Home News నైజాం విముక్త పోరాటంలోనూ కమ్యునిస్టుల‌ వెన్నుపోటే

నైజాం విముక్త పోరాటంలోనూ కమ్యునిస్టుల‌ వెన్నుపోటే

0
SHARE

– డా.మాసాడి బాపురావు

క్విట్ ఇండియా ఉద్యమానికి లాగానే, హైదరాబాద్ సంస్థాన ప్రజల విముక్తి ఉద్యమానికి కూడా కమ్యూనిస్టులు వెన్నుపోటే పొడిచారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యునిస్టుల పాత్ర గురించి పుంఖాను పుంఖాలుగా చరిత్ర పుస్తకాలు లభించడం మనం చూస్తూనే ఉంటాం. నిజాం వ్యతిరేక‌ పోరాటమంటేనే కమ్యునిస్టులు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటమే గుర్తు కొచ్చేంతగా ఊదరగొట్టేశారు. విధిలేక తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మేస్తుంటారు కూడా. నాటి హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలుండగా వీరి పోరాట ప్రభావం కేవలం వరంగల్, నల్గొండ రెండు జిల్లాలలోనే న‌డిచింది. కొద్దిపాటిగా కరీంనగర్, హైదరాబాద్ లోనూ ఈ రెండు జిల్లాల ఉద్యమాలతోనే, అది కూడా కమ్యునిస్టులు చేసిన ఉద్యమాలతోనే నిజాం తల వంచి దిగిపోయారని, రజాకార్లు తోక ముడిచారని గొప్పలు చెప్పుకొనే కమ్యునిస్టులు నిజాం తలవంచిన రోజు నిజాం పంచన ఎందుకు చేరారో చెప్పరు. నిజాం తల వంచడం, రజాకార్లు తోక ముడువడమే సాయుధ పోరాట లక్ష్యమైతే, మరి నిజాం తలవంచి రజాకార్లు తోకముడిచిన 1948 సెప్టెంబర్ 17 రోజున మీ పోరాటం ఎందుకు ఆగిపోలేదు. మీరు భారత ప్రభుత్వానికి, మిలిటరీకి వ్యతిరేకంగా 1948, సెప్టెంబర్ 17 తర్వాత కూడా సాగించిన సాయుద పోరుపై మీ పార్టీ అగ్రనాయకుడు శ్రీ రావి నారాయణ రెడ్డి రచించిన ‘తెలంగాణ నగ్న సత్యాలు’ పుస్తకంలో ఎండగట్టిన విషయం ఎందుకు ప్రస్తావించరు. కమ్యునిస్టు పార్టీ ఆంధ్ర‌ నాయకత్వంలో భారత ప్రభుత్వానికి, నిజాంలను గద్దెదించడానికి వచ్చిన మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడడం అంటే మనం హిమాలయాల అంత పెద్ద తప్పు చేస్తున్నామని మీ అగ్రనాయకుడే మీ నాయకత్వాన్ని చీల్చి చెండాడినా మీరు మీ పంథా మీదే గాని, ప్రజా పంథాని అనుసరించలేదు. ఈ పోరుతో ఆశించిన ఫలితాలు రాక పోగా సాయుధపోరు ఒక వ్యక్తిగత హింసావాదంగా మారిందన్న రావి మాటలు అక్షరసత్యం కాదా? కేవలం నాలుగేళ్ల పాటు నిజాంవ్యతిరేక పోరాటం పేరుతో సాగించిన పోరులో సింహభాగం స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగానే సాగింది. అన్ని పార్టీలతో కలిసి హిందూ భావజాలంతో ఏర్పడ్డ ఆంధ్రమహా సభలో చొరబడి కేవలం 11వ, 12వ ఆంధ్ర మహాసభ నాయకత్వాన్ని చేజిక్కించుకొని ఆంధ్ర మహాసభ సాగించిన పోరునంతా తమ ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. నిజాం వ్యతిరేక పోరాటం అంటారు. తీరా ‘ఆపరేషన్ పోలో” ప్రారంభమవుతుందనగా నిజాం వంచన చేరి రజాకార్లతో ఆయుదాలు పంచుకొని, తెలంగాణ ప్రజల్ని విముక్తుల్ని చేసి నిజాం మెడలు వంచడానికి వచ్చిన భారత భద్రతాదళాలకు వ్యతిరేకంగా సాయుధ‌ పోరాటం సాగించారు..

హైదరాబాద్ సంస్థాన ప్రజల కడగండ్లను మొదటి సారి ఒప్పుకున్న నెహ్రూ, భారత ప్రభుత్వం పోలీస్ యాక్షన్ కు సిద్ధపడుతున్నదని తెలియగానే 1948 మే 4న కమ్యూనిస్టు పార్టీ నిజాం రజాకార్లతో కుమ్మక్కై “స్వతంత్ర భారత ప్రభుత్వం భూస్వామ్య బూర్జువా ప్రభుత్వమని, ఆ ప్రభుత్వ దళాలను హైదరాబాద్ సంస్థానానాకి రానివ్వద్దని ‘ఆజాద్ హైదరాబాద్: (నిజాం కోరుకున్న విధంగానే) మన లక్ష్యమని” పత్రికా ప్రకటనలు గుప్పించారు కమ్యూనిస్టులు.

తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచి నిజాంతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందంలో భాగంగానే కమ్యూనిస్టు పార్టీ అగ్ర నేతలంతా జైళ్ల‌ నుండి విడిచిపెట్టబడ్డారు. హైదరాబాద్ ప్రజలనే కాదు, కమ్యూనిస్టులను నమ్మి నడిచి అమరులైన సాయుధ రైతాంగ త్యాగాలను కూడా అపహాస్యం చేశారు.

సంస్థాన ప్రజలను మోసం చేస్తున్నమంటూ, కమ్యూనిస్టు పార్టీ క్యాడర్, రావి నారాయణ్ రెడ్డి లాంటి అగ్రనేతలు మొత్తుకున్నా కమ్యూనిస్టు పార్టీ పిడివాదంతో నిజాం లొంగిపోయిన తర్వాత కూడా సాయుధపోరును భారత ప్రభుత్వ దళాలపై కొనసాగించింది. భూస్వాములకు వ్యతిరేకంగా సాగుతున్న సాయుధ రైతాంగ పోరాటమని చెప్పినప్పటికీ, సంస్థానమంతా 2680 మంది భూస్వాములుండగా 1960 ముస్లిం భూస్వాములు, 720 మంది హిందూ భూస్వాములుండగా, మొత్తం భూమిలో నిజాం, అతని పాయేగాళ్ళ ఆధీనంలోనే 1/3వ వంతు భూమి ఉంది. మరి కమ్యూనిస్టులు అతి పెద్ద భూస్వామిగా నిజాంను ఎందుకు గుర్తించలేదు. వీరి సాయుధ పోరాటమంతా 7,8 మంది జాగీర్థార్ల పైనేనన్నది జగమెరిగిన సత్యం. ఆంధ్రా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం సాగించకుండా తెలంగాణలోనే పోరాటం సాగించడంపై మా క్యాడర్ ఒత్తిడి తెస్తున్నదని, ప్రశ్నిస్తున్నదని పుచ్చలపల్లి సుందరయ్యగారు తన ఆత్మకథలో రాసుకున్నారు.

తెలంగాణ ప్రజలు, కమ్యూనిస్టు పార్టీ క్యాడర్, లీడర్స్, భారత ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా వినిపించుకోని సిపిఐ నాయకత్వానికి సాయుధ పోరాటాన్ని విరమించాల్సిందిగా శాంతి నెలకొల్పాల్సిందిగా బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి షామీదత్ లేఖ రాశారు. చైనా కొమిన్ ఫాల్స్ జర్నల్ కూడా షామీదత్ సూచనకు మద్దతిచ్చింది. చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు కూడా శాంతి వైపే నిలిచింది. మాస్కో కూడా భారత ప్రజాస్వామ్యానికే మద్దతుగా నిలువడంతో ఎటూ పాలుపోని కమ్యూనిస్టులు 1951లో సాయుధ పోరాటం విరమించాలా? కొనసాగించాలా? అనే విషయంలో మాకు మార్గదర్శనం చేయాలని రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ను వేడుకున్నారు. ‘ఆంధ్రాదీన్స్’ పేలిపోయింది. నలుగురు సిపిఐ అగ్రనాయకుల ప్రతినిధి బృందం మాస్కోలో పడిగాపులు కాస్తూ స్టాలిన్ ను కలువడంతో అసలు మీ కమ్యూనిష్టు సాయుధ ఉద్యమానికి సోషలిస్టు స్వభావమే లేదని, నలుగురు భూస్వాముల భూములను పది మంది రైతులకు (వ్యక్తిగత ఆస్తులుగా) పంచితే అది కమ్యూనిస్టు సిద్ధాంతమెలా అవుతుందని ప్రశ్నించడంతో కమ్మీ అగ్రనాయకుల గొంతుల్లో వెలక్కాయ పడ్డట్టయింది. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమం సోషలిస్టు దశలోనే లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. సైద్ధాంతిక, రాద్ధాంతాలను కూలంకశంగా స్టాలిన్ తో చర్చించి అక్టోబర్ 21, 1951న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని విరమించారు. ‘ఏమీ సాధించకుండా మన ప్రభుత్వంతో ఏ హామీలు లేకుండా అర్ధాంతరంగా అటు ప్రజల త్యాగాలను, ఇటు క్యాడర్ త్యాగాలను అపహాస్యం చేయడమేనని’ అన్న అగ్రనాయకుడి మాటలు సరిగా సరిపోతాయి. కమ్యూనిస్టుల‌ని ‘రాత్ కా రాజా’లని, రజాకార్లను ‘దిన్ కా రాజా’లుగా సంస్థాన ప్రజలు భావించడంలో తప్పులేదని ఋజువైంది. నరమేధమంతా సృష్టించి ‘మేము ఇక్కడి ప్రజల, ప్రజా ఉద్యమాల స్వభావాన్ని అర్థం చేసుకోలేక పోయామని 1972లో పుచ్చలపల్లి సుందరయ్య తన ఆత్మకథలో పేర్కొనడం కొసమెరుపు.

రచయిత – ABVP జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు