమాజం ఒకటే. కానీ అందులో అనేక కులాలు ఉంటాయి. జనాభాపరంగా అనేక జాతులు ఉండవచ్చును. కానీ వారంతా ఒకే జీవన తత్వంతో ముడిపడి ఉంటారు.’’

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగోర్ కూడా తన `స్వదేశీ సమాజ్’ అనే వ్యాసంలో ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన ఇలా వ్రాసారు – “భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుభూతి చెందడం, వివిధత్వంలో ఏకత్వాన్ని సాధించడం భారతదేశపు అంతర్నిహిత ధర్మం. తేడాలను భారతదేశం విభజనగా, వేరుపడటంగా చూడదు. ఇతరులను శత్రువులుగా చూడదు. ఏది వదులుకోకుండా లేదా నాశనం చేసుకోకుండా ప్రతిఒక్కరు ఒక బృహత్తర వ్యవస్థలో భాగం కావాలని భారత్ కోరుకుంటుంది. అందుకనే ప్రతి మార్గపు గొప్పతనాన్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఈ లక్షణం వల్లనే మనం ఏ సమాజాన్ని శత్రువుగా పరిగణించి భయాందోళనలకు గురికాము. ప్రతి సంఘర్షణ వల్ల మనం మరింత విశాలత్వాన్ని సాధించాము తప్ప కుంచించుకుపోలేదు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, ముస్లిములు ఇలా అంతా ఇక్కడ కలిసి ఉన్నారు తప్ప కొట్టుకోలేదు. వీరిని కలిపి ఉంచేది హిందుత్వమే. ఈ దేశపు అవయవాలు కొన్ని విదేశీ అయినా, జీవనం, మూల తత్వం మాత్రం భారతీయతే’’.

ఈ సహనశీల, సమన్వయపూర్వక, సంపూర్ణ , సమైక్య ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొందరు నిరాకరించడం వల్లనే పాకిస్తాన్ ఏర్పడిందనే సంగతి కాంగ్రెస్ నేతలు మరచిపోయారు. ఈ మరపుకు కారణం అభారతీయ విద్యావిధానం, అభారతీయమైన కమ్యూనిస్టు ఆలోచనల ప్రభావం. భారతదేశం హిందుత్వ జీవన విధానంతో ముడిపడి ఉన్నంతకాలం అది పాకిస్తాన్ గా మారదు. ఈ హిందూత్వాన్ని నిరాకరించడం వల్లనే పాకిస్తాన్ ఏర్పడింది. ఐక్యత, స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం భారత్ `అస్తిత్వం’ అయితే, ఆధ్యాత్మికత పై ఆధారపడిన సాంస్కృతిక, సైద్ధాంతిక వారసత్వం దాని `అస్మిత’(స్వభావం). ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ మౌలిక అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే భారత్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని వీరికి తెలియదా? దీనిని నిరాకరించడం వల్లనే దేశ విభజన జరిగింది.

నిజానికి సహనశీలమైన, విశాలమైన ఈ ఐదు వేల సంవత్సరాల పురాతన సంస్కృతి వల్లనే వివిధత్వం విలసిల్లింది. ఈ సంస్కృతి గురించే  ప్రణబ్ దా మాట్లాడారు. దీనినే రవీంద్రనాథ్ ఠాగోర్, డా. రాధాకృష్ణన్ లు `హిందూ జీవన విధానం’ అన్నారు. చివరికి పాకిస్థాన్ లో కూడా ఇదే జీవనధార కనిపిస్తుంది. ఈ సుసంపన్నమైన వారసత్వం నుండి వేరుపడింది కాబట్టే పాకిస్థాన్ అలా అయింది. మళ్ళీ ఈ సనాతన స్రవంతిలో కలిస్తే ఇస్లాం ప్రార్ధనా పద్దతిని వదిలిపెట్టకపోయినా పాకిస్థాన్ హిందూ మూలాలను కాపాడుకోవచ్చును. ఎం. సి. చాగ్లా, ఎ.పి.జె. అబ్దుల్ కలాం, పాకిస్థాన్ లో జన్మించి, ప్రస్తుతం కెనడాలో జీవిస్తున్న తారేక్ ఫతే వంటివారు ఇస్లాం మతాన్ని అనుసరించినా తమ హిందూ వారసత్వ సంబంధాన్ని తెంచుకోలేదు. అలాగే పాకిస్థాన్ కూడా ముస్లిం దేశంగా ఉంటూనే ఈ సహనశీలమైన, విశాలమైన సంస్కృతితో ముడిపడితే అప్పుడు అది `హిందూ పాకిస్థాన్’ అవుతుంది. మరోలా చెప్పాలంటే అది `భారత్’ అవుతుంది. రాజకీయమైన ప్రత్యేక హోదాను నిలబెట్టుకుంటూనే అలా మారవచ్చును. ఇదే భారతీయ దృక్పధం. సార్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర  దేశమైనా నేపాల్ ఈ సాంస్కృతిక – ఆధ్యాత్మిక పరంపరతో తనను తాను జోడించి ఉంచుకుంది. అందువల్లనే భారత్, నేపాల్ ల మధ్య ప్రవేశ ఆంక్షలు ఏమిలేని సరిహద్దులు ఏర్పడ్డాయి.

ఈ సాంస్కృతిక మూలాలే భారతదేశపు అస్తిత్వం. ఈ అస్తిత్వాన్నే హిందూత్వం లేదా హిందూ జీవన విధానం అని డా. రాధాకృష్ణన్, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగోర్ లు అభివర్ణించారు. `హిందూ’ అనే మాట పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు `భారతీయ’ లేదా `ఇండిక్’ అనే పదాలు ఉపయోగించవచ్చును. ఏ పదం ఉపయోగించినా ఆధ్యాత్మికత ఆధారంగా వికసించిన సమీకృత, సంపూర్ణ జీవన విధానమే మన వారసత్వం అనే సత్యం మాత్రం మారదు. సత్యం ఒకటే అయినా దానిని వివిధ పేర్లతో పిలవవచ్చును అనేదే భారతీయ చింతన సారాంశం. అదే అత్యంత కీలకమైన, ప్రధానమైన అంశం.

