Home News అకృత్యాల పుట్ట ఔరంగజేబు

అకృత్యాల పుట్ట ఔరంగజేబు

0
SHARE

పుస్తక సమీక్ష

-బాలాజీ సుబ్రమణియన్

మొఘల్ వంశానికి చెందిన ఔరంగజేబ్‌గా పేరున్న ముహి-అల్-ముహమ్మద్, భారత దేశాన్నిదీర్ఘకాలం పరిపాలించాడు. శ్రీ సౌరభ్ లోహోగాంవ్ కర్ గారు,తన గ్రంథం ‘Aurangzeb – Whitewashing Tyrant& Distorting Narratives” లో ప్రపంచంలోని అత్యంత క్రూరమైన, నీచమైన సామూహిక హత్యలు జరిపించిన అతని హేయమైన చర్యల గురించి ఒక వరుసలో వాస్తవ సమాచారాన్ని చారిత్రక సాక్ష్యాలు, ఆధారాలతో సహా వివరించారు.

శ్రీ లోహోగాంవ్ కర్ గారి గ్రంథం అటువంటి అంధకార సమయంలో జరిగిన లక్షలాది హిందువుల ఊచకోత, దేవాలయాలపై దాడులు, దోపిడీలు చేసి, నేలమట్టం చేయటం వంటి వికృత కరాళ చర్యలను కళ్ళకు కట్టినట్లు వివరించటం వలన, ఒక అపరాధ పరిశోధన నవల చదువుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో రచయిత – ఔరంగజేబు క్రూరత్వము,ముస్లిమేతరుల పట్ల అతనికి గల ద్వేషము, ఇటీవలనే ఇస్లాంలోకి మతం మార్చబడిన వారిపట్ల, ఇంకా షియా ముస్లింల పట్ల అతనికి గల అపనమ్మకము మొదలైన వాటికి అద్దం పడుతుంది.

ఈ గ్రంథంలో ఈ మొఘల్ చక్రవర్తికి తన కాలంలో తాను తైమూర్ జాతికి చెందినవాడినన్న అతిశయం బాగా ప్రతిబింబిస్తుంది. ఇంకా, అతను భారత్‌ను ఒక దేశంగా కాక, తన స్వంత జాగీరుగా భావించి, కాఫిర్ల (దైవద్రోహులు) భూమిగా భావించి, ఇక్కడి కాఫిర్లను అంతం చేయడమో లేక వాళ్ళను మతం మార్చి ముస్లింలుగా మార్చడమో తన కర్తవ్యంగా భావించేవాడు అని తెలియజేస్తుంది.

ఈ గ్రంథం వాస్తవంగా ఎంత శాతం విదేశీ ముస్లింలు, ఎంత శాతం ఇక్కడి మతం మార్చబడిన ముస్లింలు, ఇంకా ఎంత శాతం గొప్ప లేదా ఉన్నత వంశ హిందువులకు ఇవ్వబడిందో తెలియజేస్తుంది. అంటే, ఔరంగజేబు కొలువులో ఎంతమంది ఇరానీ-తురుష్క ముస్లింలు ప్రాధాన్యత కలిగి ఉన్నారో, ఖచ్చితమైన శాతం ఎంతో వివరిస్తుంది.

అతని కొలువులో విదేశీయులు, అంటే విదేశీ ముస్లింలు 65%, భారతీయ ముస్లింలు 14% మాత్రమే ఉండేవారు, ఇంకా అతను ఎప్పుడూ నమ్మని హిందువులు 20% కంటే తక్కువ ఉండేవారు. ఈ విషయంలో రచయిత చార్టుల సహాయంతో వాస్తవ గణాంకాలను వివరించారు.

ఒక అమెరికన్ చరిత్ర కారుడు, విల్ డురాణ్ట్ (Will Durant), తన Our Oriental Heritage అనే గ్రంథంలో – “ఔరంగజేబు తన క్రూరమైన అర్థశతాబ్ద పాలనలో, సంస్కృతి, కళలు నిలదొక్కుకొనేందుకు ఆస్కారం ఇవ్వలేదు. ఇతర ప్రజలు అంటే, ముఖ్యంగా హిందువుల సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలను తన కుత్సిత మత మౌఢ్యంతో కూల్చివేశాడు. భారత్‌లో తన మతం తప్ప ఇతర మతాలు ముఖ్యంగా హిందూమతాన్ని సమూలంగా నాశనం చేయాలని విఫల యత్నం చేశాడు”, అని వివరించాడు.

Aurangzeb – Whitewashing Tyrant & Distorting Narratives అనే ఈ ప్రస్తుత గ్రంథం మనకు, ఔరంగజేబు క్రౌర్యాన్ని, తీవ్రమైన అధికారపిపాసను, దానికోసం అతను తన స్వంత సోదరులను, బంధువులను చంపేందుకు కూడా వెనుకాడని పైశాచిక కాంక్షనూ తెలియచేస్తుంది. ఇంకా అతని మతమౌఢ్యం, ముస్లిమేతరులపై జిజియా పన్ను విధించటం నుంచి తన సామ్రాజ్య విస్తరణలో కాఫిర్ల పరిపాలన లేకుండా చేయటం వరకూ ఉన్నది అని తెలియజేస్తోంది.

ఏది ఏమైనప్పటికీ, అతని కుటిలమైన జిత్తులమారి గుణాలు, తన మతపిచ్చను మొఘల్ సింహాసన వారసుడిగా జరిపిన అక్రమ ఆక్రమణలో కనబడతాయి. అతని నిరంకుశత్వ ధోరణి, అతని బుర్రలేని అనుచరులను, అతని తీవ్రమైన నిర్ణయాలను ప్రభావితం చేసింది అని చెప్పచ్చు. అతను తన అన్న దారా షికోను తెలివిగా, ఇంకా చెప్పాలంటే మోసంతో, తమ తండ్రి, ఇతర ప్రజలు ఏ మాత్రం ఇష్టపడకుండా వికటచర్యలు చేపట్టి చాలా జాగ్రత్త పడ్డాడు. ఇది దారా షికోకి ఒక మానసిక వ్యథను తెచ్చిందని చెప్పవచ్చు.

దారా షికో పట్టుబడిన తర్వాత, అతను తన అన్నకు క్షమించమని, ఇంకా తనకి పదవులు అక్కరలేదని, కొత్త నాటకం ఆడతాడు. ఇది గ్రంథం చదివేవారికి కొత్త సమాచారాన్ని ఇస్తుంది. అయినా వాళ్ళు ఇదంతా త్వరగానే మర్చిపోతారు కదా. కానీ, దారా షికో వేదాలను పర్షియన్ భాషలోకి అనువదించటం ఔరంగజేబుకి సుతరామూ ఇష్టం లేదు, ఇది ఒక రకంగా అతని ధృఢమైన ఇస్లాం మతవిశ్వాసాలకు విరుద్ధంగా తోచింది. అందుకే, తన వికృతమైన లక్ష్యం కోసం అతను, తన అన్న దారా షికోను, సింహాసనం నుండి అడ్డు తొలగించేందుకు, కుట్రతో మతభ్రష్టుడిగా ప్రకటించి, దారాషికోను చంపించేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.

ఇలా ప్రజలను దైవదూషణ పేరుతో, మతభ్రష్టులు అన్న పేరుతో ఇస్లాం వాదులు చంపేయటం మనము ఇప్పటికీ చూస్తున్నాము. తన అన్న దారా షికోను చంపి, అతని తలను ఢిల్లీ అంతటా ప్రదర్శించి, ప్రజలలో భయాందోళనలు కలిగించే విధంగా, తన విజయాన్ని జరుపుకున్నాడు.

కొందరు విదేశీ చరిత్రకారులు, అతని తరవాత 300 సంవత్సరాల వరకూ, అతను చాలా పవిత్రమైన,సామాన్యమైన, నిరాడంబరమైన మత జీవనం గడిపాడని చిత్రీకరించారు. కానీ, వాస్తవం ఏమిటంటే అతను ఈ భూమిపై జన్మించిన ఒక ప్రతీకారం తీర్చుకొనే స్వభావం గల క్రూరమృగమని మనకు తెలియజేయలేదు. తన అన్న వంతు అయిపోయాక, తన తమ్ముడు మురాద్ బక్ష్‌ను కూడా కారాగారంలో పడేసి మత్తుమందులతో అతడిని అచేతనుడిగా చేశాడు. అలాగే, తన మేనల్లుడు సులేమాన్ షికో గతి కూడా అంతే. వాళ్ళిద్దరికీ చివరి రక్తం వరకూ పిండి, ఉరితీసి, గ్వాలియర్ వద్ద ద్రోహుల శ్మశానవాటికలో పూడ్చి వేయించాడు.

ఔరంగజేబు తన అంధ మత విశ్వాసం మరియు ప్రతీకారం తీర్చుకొనే క్రూరమైన స్వభావంతో, నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉండటం వలన, మొఘల్ ఖజానా తరిగిపోతూ వచ్చింది. పర్షియా పారిపోయిన అతని స్వంత కొడుకు అక్బర్ –తన తండ్రికి గల సామ్రాజ్య విస్తరణ అనే వెర్రిపిపాస గత పాతికేళ్లలో మొఘల్ సైన్యాన్ని ధ్వంసం చేసిందని చెప్పాడు, ఇంకా ఏం చెప్పాడంటే.. సైనికులు బీదవారైనారు, వాళ్ళకు ఆయుధాలు ఇవ్వలేదు, ప్రజలలో నిరుద్యోగం ప్రబలింది, వ్యాపారస్తులు హత్య కావించబడ్డారు. వాళ్ళ ఆస్తులు, వస్తువులు దోచుకున్నారు. విశాలమైన, సారవంతమైన దక్కన్ భూములు, ఇప్పుడు సాగు లేక, ఏమి పండించక, బీడు భూములైనాయి. (పేజి 250)

ఔరంగజేబు సామ్రాజ్యం అతనివలె అస్థిరమైనది, ఎందుకంటే, అతను ఒక మతిస్థిమితం లేని పాలకుడు, ఎవరినీ నమ్మడు, కాబట్టి అతను, అతని సైన్యం ఎక్కడికి పోతే అక్కడ పచ్చని పొలాలు కూడా బీడు భూములే అయ్యేవి, అతని సైనికులు దేశమంతటా దోపిడీలు, దాడులు చేసేవారు, ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అతను మరాఠా సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేయాలని ముట్టడి చేయగా, మొఘలులకి అది చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది, ఎలాగంటే, ఖజానా ఖాళీ అయింది. అతని సామ్రాజ్యం అంతటా తిరుగుబాట్లు, స్వాతంత్ర్య పోరాటాలు నిరంతరం జరుగుతూ ఉండేవి.

శ్రీ సౌరభ్ లోహోగాంవ్‌కర్ గారు కేవలం ఒక ప్రముఖ చరిత్రకారుడే కాక, చారిత్రక వాస్తవాలను అందరికీ తెలియజేయాలనే తపన గల ఒక సాధారణ భారతీయుడు కూడా. ఆయన గ్రంథం నుంచి ఒక ముఖ్యమైన అంశం ఇలా ఉటంకిస్తుంది – “ సింహాలు తమ తమ స్వంత చరిత్రకారులను ఏర్పరచుకోకపోతే, వేటాడే చరిత్ర ఎప్పుడూ వేటగాళ్ళ సామర్థ్యాన్నే ప్రశంసిస్తూ ఉంటుంది.”

SOURCE: ORGANISER
అనువాదం: సత్యనారాయణమూర్తి