భారతీయ సాంస్కృతిక – ఆధ్యాత్మిక సంప్రదాయంతో ముడిపడి ఉన్నవారి ఆలోచన ఎలా ఉంటుంది? దీనికి మంచి ఉదాహరణ ఆచార్య మహాప్రాజ్ఞజీ మాటల్లోనే లభిస్తుంది. మహాప్రాజ్ఞజీ తేరా పంథ్ అనే తెగకు చెందినవారు. ఇది శ్వేతాంబర జైన్ లకు చెందిన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒకటి. జాతీయ దృక్పధం, అవగాహన ఉన్న సాధువు కాబట్టి ఆయన్ని అందరూ గౌరవించేవారు. `నేను స్థానకావాసి జైన్ ను కాబట్టి తేరా పంథ్ కు చెందినవాడినయ్యాను. శ్వేతాంబర జైన్ ను కాబట్టి స్థానకావాసి జైన్ అయ్యాను. జైనుడిని కాబట్టి శ్వేతాంబర జైన్ అయ్యాను. అన్నింటికంటే మించి నేను హిందువును కాబట్టి జైనుడిని అయ్యాను’ అని ఆయన అనేవారు. భారతీయ చింతనలో ఈ తేడాలు పరస్పర వ్యతిరేకమైనవి, విరుద్ధమైనవి కావు. అవన్నీ ఒకే అస్తిత్వానికి వేరువేరు రూపాలు. ఇదే భారతీయ సంప్రదాయం. ఎప్పుడైతే ఈ సంప్రదాయంతో సంబంధం పలచబడుతుందో అప్పుడు మన ఆలోచనలోను, మాట్లాడే మాటలోను తేడా వస్తుంది. అప్పుడు ఇవే మాటలు `నేను జైనుడిని కాబట్టి హిందువుని. శ్వేతాంబర జైన్ ని కాబట్టి జైనుడిని. స్థానకావాసి జైన్ ని కాబట్టి శ్వేతాంబర జైన్ ని. తేరా పంథ్ కు చెందినవాడిని కాబట్టి స్థానకావాసి జైన్ అయ్యాను’ అని మారిపోతాయి.

ఈ మరపు మరింత తీవ్రమైతే పెడర్ధాలు పెరుగుతాయి. `నేను జైన్, శ్వేతాంబర, స్థానకావాసి లేదా తేరా పంథీ..ఇలా ఏదైనా కావచ్చును. కానీ హిందువును మాత్రం కాను’ అనే వరకు వెళుతుంది. ఆ తరువాత రాజకీయాలు వస్తాయి. మూలాలు మరింత దూరమైతే అప్పుడు ఇక హిందూ పాకిస్తాన్, హిందూ తాలిబాన్, హిందూ తీవ్రవాదం వంటి అర్ధంలేని ఆలోచనలు వస్తాయి. చివరికి అస్తిత్వాన్ని పూర్తిగా మరచిపోవడంతో అభారతీయ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు `భారత్ తేరే టుక్డే హోంగే, భారత్ కీ బర్బాదీ తక్ జంగ్ చలేగి, జంగ్ చలేగి’ వంటి నినాదాలు పుట్టుకువస్తాయి. ఈ నినాదాలు చేసినవారు నిరక్షరాస్యులు, వెనుకబడినవారు, నిరుపేదలు కారు.

వీళ్ళంతా ఆధునిక భారతీయ మేధోవర్గానికి యువ ప్రతినిధులు. వీళ్ళంతా `అత్యంత ప్రగతిశీల, ఆధునిక’ విద్యా సంస్థల నుంచి వచ్చినవారు. ఏ దేశాన్ని తిట్టిపోస్తున్నారో అదే దేశం నుంచి జీతాలు, ఇతర సదుపాయాలు పొందుతున్న విద్యావేత్తలు, మేధావుల మద్దతు వీరికి ఉంది. విద్య ద్వారా జరుగుతున్న అభారతీయకరణకు ఇంతకంటే మించిన ఉదాహరణ ఉంటుందా?

కనుక జాతీయ అస్తిత్వంగా మారిన భారతీయుల ఐదు వేల సంవత్సరాల సమిష్టి జీవనం, కలిసి సాగించిన ప్రయాణం గురించి డా. ప్రణబ్ ముఖర్జీ మాట్లాడటం ఇప్పుడు చాలా సందర్భోచితం. మనం మన మూలాల నుండి విడిపోకుండా, దూరమైపోకుండా ఉన్నప్పుడే ఈ అస్తిత్వాన్ని కాపాడుకుని రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కాగలుగుతాం. ఇదే భావం ప్రముఖ కవి ప్రసూన్ జోషి మాటల్లో చెప్పి ముగిస్తాను –

ఓ వృక్షమా! నేలను వదిలిపెడుతున్నావెందుకు? ఎండిపోతావు
నీ వేళ్ళు నేలలోకి ఎంత లోతుకు వెళితే నువ్వు అంత పచ్చగా ఉంటావు

(उखड़े उखड़े क्यों हो वृक्ष, सूख जाओगे।
जितनी गहरीं जड़ें तुम्हारी, उतने ही तुम हरियाओगे।)

– డా. మన్మోహన్ వైద్య
సహ సర్ కార్యవాహ్(సంయుక్త కార్యదర్శి), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్